ETV Bharat / bharat

మోదీ నోట 'పెట్రో'​ మాట.. భగ్గుమన్న విపక్షాలు.. ఇంతకీ 'ధరల మోత' ఎవరి పాపం?

author img

By

Published : Apr 27, 2022, 6:12 PM IST

Updated : Apr 27, 2022, 7:23 PM IST

Modi urges states to cut tax on petrol diesel, Congress, TMC, Thackeray Attacks Modi Government
Modi urges states to cut tax on petrol diesel, Congress, TMC, Thackeray Attacks Modi Government

Fuel Price VAT: పెరుగుతున్న ఇంధన ధరలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. కేంద్రం ఎక్సైజ్​ సుంకం తగ్గించినా.. భాజపాయేతర ప్రభుత్వాలు అనుసరించలేదని, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యాట్​ తగ్గించాలని కోరారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు, పలు ప్రభుత్వాలు మండిపడ్డాయి. పెట్రోల్​, డీజిల్​పై సుంకంతో కేంద్రమే భారీగా వెనకేసుకుందని, ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించవని ఎదురుదాడికి దిగాయి.

Fuel Price VAT: దేశ రాజకీయాల్లో మరోసారి 'పెట్రో మంట' రాజుకుంది. పెరుగుతున్న పెట్రోల్​, డీజిల్​ ధరలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో.. విపక్షాలు విరుచుకుపడ్డాయి. పలు రాష్ట్రాలు వ్యాట్​ తగ్గించలేదన్న మోదీకి కౌంటర్​ ఇచ్చింది కాంగ్రెస్​. ఎన్​డీఏ ప్రభుత్వం భారీగా పెంచిన ఎక్సైజ్​ డ్యూటీ సంగతేంటని ప్రశ్నించింది. మహారాష్ట్ర నుంచి కేంద్రానికి అధిక ఆదాయం వస్తుందని, అయినా ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపుతోందని దుయ్యబట్టారు సీఎం ఉద్ధవ్​ ఠాక్రే. తృణమూల్​ కాంగ్రెస్​ కూడా ప్రధాని వ్యాఖ్యలను తప్పుబట్టింది.

ఇంతకీ మోదీ ఏమన్నారు?: పెట్రోల్​ ధరల పెరుగుదలపై మోదీ తొలిసారి స్పందించారు. కేంద్రం ఇంధన ధరలపై గత నవంబర్​లో ఎక్సైజ్​ సుంకాలు తగ్గించినప్పటికీ.. కొన్ని రాష్ట్రాలు పన్నులపై వెనక్కి తగ్గట్లేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమాఖ్య స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన ప్రధాని.. ఈ సందర్భంగా ఇంధన ధరల గురించి ప్రస్తావించారు. కరోనా పరిస్థితులపై సీఎంలతో సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధాని.

''దేశ ప్రజలపై పెట్రోల్‌, డీజిల్‌ ధరల భారం తగ్గించేందుకు కేంద్రం గత నవంబర్​లో ఎక్సైజ్‌ పన్ను తగ్గించింది. సుంకాలను తగ్గించాలని రాష్ట్రాలను కోరింది. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలు పన్ను తగ్గించాయి. మహారాష్ట్ర, బంగాల్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, ఝార్ఖండ్‌ రాష్ట్రాలు ఏవో కారణాల వల్ల పన్ను తగ్గించలేదు. దీనివల్ల వారికి ఎంత ఆదాయం సమకూరిందనే విషయాల జోలికి వెళ్లను. కానీ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నవంబర్‌లో తగ్గించాల్సిన పన్ను ఇప్పటికైనా తగ్గించి ప్రజలకు ప్రయోజనం కలిగించండి.''

- నరేంద్ర మోదీ, భారత ప్రధాని

Modi On Fuel Price: భాజపా పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, గుజరాత్​ ప్రభుత్వాలు.. వరుసగా రూ. 5000, 4000 కోట్ల చొప్పున ఆదాయం కోల్పోయినా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో వ్యాట్​ తగ్గించాయని మోదీ ప్రస్తావించారు. పొరుగు రాష్ట్రాలు అలా చేయలేకపోయాయని సునిశిత విమర్శలు చేశారు. చెన్నై, జైపుర్​, హైదరాబాద్​లో పెట్రోల్​ ధరలు.. దమన్​ దీవ్​, లఖ్​నవూ, జమ్మూ, గువాహటి, దేహ్రాదూన్​లో కంటే చాలా ఎక్కువ అని మోదీ అన్నారు. ఈ నేపథ్యంలోనే మోదీ వ్యాఖ్యలపై పలు ప్రతిపక్ష పార్టీలు, భాజపాయేతర ప్రభుత్వాలు స్పందించాయి.

'కేంద్రం.. రూ. 27 లక్షల కోట్లు వెనకేసుకుంది': భాజపాయేతర రాష్ట్రాలు.. పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించకపోవడాన్ని ప్రధాని మోదీ తప్పుబట్టడంపై కాంగ్రెస్‌ తీవ్రంగా మండిపడింది. గత యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే కేంద్రం భారీగా పెంచిన ఎక్సైజ్‌ డ్యూటీ సంగతేంటని పార్టీ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా ప్రశ్నించారు. మోదీ, కేంద్రాన్ని విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఎక్సైజ్​ సుంకాలతోనే కేంద్రం.. రూ. 27 లక్షల కోట్లు వెనకేసుకుందని దుయ్యబట్టారు.

