ETV Bharat / bharat

నిర్దోషి అయిన కొడుకు కోసం తల్లి పోరాటం.. ఏడేళ్ల క్రితం 'చనిపోయిన యువతి'ని తీసుకొచ్చి..!

author img

By

Published : Dec 7, 2022, 8:34 PM IST

ఏడేళ్ల క్రితం అదృశ్యమైన ఓ బాలిక హత్యకు గురైందని భావించారు. ఇందులో ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేయడం వల్ల జైలుకు వెళ్లాల్సి వచ్చింది. పోలీసుల దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చేసిన నిందితుడి తల్లి.. అదృశ్యమైన యువతి కోసం సొంతంగా గాలించగా ఇటీవలే ఆమె కంటపడింది. క్రైమ్‌ థ్రిల్లర్‌ మాదిరి ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.

DES21-UP-MISSING WOMAN-REAPPEAR
DES21-UP-MISSING WOMAN-REAPPEAR

ఓ 15ఏళ్ల బాలిక ఏడేళ్ల క్రితం అదృశ్యమయ్యింది. ఆమెను కిడ్నాప్‌ చేశాడనే అభియోగాలపై ఓ యువకుడు అరెస్టయ్యాడు. ఆమె మరణించిందని దర్యాప్తులో పోలీసులు తేల్చడం వల్ల నిందితుడికి శిక్ష కూడా పడింది. అయితే, చనిపోయిందని భావించిన ఆ యువతి (22) తాజాగా బతికుండటాన్ని బాధితుడి తల్లి గుర్తించింది. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడం వల్ల రంగంలోకి దిగి ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు.

యూపీలోని అలీగఢ్‌కు చెందిన ఓ బాలిక 2015లో కనిపించకుండా పోయింది. దీంతో స్థానిక గోండా పోలీస్‌ స్టేషన్‌లో బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. కిడ్నాప్‌, బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడం వంటి అభియోగాలపై ఓ యువకుడిపై కేసులు నమోదు చేశారు. కొంతకాలం తర్వాత ఆగ్రాలో ఓ యువతి హత్యకు గురైందన్న విషయం తెలుసుకున్న బాధితురాలి తండ్రి.. అది తన కూతురేనని పేర్కొన్నాడు. దీంతో పోలీసులు హత్య కేసుగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఈ కేసులో విష్ణు( ప్రస్తుతం 25 ఏళ్లు) అనే యువకుడిపై అభియోగాలు మోపడం వల్ల అతడు జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

అయితే, పోలీసుల దర్యాప్తుపై మొదటినుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్న నిందితుడి తల్లి.. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సొంత ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో హథ్రాస్‌లో ఇటీవల ఓ మతపరమైన కార్యక్రమంలో ఏడేళ్ల క్రితం తప్పిపోయిన ఆ యువతి ఈ మహిళ కంటపడింది. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేసింది.

దీంతో ఆ యువతిని అలీగఢ్‌లో అదుపులోకి తీసుకొని స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేసేందుకు తొలుత డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌ను పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. యువతితోపాటు ఆమె తల్లిదండ్రుల నమూనాలను సేకరించామని.. డీఎన్‌ఏ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. 'నా కుమారుడిని ఈ కేసులో ఇరికించారని నాకు తెలుసు. తనను నిర్దోషిగా నిరూపించేందుకే సొంతంగా ప్రయత్నాలు చేస్తున్నాను' అని నిందితుడి తల్లి చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.