ETV Bharat / bharat

చనిపోయానని నమ్మించేందుకు భార్యకు వీడియో కాల్​.. రైల్వే ఉద్యోగం కోసం భర్తను..

author img

By

Published : Mar 18, 2023, 11:27 AM IST

odisha-labourer-death-drama-police-arrested
చనిపోయినట్లు డ్రామా ఆడిన ఒడిశా వ్యక్తి

ఊర్లో భారీగా అప్పులు చేసి ముంబయి వెళ్లాడు ఓ వ్యక్తి. అనంతరం అక్కడ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో కలిసి ఉండేందుకు, భార్యతో విడిపోయేందుకు సినిమా తరహాలో నాటకమాడాడు. తాను చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులకు వీడియో కాల్​ చేయించాడు. ఈ ఘటన ఒడిశాలో జరిగింది. మరోవైపు, భర్త ఉద్యోగాన్ని పొందేందుకు ఓ మహిళ దారుణానికి పాల్పడింది. భర్తను హత్య చేసి ఫ్యాన్​కు ఉరివేసింది. ఝార్ఖండ్​లో జరిగిన ఈ ఘటనలో నిందితురాలికి జీవిత ఖైదు విధించింది కోర్టు.

వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి.. భార్య నుంచి విడిపోయేందుకు సినిమా తరహాలో నాటకమాడాడు. భార్యను దూరం పెట్టేందుకు, సొంతూరులో చేసిన అప్పులు ఎగ్గొట్టేందుకు.. భారీ కట్టుకథ అల్లాడు. తాను మృతి చెందినట్లు మార్చి 6న.. కుటుంబ సభ్యులకు వేరే వారితో వీడియో కాల్ చేయించాడు. తమిళనాడులో.. దుండగులు తనని కొట్టి చంపినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు వలస వెళ్లిన.. శరత్ పరిచా అనే వ్యక్తి ఈ నాటకానికి తెరలేపాడు. తీరా పోలీసులు విచారణ చేయగా అసలు విషయం బయటపడింది.

శరత్ పరిచా.. గజపతి జిల్లాకు చెందిన వ్యక్తి. బరియాపాడు గ్రామంలో నివాసం ఉండేవాడు. కొద్ది రోజుల క్రితం పని కోసం ముంబయికి వలస వెళ్లాడు. అక్కడ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. భార్యతో విడిపోయేందుకు పథకం పన్నాడు. చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. దీంతో తీవ్ర కలవరానికి గురైన శరత్​ కుటుంబ సభ్యులు.. కనీసం మృతదేహానైనా ఇంటికి తీసుకురావాలని అదావా పోలీసులను ఆశ్రయించారు.

అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు.. శరత్​ కుటుంబ సభ్యులకు వచ్చిన వీడియో కాల్​ వివరాలు సేకరించారు​. ముంబయి నుంచి ఆ కాల్​ వచ్చినట్లుగా గుర్తించారు. శరత్​ తమిళనాడులో చనిపోతే.. ముంబయి నుంచి ఎలా కాల్​ వస్తుందని పోలీసులు అనుమానించారు. వెంటనే ముంబయి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. శరత్​ బతికే ఉన్నట్లుగా తేలింది. అనంతరం అతడిని తీసుకుని ఒడిశాకు వచ్చారు పోలీసులు. ప్రస్తుతం అతడి నుంచి పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.

భర్తను చంపిన భార్యకు జీవిత ఖైదు..
ఉద్యోగం కోసం భర్తను చంపిన భార్యకు జీవిత ఖైదు విధించింది కోర్టు. 10వేలు జరిమానా విధించింది. 2017 ఝార్ఖండ్​లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో జరిగిన ఈ కేసుపై విచారించిన జిల్లా కోర్టు.. శుక్రవారం తీర్పు వెలువరించింది. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి విశ్వనాథ్ శుక్లా ఈ తీర్పును ఇచ్చారు. భర్త రాజీవ్ కుమార్​ను హత్య చేసిన అనితా కుమారికి ఈ శిక్ష విధించారు.

రాజీవ్​, అనిత 2007లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది. భార్యాభర్తలిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అవి మరింత పెరిగిన కారణంగా వీరిద్దరూ కొద్ది రోజులుగా దూరంగా ఉన్నారు. ఆ తరువాత 2013లో రాజీవ్​కు రైల్వేలో గ్రూప్ డి​ ఉద్యోగం వచ్చింది. దీంతో అనిత మళ్లీ రాజీవ్​కు చేరువైంది. చైబాసాలోని రైల్వే క్వార్టర్స్​లో దంపతులిద్దరూ తమ కుమార్తెతో కలిసి ఉన్నారు. భర్త చనిపోతే ఉద్యోగం తనకు వస్తుందని భావించిన అనిత.. 2017 జనవరిలో రాజీవ్​ను హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని సీలింగ్​ ఫ్యాన్​ వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.