ETV Bharat / bharat

ప్రజాక్షేత్రంలోకి లోకేశ్​- యువగళం పాదయాత్ర పునః ప్రారంభం

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2023, 3:48 PM IST

Updated : Nov 27, 2023, 9:32 AM IST

Nara Lokesh Yuvagalam padayatra
Nara Lokesh Yuvagalam padayatra

Nara Lokesh Yuvagalam Padayatra Restart: జనగళమే తన బలంగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​​ చేపట్టిన యువగళం పాదయాత్ర 79రోజుల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడుతోంది. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించటమే లక్ష్యంగా ముందుకు కదిలేందుకు సిద్ధమైంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుతో సెప్టెంబరు 9న అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడలో ఎక్కడైతే పాదయాత్రకు విరామం ప్రకటించారో తిరిగి అక్కడి నుంచే ఉదయం 10 గంటల 19 నిమిషాలకు తిరిగి ప్రారంభం కానుంది.

ప్రజాక్షేత్రంలోకి లోకేశ్​- యువగళం పాదయాత్ర పునః ప్రారంభం

Nara Lokesh Yuvagalam Padayatra Restart: అవాంతరాలను అధిగమించి లక్ష్యం దిశగా అడుగు ముందుకేసేందుకు పార్టీ శ్రేణులతో కలసి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​​ సిద్ధమయ్యారు. సీఎం జగన్‌ కక్షసాధింపు చర్యల్లో భాగంగా స్కిల్‌ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్‌ కావడంతో పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. బాబుకు పూర్తిస్థాయిలో బెయిల్ మంజూరు కావటంతో నేటి నుంచి పునఃప్రారంభం కానుంది. ఉమ్మడి తూర్పుగోదావరిలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగనున్న యువగళం పాదయాత్ర తుని మీదుగా ఉమ్మడి విశాఖ జిల్లాలోకి ప్రవేశించనుంది.

రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ పట్టణ, గ్రామీణం, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర అనకాపల్లి జిల్లాలో ప్రవేశిస్తుంది. అనకాపల్లి, విశాఖ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల మీదుగా విశాఖపట్నం చేరుకుని అక్కడ పాదయాత్రను ముగించనున్నారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు 400 రోజుల్లో 4 వేల కిలో మీటర్లు పాదయాత్ర చేయాలన్నది మొదట అనుకున్న లక్ష్యం. చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాలు, పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ, దిల్లీలో న్యాయనిపుణులతో సంప్రదింపులు, జగన్‌ ప్రభుత్వ అరాచకాలు, కక్షసాధింపుపై జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నాయకులను కలిసి వివరించడం వంటి వ్యవహారాల్లో ఇన్నాళ్లూ లోకేశ్​​ తీరిక లేకుండా ఉన్నారు. దీంతో రెండున్నర నెలల పాటు విరామం ఇవ్వాల్సి వచ్చింది.

Bhuvaneshwari met Yuvagalam volunteers యువగళం వాలంటీర్ల త్యాగాన్ని గుర్తు పెట్టుకుంటాం: భువనేశ్వరి

విశాఖపట్నంలో ముగియనున్న పాదయాత్ర.. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేయాలన్న లక్ష్యాన్ని కుదించుకుని విశాఖపట్నంలో ముగించనున్నారు. గతంలో చంద్రబాబు చేపట్టిన ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర కూడా విశాఖలోనే ముగించారు. ఆ సెంటిమెంటు కూడా కలిసి వచ్చేలా విశాఖలో పాదయాత్ర ముగించే యోచనలో లోకేశ్​​ ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. దీనికి తగ్గట్టుగా రూట్‌మ్యాప్‌ను పార్టీ వర్గాలు రూపొందిస్తున్నాయి. కుప్పంలో జనవరి 27న ప్రారంభమైన యువగళం 208రోజుల పాటు అప్రతిహతంగా కొనసాగి 2852.4 కిలో మీటర్ల మేర పూర్తయింది. ఇప్పటివరకు 9 ఉమ్మడి జిల్లాల్లో 84 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగింది. అనివార్యమైన పరిస్థితుల్లో మినహా పాదయాత్రకు ఏనాడు విరామం ప్రకటించలేదు.

