పాండోరా పేపర్స్​పై దర్యాప్తు షురూ.. రంగంలోకి ఆర్​బీఐ, ఈడీ

author img

By

Published : Oct 19, 2021, 3:26 PM IST

Updated : Oct 19, 2021, 4:02 PM IST

MULTI AGENCY GROUP PANDORA

అక్టోబర్ 3న విడుదలైన పాండోరా పేపర్లపై దేశంలో విచారణ ప్రారంభమైంది. ఆర్​బీఐ, ఈడీ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సహా.. పలు విభాగాల అధికారులతో కూడిన మల్టీ ఏజెన్సీ గ్రూప్ దీనిపై దర్యాప్తు చేపట్టింది.

పాండోరా పేపర్లలో వెలుగుచూసిన విషయాలపై (Pandora Papers India) దేశంలో ప్రాథమిక దర్యాప్తు ప్రారంభమైంది. పాండోరాలో ప్రస్తావించిన సంస్థలు, వ్యక్తుల అంశాలపై మల్టీ ఏజెన్సీ గ్రూప్(ఎంఏజీ) విచారణ చేపట్టింది. గత వారం తొలిసారి ఈ బృందం సమావేశమైంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఛైర్మన్ జేబీ మోహపాత్ర.. ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ), రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్​బీఐ), ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఎఫ్ఐయూ) విభాగాల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

అక్టోబర్ 3న విడుదలైన పాండోరా పేపర్లపై (Pandora Papers) చర్చించినట్లు సమావేశానికి హాజరైన వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు 380 మంది భారతీయ వ్యక్తులు, సంస్థల పేర్లు (Pandora Papers India list ) మాత్రమే బయటకు వచ్చాయని, మిగిలిన పేర్లు కూడా బయటకు వచ్చిన తర్వాత విచారణను ఎంఏజీ వేగవంతం చేస్తుందని.. ఆ వర్గాలు తెలిపాయి.

"పాండోరా పేపర్లలో ఉన్న భారత సంస్థల గురించి వివరాలు ఇవ్వాలని సంబంధిత దేశాలను సంప్రదిస్తాం. ఆటోమేటిక్ ఎక్స్​ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒప్పందం ప్రకారం సమాచారం సేకరించి.. సంబంధిత వ్యక్తుల ఆదాయాలు, విదేశాల్లో ఉన్న అకౌంట్ల వివరాలను పన్ను అధికారులు.. ప్రభుత్వం వద్ద ఉన్న వివరాలతో పోల్చి చూస్తారు. తద్వారా పన్ను ఎగవేత ఏమైనా చేశారా అన్న విషయంపై నిర్ధరణకు రావాలని సమావేశంలో నిర్ణయించాం. 'ఆకస్మిక సమాచార మార్పిడి' ఒప్పందం ప్రకారం ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్​మెంట్(ఓఈసీడీ) వేదిక ద్వారా కూడా దేశాల నుంచి వివరాలు సేకరించవచ్చు."

-సమావేశంలో పాల్గొన్న అధికారి

వివిధ దేశాల్లోని ధనవంతులు, వ్యాపారవేత్తలు.. పన్ను ఎలా ఎగవేస్తున్నారనే విషయాన్ని పాండోరా పేపర్స్ పేరుతో ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) బట్టబయలు చేసింది. పన్ను రేట్లు అతి తక్కువగా ఉండే బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ వంటి దేశాల్లో నకిలీ కంపెనీలు సృష్టించి పెట్టుబడులు పెడుతున్నారని తెలిపింది. ఐసీఐజే నివేదికలో 380 మంది భారతీయుల పేర్లు ఉన్నాయి. బాలీవుడ్ నటులు, కార్పొరేట్ సంస్థల అధినేతలు ఇందులో ఉన్నారు. ఆ వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

దేశాధినేతలు సైతం...

శ్రీమంతులకు, కార్పొరేట్ సంస్థలకు ప్రొఫెషనల్ సర్వీసులు అందించే 14 ఆఫ్​షోర్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి లీక్ అయిన రహస్య పత్రాల ఆధారంగా ఈ వివరాలు వెల్లడించింది ఐసీఐజే. మొత్తం 35 మంది ప్రస్తుత, మాజీ దేశాధినేతలు, 91 దేశాలకు చెందిన 300 మంది మంత్రులు, ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు, సైన్యాధికారులు, మేయర్లు, 100 మంది శతకోటీశ్వరులు రహస్య ఖాతాల్లో డబ్బు దాచుకున్నట్లు పాండోరా పత్రాలు (Pandora Papers Leak) వెల్లడించాయి. దీనిపై మరింత సమాచారం కోసం ఈ వార్తపై క్లిక్ చేసి చదివేయండి..

ఇదీ చదవండి:

Last Updated :Oct 19, 2021, 4:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.