నీట్ వివాదం.. ఐదుగురు అరెస్ట్.. నిజనిర్ధరణ కమిటీ ఏర్పాటు

author img

By

Published : Jul 19, 2022, 9:58 PM IST

neet
నీట్ ()

NEET Controversy kerala: నీట్​ వివాదంపై దర్యాప్తు కోసం నిజనిర్ధరణ కమిటీ ఏర్పాటు చేసింది నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ. మరోవైపు, ఈ ఘటనలో ఐదుగురు మహిళలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

NEET Controversy kerala: కేరళలో నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థినులను లోదుస్తులు విప్పాలని ఓ కళాశాల యాజమాన్యం కోరడం వివాదాస్పదమైన నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చర్యలకు ఉపక్రమించింది. ఈ ఘటనపై నిజనిర్ధరణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వివిధ మీడియా కథనాల ద్వారా తమకు సమాచారం అందిందని.. దాని ప్రకారం కమిటీ ఏర్పాటు చేసినట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. కమిటీ సభ్యులు కొల్లంను సందర్శించి నివేదిక రూపొందిస్తారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. దాని ఆధారంగా తుది చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఐదుగురు మహిళలను అరెస్ట్​ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరంతా పరీక్ష జరిగిన రోజున కళాశాలలో విధులు నిర్వర్తించినట్లు తెలిపారు.

విషయం ఏంటంటే..
ఆదివారం కేరళలో నీట్‌ పరీక్షకు హాజరైన పలువురు విద్యార్థినులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పరీక్షా కేంద్రంలోకి వెళ్లే ముందు నిర్వహించే తనిఖీల్లో భాగంగా లోదుస్తులను విప్పాలని సిబ్బంది బలవంతం చేసినట్లు కొందరు విద్యార్థినులు ఆరోపించారు. కొల్లాం జిల్లా ఆయుర్‌లోని మార్థోమా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ఈ ఘటన జరిగింది. పరీక్షా కేంద్రం వద్ద తమను తనిఖీల పేరుతో లోదుస్తులు విప్పాలని సిబ్బంది సూచించారని బాధిత యువతి పేర్కొంది. లోదుస్తులు తీసేసిన తర్వాతే అనుమతించారని తెలిపింది. దీనిపై యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరోవైపు.. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని కళాశాల యాజమాన్యం వివరణ ఇచ్చింది. బయోమెట్రిక్‌ తనిఖీలు చేసే బాధ్యత ఏజెన్సీలదేనని పేర్కొంది. కాగా, ఆదివారం పరీక్ష పూర్తయిన అనంతరం పెద్దఎత్తున లోదుస్తులను ఓ అట్ట పెట్టెలో కళాశాల సిబ్బంది బయట పడేసినట్లు కొందరు విద్యార్థులు తెలిపారు. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేరళ విద్యాశాఖ మంత్రి ఆర్‌ బిందు వ్యాఖ్యానించారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖకు లేఖరాశారు. ఈ పరీక్ష మార్గదర్శకాలను సమీక్షించాలని కేరళ ఎంపీ ఎన్‌కే ప్రేమచంద్రన్‌ డిమాండ్ చేశారు. 'పరీక్షల్లో జరిగే అవకతవకలను గుర్తించడానికి మనకు సాంకేతికత అందుబాటులో ఉంది. ఇలాంటి అనాగరిక చర్యలకు బదులు సాంకేతికతను వాడుకోవాలి. దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు నిర్వహించాలి' అని కోరారు. లోక్‌సభలో దీనిపై చర్చ జరపాలని తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు.

ఇదీ చూడండి : ధరల పెంపుపై విపక్షాల ఆందోళన..​ ఉభయ సభలు రేపటికి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.