అధికారపార్టీ వైఫల్యాలు, అవినీతిని యువనేత లోకేశ్​​ మాటల తూటాలతో ప్రజాక్షేత్రంలో ఎండగట్టిన తీరు అధికార పక్షానికి కంటిమీద కునుకులేకుండా చేసింది. 208రోజుల పాదయాత్రలో యువనేత లోకేశ్​కు 4 వేలకు పైగా వినతిపత్రాలు అందగా, లక్షలాది ప్రజలు నేరుగా కలుసుకుని తమ సమస్యలు చెప్పుకున్నారు. యువగళం పాదయాత్రలో కోటిమంది ప్రజలు యువనేతతో వివిధ మార్గాల్లో అనుసంధానమయ్యారు. ప్రతిజిల్లాలోనూ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభించింది. గుంటూరు జిల్లాలో 3చోట్ల యువనేత లోకేశ్​​ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొత్తంగా నిర్వహించిన 11 ప్రత్యేక కార్యక్రమాలకు ప్రజలనుంచి పెద్దఎత్తున స్పందన లభించింది.

Lokesh Protests in the Wake of Chandrababu Arrest: నా తండ్రిని చూడటానికి వెళ్లొద్దా: లోకేశ్ ఆగ్రహం

YCP Leaders Provocative Actions In Yuvagalam Padayatra: యువగళం పాదయాత్రకు ప్రజలనుంచి వస్తున్న స్పందన తట్టుకోలేక అధికార పక్షం పలుచోట్ల కవ్వింపు చర్యలకు దిగింది. భీమవరం, ఉంగుటూరు, గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు దాడులకు తెగపడితే.. పోలీసులు వారికి మద్దతుగా నిలిచారు. బాధితులపైనే ఎదురు కేసులు పెట్టడంతో 40మంది యువగళం వాలంటీర్లు జెలుకెళ్లారు. గన్నవరం నియోజకవర్గంలో విదేశాల్లో ఉన్నవారితో సహా 46మంది కీలక నాయకులపైనా తప్పుడు కేసులు పెట్టారు. అంతకు ముందు జీవో 1 సాకుతో లోకేశ్​​ ప్రచారరథం మొదలు నిలబడే స్టూల్ వరకు అన్నీ లాగేసి గొంతునొక్కే ప్రయత్నం చేశారు.

లోకేశ్​​పై మూడు కేసులు.. కుప్పంలో పాదయాత్ర ప్రారంభమైంది మొదలు తంబళ్లపల్లె నియోజకవర్గం వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతి 20 కిలో మీటర్లకు ఒకటి చొప్పున పోలీసులు 25 కేసులు నమోదు చేశారు. లోకేశ్​​పై మూడు కేసులు నమోదయ్యాయి. వీటన్నింటినీ అధిగమించి ప్రజల గొంతుకనే తనగళంగా వినిపిస్తూ లోకేశ్​​ రెట్టింపు ఉత్సాహంతో ముందుకుసాగారు. ప్రతి వందకిలోమీటర్ల మజిలీలో ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తూ.. తాము అధికారంలోకి వచ్చాక చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించారు. ఇప్పటి వరకు యువగళం పాదయాత్ర సాగిన 84 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 66 చోట్ల యువనేత లోకేశ్​​ బహిరంగసభల్లో ప్రసంగించారు. ప్రతి బహిరంగసభలో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయా నియోజకవర్గాల్లో తాము ఏం చేస్తామో స్పష్టంగా చెబుతూ రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరిన తీరు ప్రజలను ఆకట్టుకుంది.

Police Attack on Yuvagalam Volunteers: యువగళం వాలంటీర్లపై ఖాకీ కర్కశం.. నిద్రిస్తున్న వారిపై విచక్షణా రహితంగా లాఠీలతో దాడి

పాదయాత్రలో 175 నియోజకవర్గాల టీడీపీ ఇన్‌ఛార్జ్‌లు.. నేటి నుంచి పునఃప్రారంభం కానున్న యువగళం పాదయాత్రకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌ నుంచి రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్న లోకేశ్​​కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో పొదలాడ యువగళం క్యాంప్ సైట్ కి చేరుకున్నారు. యువనేతకు మద్దతుగా 175 నియోజకవర్గాల టీడీపీ ఇన్‌ఛార్జ్‌లు పాదయాత్రలో పాల్గొననున్నారు. తాటిపాక సెంటర్‌లో బహిరంగసభ అనంతరం పి.గన్నవరం నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. నగరంలో గెయిల్, ఓఎన్​జీసి బాధితులతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం మామిడికుదురులో స్థానికులతో లోకేశ్​​ భేటీ కానున్నారు. అక్కడ నుంచి పాశర్లపూడి, అప్పనపల్లి మీదుగా అమలాపురం నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. సాయంత్రం బోడసకుర్రులో మత్స్యకారులతో ముఖాముఖి కానున్నారు. అనంతరం పేరూరులో రజక సామాజిక వర్గీయులతో భేటీ అవనున్నారు. రాత్రికి అక్కడే పేరూరు శివారు విడిది కేంద్రంలో బస చేస్తారు. దాదాపు 16 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది.

Last Updated :Nov 27, 2023, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.