ETV Bharat / bharat

అన్నింటా సగం.. అవాస్తవం.. ఇంకా పలు రంగాల్లో మహిళల భాగస్వామ్యం తక్కువే!

author img

By

Published : Jan 5, 2023, 6:51 AM IST

'భారతదేశంలో పురుషులు, మహిళలు - 2020' పేరుతో కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన తాజా నివేదికలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. పలు రంగాల్లో మహిళల భాగస్వామ్యం తక్కువే అని ఈ నివేదిక తెలిపింది.

men-women-in-india-2020-report
భారతదేశంలో పురుషులు మహిళలు 2020 నివేదిక

అన్నింటా సగం.. ఆకాశంలో సగం.. మహిళలు అని చెప్పుకోవడమే తప్ప వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వారి భాగస్వామ్యం అంత గొప్పగా లేదు. దేశంలో వివిధ రంగాల్లో ప్రాతినిధ్యం, అక్షరాస్యత తదితర అంశాల్లో మహిళల వాటా తక్కువగానే ఉంది. వైద్యవిద్యలో మాత్రం అమ్మాయిల శాతం కొంత మెరుగ్గా ఉంది. ఈమేరకు 'భారతదేశంలో పురుషులు, మహిళలు - 2020' పేరుతో కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన తాజా నివేదిక పలు అంశాలను వెల్లడించింది. నివేదికలోని ముఖ్యాంశాలివి..

ఎమ్మెల్యేలు 11 శాతమే..

  • దేశంలో మొత్తం 4,235 అసెంబ్లీ స్థానాలుంటే.. ఎమ్మెల్యేల్లో కేవలం 11 శాతం (476) మాత్రమే మహిళలున్నారు. ఏపీలో 8%, తెలంగాణలో 5%తో జాతీయ సగటు కన్నా తక్కువగా ఉండటం గమనార్హం. అత్యధికంగా పుదుచ్చేరిలో 32% మహిళలున్నారు.
  • కేంద్ర మంత్రుల్లో మహిళలు 1995లో 11.54% ఉండగా.. 2020 నాటికి ఆ సంఖ్య 9.26 శాతానికి తగ్గింది.
  • సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో 7%, ఏపీ హైకోర్టులో 15%, తెలంగాణ హైకోర్టులో 7% మహిళలున్నారు. అత్యధికంగా సిక్కింలో 33%, దిల్లీ హైకోర్టులో 23% మహిళా న్యాయమూర్తులున్నారు.
.

అక్షరాస్యతలో..

  • జాతీయస్థాయిలో 2017 నాటికి సగటు అక్షరాస్యత మహిళల్లో 70.3% కాగా పురుషుల్లో 84.7 శాతం.
  • 2011-17 మధ్యకాలంలో జాతీయ అక్షరాస్యత 73 నుంచి 77.7 శాతానికి పెరిగింది.
  • తెలంగాణలో పురుషుల కన్నా మహిళల్లో అక్షరాస్యత గ్రామాల్లో 16.9%, పట్టణాల్లో 12.7% తక్కువ. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి అక్షరాస్యత గ్రామీణంలో 14.1%, పట్టణాల్లో 13.2% తక్కువగా ఉంది.
  • దేశంలో 15-24 ఏళ్ల వయసువారిలో.. అత్యధికంగా కేరళలో 99% వంతున యువతీ యువకులు అక్షరాస్యతను సాధించారు. ఏపీ, తెలంగాణ యువతరంలో 90.8% అబ్బాయిలు, 83.2% అమ్మాయిలు అక్షరాస్యులు.
.

వైద్యవిద్యలో మెరుగ్గా..

  • 2018-19లో దేశంలో ఉన్నతవిద్యకు సంబంధించి ఎంబీబీఎస్‌ వంటి వైద్యవిద్య కోర్సుల్లో 59.8%, ఉపాధ్యాయ డిగ్రీల్లో 59.6% అమ్మాయిలు ఉన్నారు. ఇదే ఏడాది ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లినవారిలో 31.6% అమ్మాయిలున్నారు. ఇలా విదేశాలకు వెళ్లినవారిలో మలేసియాకు 64.12%, శ్రీలంకకు 55.19%, అమెరికాకు 53.29 శాతం మంది అమ్మాయిలే ఉండటం విశేషం.
.

ఉపాధి బాటలో..

  • దేశంలో 2018-19లో రోజు కూలీ (జాతీయ సగటు) పట్టణాల్లో పురుషులకు రూ.342, మహిళలకు రూ.205; గ్రామాల్లో పురుషులకు రూ.277, మహిళలకు రూ.170 లభించింది.
  • 2018-19లో మొత్తం జనాభాలో జీవనోపాధికి గాను రోజూ ఎంతమంది పనులకు వెళుతున్నారనే లెక్కలను పరిశీలిస్తే.. తెలంగాణలోని పట్టణాల్లో 52.6% పురుషులు, 16.1% మహిళలు; గ్రామీణ ప్రాంతాల్లో 51.5% పురుషులు, 36.9% మహిళలు ఉన్నట్లు తేలింది. ఏపీలో.. పట్టణాల్లో 53.9% పురుషులు, 19.5% మహిళలు; గ్రామాల్లో 56.6% పురుషులు, 36% మహిళలు ఉన్నారు.
  • దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం జాతీయ వాణిజ్య బ్యాంకుల్లో.. అధికారుల స్థాయిలో 14.51%, క్లర్కుల్లో 14.27%, సబార్డినేట్ సిబ్బందిలో 12.02%, మొత్తం ఉద్యోగుల్లో 13.99 శాతమే మహిళలున్నారు. పట్టణాలతో కలిపి మొత్తంగా అధికారుల్లో 22.85% మహిళలున్నారు.

మహిళల పేరిట ఆస్తులూ తక్కువే..
ఎవరి పేరుతో ఆస్తులున్నాయనేది పరిశీలిస్తే తెలంగాణలో 31%, ఏపీలో 27% ఆస్తులే మహిళల పేరుతో ఉన్నాయి. జాతీయ సగటు 22%. అత్యధికంగా మణిపుర్‌లో 80%, అరుణాచల్‌ప్రదేశ్‌లో 56%, నాగాలాండ్‌లో 42%, సిక్కింలో 41% ఆస్తులు మహిళల పేరుతో ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.