ETV Bharat / bharat

కేటాయింపు రూ.35వేల కోట్లు- ఖర్చు రూ.4.7వేల కోట్లు

author img

By

Published : May 8, 2021, 6:39 PM IST

Updated : May 8, 2021, 10:55 PM IST

Only Rs 4,744 Cr utilized from vaccine budget of Rs 35000 Cr
టీకాపై కేంద్రం వ్యయం అంతంతమాత్రమే!

దేశంలో వ్యాక్సినేషన్ కోసం బడ్జెట్​లో రూ.35వేల కోట్లను కేటాయించింది కేంద్రం. ఇందులో ఇప్పటివరకు రూ.4,744 కోట్లను మాత్రమే ఖర్చు చేసింది. మొత్తం నిధుల్లో ఈ వ్యయం 14 శాతం లోపే ఉంది.

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం వరుస అంతరాయాలు ఎదుర్కొంటోంది. టీకాల కొరత, నత్తనడకన పంపిణీ వంటి సమస్యలు వేధిస్తున్నాయి. దేశంలో కరోనా టీకా పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.4,744 కోట్లు ఖర్చు చేసింది. వ్యాక్సినేషన్ కోసం కేటాయించిన రూ.35 వేల కోట్లలో ఇది 14 శాతం కన్నా తక్కువ. కరోనా వ్యాప్తిని శీఘ్రమే అదుపులోకి తీసుకురావాల్సిన ప్రస్తుత సమయంలో.. నిధులను ఖర్చు చేసే విషయంలోనూ ఇంత జాప్యం నెలకొంది.

టీకాల కోసం సీరం సంస్థకు రూ.3,639.67 కోట్లు, భారత్ బయోటెక్​కు రూ.1,104.78 కోట్లు చెల్లించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సీరం సంస్థకు చేసిన చెల్లింపులలో... 11 కోట్ల డోసుల కోసం ముందస్తుగా చెల్లించిన రూ.1,732.50 కోట్లు, 15 కోట్ల టీకాల కోసం చేసుకున్న మొదటి ఒప్పందానికి సంబంధించిన రూ.2,353.09 కోట్లలో రూ.1,907.17 కోట్లు ఉన్నాయని మంత్రి వివరించారు.

సీరం సంస్థకు ప్రభుత్వం 26.60 కోట్ల డోసుల కోసం ఆర్డర్లు ఇవ్వగా.. ఇప్పటివరకు 14.344 కోట్ల డోసుల కొవిషీల్డ్​ను ఆ సంస్థ సరఫరా చేసింది. అదేవిధంగా కొవాగ్జిన్​ 8 కోట్ల డోసుల కోసం కేంద్రం రూ.1,104.78 కోట్లను చెల్లించింది. రెండో దశలో ఆర్డర్ ఇచ్చిన 5 కోట్ల కొవాగ్జిన్ టీకాలకు సంబంధించిన రూ.787.5 కోట్ల ముందస్తు చెల్లింపులు సైతం ఇందులో ఉన్నాయి.

టీకాల కోసం స్థానిక తయారీదారులకు ఆర్డర్లు ఆలస్యంగా ఇచ్చిందని కేంద్రంపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి ఈ వివరణ ఇచ్చారు. అయితే, క్రితం ఆర్థిక సంవత్సరంలో టీకాల కోసం ఎంత వెచ్చించారు, ఈ ఏడాది రూ.35 వేల కోట్ల నుంచి ఎంత ఖర్చు చేశారనే విషయాలను అనురాగ్ ఠాకూర్ వివరించలేదు.

కొత్త ఆర్డర్లు

కేంద్ర ప్రభుత్వ టీకా కార్యక్రమంపై విపక్షాలు తొలి నుంచీ విమర్శలు సంధిస్తున్నాయి. విదేశీ టీకాలకు అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించడంపై మండిపడుతున్నాయి. ఎక్కువ టీకాలు అందుబాటులో ఉంటే.. వ్యాక్సినేషన్ కార్యక్రమం నిరాటంకంగా, వేగంగా సాగిపోతుందని ప్రభుత్వానికి సూచించాయి.

