ETV Bharat / bharat

'నుపుర్​, జిందాల్​ను అరెస్టు చేయాల్సిందే'.. అనేక చోట్ల నిరసనలు, హింస

author img

By

Published : Jun 10, 2022, 2:28 PM IST

Updated : Jun 10, 2022, 7:36 PM IST

మత ప్రబోధకుడిపై భాజపా మాజీ నేతలు చేసిన వ్యాఖ్యలు దేశంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. నుపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌  చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పలు ప్రాంతాల్లో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, ఝార్ఖండ్, జమ్ముకశ్మీర్‌, బంగాల్‌లో నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఆందోళన కారులను అదుపు చేసేందుకు యత్నించిన పోలీసులకు గాయాలయ్యయి. నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌ను తక్షణమే అరెస్టు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

nupur sharma comment on muhammad
nupur sharma comment on muhammad

మతప్రబోధకుడిపై వ్యాఖ్యలు చేసిన నేతలను భాజపా నుంచి సస్పెండ్ చేసినా వివాదానికి ముగింపు పడటం లేదు. నుపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ చేసిన వ్యాఖ్యలతో ఇస్లాం దేశాల నుంచి వ్యతిరేకత రాగా దేశంలోనూ ఆగ్రహజ్వాలలు ఎగిసి పడుతున్నాయి. రాళ్ల దాడులు, బాష్ప వాయువు ప్రయోగాలతో ఆయా ప్రాంతాలు రణరంగంగా మారాయి. దిల్లీ జామా మసీదు వద్ద శుక్రవారం ప్రార్థనల అనంతరం నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జామా మసీదు వద్ద జరిగిన ఆందోళనలతో తమకు సంబంధం లేదని మసీదు కమిటీ తెలిపింది. ఆందోళనలకు తాము ఎలాంటి పిలుపు ఇవ్వలేదని స్పష్టం చేసింది.

హింసాత్మకం.. ఝార్ఖండ్‌లో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రాంచీలోని హనుమాన్ ఆలయం వద్ద నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. రెచ్చిపోయిన ఆందోళనకారులు వాహనాలకు నిప్పంటించారు. రాంచీలో ఘర్షణలు తలెత్తిన ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. ప్రజలెవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. జమ్ముకశ్మీర్‌లోనూ నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. కశ్మీర్‌లోని కిష్త్వార్‌ ప్రాంతంలో అధికారులు కర్ఫ్యూ విధించారు. శ్రీనగర్‌, కిష్త్వార్‌, భదేర్‌వా ప్రాంతాల్లో అంతర్జాల సేవలు నిలిపివేశారు. ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి భద్రతా బలగాలపైకి రాళ్లు రువ్వారు.

ఉత్తర్​ప్రదేశ్​లో.. ఉత్తర్‌ప్రదేశ్‌లో పలుచోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. లఖ్‌నవూ, మొరాదాబాద్‌, ప్రయాగ్‌రాజ్‌, సహ్‌రాన్‌పుర్ ప్రాంతాల్లో శుక్రవారం ప్రార్థనల అనంతరం నిరసనకారులు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించి లాఠీఛార్జ్‌ చేశారు. ఈ ఆందోళనల్లో ఒక పోలీస్‌ గాయపడినట్లు అధికారులు తెలిపారు. అదనపు పోలీసు బలగాలను ఆ ప్రాంతంలో మోహరించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆందోళనకారులను గుర్తిస్తున్నామని సహ్‌రాన్‌పూర్ జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఇప్పటికే కొంతమందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

మహారాష్ట్రలో.. ఈ వివాదం మహారాష్ట్రకు తాకింది. నవీముంబయి సమీపంలోని పాన్‌వెల్‌ పట్టణంలో దాదాపు 3 వేలమంది నిరసనకారులు మార్చ్‌ నిర్వహించారు. నుపుర్‌ శర్మ, నవీన్ జిందాల్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పుణె, ఠాణే, సోలాపుర్, పర్భణీ, బీడ్, లాతూర్‌, చంద్రాపుర్‌ జిల్లాల్లో ఆందోళనలు జరిగాయి.

బంగాల్‌లోనూ నిరసన సెగలు వెల్లువెత్తాయి. హవ్‌డా జిల్లాలో వందలాది మంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి రహదారులు దిగ్భందం చేశారు. రాళ్లు విసురుతున్న నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు రైల్వే పట్టాలను దిగ్భందించి సర్వీసులకు అంతరాయం కలిగించారు. పోలీసుల వాహనాలతోపాటు స్థానికుల కార్లు, ద్విచక్రవాహనాలకు నిప్పు పెట్టారు.

ఇదీ చదవండి: పెళ్లికి నో చెప్పిందని 'వివాహిత'పై యాసిడ్​ దాడి

Last Updated :Jun 10, 2022, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.