ETV Bharat / bharat

15 ఏళ్ల మైనర్​పై గ్యాంగ్​రేప్​.. బలవంతంగా పురుగుల మందు తాగించి..

author img

By

Published : Jun 2, 2023, 2:59 PM IST

Updated : Jun 2, 2023, 4:02 PM IST

Minor girl gangraped
Minor girl gangraped

Bihar Rape Case : 15 ఏళ్ల మైనర్​పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు కామాంధులు. తర్వాత బాధితురాలికి బలవంతంగా పురుగుల మందు తాగించారు. ఈ ఘటన బిహార్​లో జరిగింది. ఓ కాలేజీ విద్యార్థికి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఆమెను ఓ పర్వత మార్గంలో పడేసి పరారయ్యారు. ఈ ఘటన కేరళలో జరిగింది.

Bihar Rape Case : 15 ఏళ్ల మైనర్​పై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెకు పురుగుల మందు తాగించారు. దీంతో బాధితురాలు స్పృహ తప్పి పడిపోయింది. నిందితులు ఘటనాస్థలి నుంచి పరారయ్యారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు కూడా మైనర్​లే అయి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటన బిహార్​.. వైశాలి జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిగామ పోలీస్​ స్టేషన్​ పరిధిలో 15 ఏళ్ల ఓ బాలిక తన అమ్మమ్మతో కలసి నివసిస్తోంది. బాలిక తల్లిదండ్రులు పట్నాలో ఉంటున్నారు. గురువారం రాత్రి బాలిక.. బహిర్భూమికి బయటకు వెళ్లింది. కాగా.. ఐదుగురు నిందితులు ఆమెను అక్కడినుంచి దగ్గర్లో ఉన్న మామిడి తోటలోకి ఈడ్చుకెళ్లారు. ఆ తర్వాత బాలికపై.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు బాలికను చంపాలనుకున్నారు. అందులో భాగంగా పురుగుల మందు తాగించి అక్కడి నుంచి పరారయ్యారు. ఎలాగోలా ఇంటికి చేరుకున్న బాలిక.. తన అమ్మమ్మకు జరిగిన విషయం చెప్పి స్పృహతప్పి పడిపోయింది. దీంతో బాధితురాలికి ప్రథమ చికిత్స చేసి.. అంబులెన్సులో హాజిపుర్​ సర్దార్​ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన తర్వాత పట్నాలో ఉన్న బాధితురాలి తల్లిదండ్రులు గ్రామానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై బాధితురాలు తల్లి స్పందించింది. ప్రతిరోజు తన కుమార్తెకు రాత్రి 11 గంటలకు ఫోన్​ చేసి మాట్లాడతానని చెప్పుకొచ్చింది. సంఘటన జరిగిన రోజు కూడా చేస్తే బాలిక ఫోన్​ లిఫ్ట్​ చేయలేదని.. ఆ తర్వాత చేస్తే అసలు విషయం తెలిసిందని ఆవేదన వ్యక్తం చేసింది. బాలిక స్పృహలోకి వచ్చిన తర్వాత ఆమె వాంగ్మూలం తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తామని పాటెపుర్​ ఎస్​ఐ పల్లవి కుమారి తెలిపారు.

కాలేజీ విద్యార్థికి మత్తుమందు ఇచ్చి రేప్​..
Student Drugged and Raped In Kerala : కేరళలో దారుణం జరిగింది. ఓ కాలేజీ విద్యార్థికి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి తెగబడ్డారు. అనంతరం ఆమెను పర్వత మార్గంలో పడేసి పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి తామరస్సేరి పోలీస్ స్టేషన్​ పరిధిలో నివాసం ఉంటోంది. మే 30న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. పర్వత మార్గంలో పడి ఉన్న బాధితురాలిని గుర్తించి రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ నిందితుడిని గుర్తించామని.. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

Last Updated :Jun 2, 2023, 4:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.