''కాంగ్రెస్​ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్​పై ఎక్సైజ్​ డ్యూటీ రూ. 9.48, డీజిల్​పై రూ. 3.56 ఉంది. మోదీ ప్రభుత్వంలో ఈ పన్నులు రూ. 27.90, రూ. 21.80కు చేరాయి. లీటర్​ పెట్రోల్​పై రూ. 18.42, డీజిల్​పై రూ. 18.24 మేర ఎక్సైజ్​ పన్ను పెరిగింది. భాజపా ప్రభుత్వం.. పెట్రోల్​, డీజిల్​పై పన్నుల నుంచి ఆర్జించిన రూ. 27 లక్షల కోట్ల ఖాతా ఇవ్వండి.''

- రణ్​దీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి

మోదీపై విరుచుకుపడ్డ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే: వ్యాట్​ తగ్గించాలన్న మోదీ వ్యాఖ్యలపై మండిపడ్డారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే. రాష్ట్రానికి కేంద్రం రూ. 26 వేల 500 కోట్లు బాకీ ఉందని ఆరోపించారు. పెట్రోల్​, డీజిల్​ పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించదన్న ఠాక్రే.. మహారాష్ట్రపై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తోందన్నారు.

''మహారాష్ట్ర సర్కార్​కు కేంద్రం రూ. 26500 కోట్లు బాకీ ఉంది. జాతీయ స్థాయిలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో మహారాష్ట్ర వాటా 38.3 శాతం. జీఎస్టీ వాటాలో 15 శాతం. వివిధ వస్తువులపై కేంద్రం పన్నుల్లో మహారాష్ట్ర వాటా 5.5 శాతం. వ్యాట్​, కేంద్ర పన్నులను కలిపి చూసుకుంటే.. మహారాష్ట్ర నుంచే ఎక్కువ ఆదాయం వచ్చేది. ముంబయిలో లీటర్​ డీజిల్ విక్రయిస్తే.. కేంద్రానికి రూ. 24.38 రూపాయలు వస్తాయి. రాష్ట్రానికి వచ్చేది రూ. 22.37 మాత్రమే. కాబట్టి ఈ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు.''

- ఉద్ధవ్​ ఠాక్రే, మహారాష్ట్ర సీఎం

'ముందు జీఎస్​టీ బకాయిలు చెల్లించండి': ఇంధన ధరలపై ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరే మాట్లాడారని, ఇది ఏకపక్ష చర్యలా ఉందన్నారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మోదీ వ్యాఖ్యలతో ఏకీభవంచట్లేదని స్పష్టం చేశారు. ఇంధన ధరలను అదుపు చేయలేకనే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై మోదీ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తృణమూల్​ కాంగ్రెస్​ మండిపడింది. ముందు కేంద్రం జీఎస్​టీ బకాయిలు చెల్లించాలని డిమాండ్​ చేసింది.

ఇంధన ధరలపై పలు రాష్ట్రాలు వ్యాట్​ తగ్గించాలని ప్రధాని అభ్యర్థించిన నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి స్పందించారు. ప్రస్తుతానికి సుంకం తగ్గింపులో ఎలాంటి మార్పు లేదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు సీఎం బసవరాజ్​ బొమ్మై. గతేడాది నవంబర్​ 21న కేంద్రం సూచన మేరకు.. ఇంధన ధరలపై సేల్స్​ ట్యాక్స్​ తగ్గించింది కర్ణాటక సర్కార్​. దీంతో.. లీటర్​ పెట్రోల్​పై అప్పుడు రూ. 13.30, డీజిల్​పై రూ. 19.47 మేర తగ్గింది. ప్రస్తుతం బెంగళూరులో లీటర్​ పెట్రోల్​ రూ. 111.09, డీజిల్​ రూ. 94.79 వద్ద ఉంది.

దీపావళి గిఫ్ట్​గా వ్యాట్​ తగ్గింపు: గతేడాది దీపావళి ముందు రోజు పెట్రోల్​, డీజిల్​ ధరలపై ఎక్సైజ్​ డ్యూటీని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్రం పెట్రోల్​పై రూ.5, డీజిల్​పై రూ.10మేర ఎక్సైజ్ సుంకంలో కోత విధించింది. మిగతా రాష్ట్రాలను కూడా వ్యాట్​ తగ్గించాలని కోరింది. తగ్గింపు బాటలో అనేక రాష్ట్రాలు సైతం నడిచాయి. చాలావరకు భాజపాయేతర ప్రభుత్వాలు వ్యాట్​ తగ్గించలేదు. దిల్లీ కాస్త ఆలస్యంగా ఎక్సైజ్​ సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మోదీ పైవ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల తర్వాత బాదుడు: ఎన్నికల వేళ చాలా రోజులు మారని పెట్రో ధరలు.. మార్చి 22 నుంచి పెరగడం ప్రారంభించాయి. 14 సార్లు ధరలు పెరగగా.. లీటర్ పెట్రోల్‌పై మొత్తంగా రూ.10 మేర ఎగబాకింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం వల్ల ధరలను పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. ఏప్రిల్ 7 నుంచి మాత్రం ఉపశమనం లభించింది. ధరల పెంపునకు బ్రేకులు పడ్డాయి. అప్పటినుంచి స్థిరంగా ఉన్నాయి.

  • దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ. 105.45, లీటర్​ రూ. 96.71గా ఉంది.
  • ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.120.5 చేరగా, లీటర్​ డీజిల్​ రూ. 104.75గా ఉంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్​ రూ. 119.98గా ఉండగా, లీటర్​ డీజిల్​ రూ. 105.63గా కొనసాగుతోంది.
  • హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్​ ధర రూ. 105.47గా ఉంది.

ఇవీ చూడండి: పెట్రోల్, డీజిల్​పై పన్నులు ఎంత శాతం తగ్గాయంటే..

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. రూ.95వేలు పెరిగిన బిట్​కాయిన్​

దేశంలో భారీగా తగ్గిన పెట్రో వాడకం.. ధరల మంటే కారణమా?

Last Updated :Apr 27, 2022, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.