ఇంతలో దేశీయ తయారీదారుల నుంచి మార్చి తర్వాత ఎలాంటి కొత్త ఆర్డర్లు చేయలేదన్న వార్తలు వెలువడ్డాయి. వీటిని ఖండించిన కేంద్రం.. కొత్త ఆర్డర్లకు సంబంధించి వివరాలు వెల్లడించింది. సీరం నుంచి 11 కోట్లు, భారత్ బయోటెక్ నుంచి 5 కోట్ల డోసుల కోసం ఆర్డర్లు ఇచ్చినట్లు ఏప్రిల్ 28న వెల్లడించింది. ఇందుకోసం రూ.2,520 కోట్లను ముందస్తుగా చెల్లించినట్లు అదేరోజు స్పష్టం చేసింది. టీకా కార్యక్రమం కోసం బడ్జెట్​లో కేటాయించిన రూ.35 వేల కోట్లలో ఇది 7.2 శాతానికి సమానం.

బడ్జెట్ ఘనం!

గతేడాదితో పోలిస్తే బడ్జెట్​లో వైద్యానికి కేటాయింపులను రూ.94,452 కోట్ల నుంచి రూ.2,23,846 కోట్లకు పెంచింది కేంద్రం. ఇది 137శాతం అధికం. వైద్యానికి కేటాయించిన బడ్జెట్​లో రూ.35 వేల కోట్లను కరోనా టీకా పంపిణీకి కేటాయించింది. అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రకటన ప్రకారం.. టీకాలపై చేసిన వ్యయం 13.55శాతమే(రూ.4,744.45)నని అర్థమవుతోంది.

రాష్ట్రాలకు 17.15 కోట్ల డోసులు

మే 6న విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 17.15 కోట్ల డోసులను పంపిణీ చేసింది కేంద్రం. ఇందులో 16.24 కోట్ల డోసులను ఆయా ప్రభుత్వాలు.. ప్రజలకు అందించాయి. 13.09 కోట్ల మందికి ఒక్కడోసు టీకా అందగా.. 3.14 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది.

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం పేరిట జనవరిలో టీకా పంపిణీ ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కరోనా యోధులైన వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, భద్రతా దళాలు, అగ్నిమాపక సిబ్బందికి తొలి దశలో టీకా అందించారు. 60 ఏళ్లు పైబడినవారికి మార్చి నుంచి టీకా ఇస్తూ వస్తున్నారు. ఏప్రిల్​లో 45ఏళ్ల పైబడిన వారిని అర్హుల జాబితాలో చేర్చారు.

వ్యాక్సిన్లను 45 ఏళ్లు పైబడినవారికే పరిమితం చేయడంపై విపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. సార్వత్రిక టీకా పంపిణీ చేపట్టాలని డిమాండ్లు మొదలయ్యాయి. మరోవైపు, కరోనా కేసుల సంఖ్య కూడా పెరుగుతుండటం వల్ల.. 18ఏళ్లు పైబడిన అందరికీ టీకా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అయితే వీరికయ్యే ఖర్చును రాష్ట్రాలే భరించాలని స్పష్టం చేసింది. ఉత్పత్తిదారుల నుంచి నేరుగా కొనుగోలు చేసుకోవాలని సూచించింది. కానీ, టీకాకు పెరిగిన డిమాండ్ వల్ల అనేక ప్రాంతాల్లో తీవ్ర కొరత ఏర్పడింది. పంపిణీని తాత్కాలికంగా నిలిపివేసే పరిస్థితులు తలెత్తుతున్నాయి.

(రచయిత- కృష్ణానంద్ త్రిపాఠీ, ఈటీవీ భారత్ డిప్యూటీ న్యూస్ ఎడిటర్)

Last Updated :May 8, 2021, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.