ETV Bharat / bharat

మూడు రెట్లు వేగంగా ఒమిక్రాన్​ వ్యాప్తి.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

author img

By

Published : Dec 22, 2021, 5:06 AM IST

Updated : Dec 22, 2021, 6:53 AM IST

omicron variant
ఒమిక్రాన్

Omicron Transmission vs Delta: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త రకం వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది కేంద్రం. ఒమిక్రాన్‌ను కట్టడి చేసేందుకు తక్షణమే వార్‌రూమ్‌లను యాక్టివేట్‌ చేయాలని కోరింది.

Omicron Transmission vs Delta: ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్‌పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసింది. డెల్టా రకంతో పోలిస్తే ఈ కొత్త వేరియంట్‌ కనీసం మూడు రెట్లు అధికంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొంది. అందువల్ల మరింత దూరదృష్టితో వ్యవహరించి డేటాని సమగ్రంగా విశ్లేషించాలని, డైనమిక్‌గా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ సూచించారు. మంగళవారం సాయంత్రం ఆయన రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల అధికార యంత్రాంగాలకు లేఖలు రాశారు. ఒమిక్రాన్‌ని కట్టడి చేసేందుకు తక్షణమే వార్‌రూమ్‌లను యాక్టివేట్‌ చేయాలన్నారు.

దేశంలోని పలు ప్రాంతాల్లో డెల్టా రకం కేసులు కూడా ఇంకా నమోదవుతున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌ వ్యాప్తికి చెక్‌ పెట్టేందుకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లాల వారీగా ఎక్కడికక్కడ సమయానుకూలంగా కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరాన్ని బట్టి నైట్‌ కర్ఫ్యూలు విధించడం, భారీ జనసమూహాలను నియంత్రించడం, కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను తగ్గించడం, ప్రజా రవాణాపై ఆంక్షలు వంటి చర్యలను లేఖలో పేర్కొన్నారు. అలాగే, ఆస్పత్రుల్లో పడకలు, అంబులెన్సులు, ఆక్సిజన్‌ పరికరాలు, ఔషధాలు వంటి వైద్య సంబంధమైన సౌకర్యాల మెరుగుదలకు అత్యవసర నిధులు వినియోగించుకోవాలని సూచించారు. 100శాతం వ్యాక్సినేషన్‌ కవరేజీని వేగవంతం చేయాలన్నారు.

Omicron Cases in India

తాజాగా మహారాష్ట్రలో 11, తెలంగాణలో నాలుగు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా నమోదైన కొత్త వేరియంట్‌ కేసుల సంఖ్య 215కి పెరిగింది. మహారాష్ట్రలో వెలుగుచూసిన 11 కేసుల్లో ముంబయిలో 8, నవీ ముంబయి, పింప్రీ చించ్వాడ్‌, ఉస్మానాబాద్‌లలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నట్లు రాష్ట్ర వైద్యశాఖ అధికారులు వెల్లడించారు.

ఇప్పటివరకు 12 రాష్ట్రాలకు ఒమిక్రాన్‌ విస్తరించగా.. అధిక కేసులు నమోదైన తొలి మూడు రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర (65), దిల్లీ (54), తెలంగాణ (24) ఉన్నాయి. అలాగే, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14 కేసులు వెలుగుచూశాయి. అయితే ఈ వేరియంట్ బాధితుల్లో ఇప్పటివరకు 77 మంది కోలుకున్నట్లు మంగళవారం ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి:

ఆ రాష్ట్రంలో ఒమిక్రాన్ ఆంక్షలు.. న్యూ ఇయర్ వేడుకలు రద్దు

Last Updated :Dec 22, 2021, 6:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.