ETV Bharat / bharat

'శాంతిభద్రతల పరిరక్షణలో విఫలం'.. మణిపుర్‌ డీజీపీకి సుప్రీంకోర్టు సమన్లు

author img

By

Published : Aug 1, 2023, 3:51 PM IST

Updated : Aug 1, 2023, 5:02 PM IST

Manipur Violence Supreme Court : మణిపుర్​ హింసపై సుప్రీం కోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతి భద్రతలు కాపాడంలో ప్రభుత్వ యంత్రాగం, పోలీసులు విఫలమయ్యారని అభిప్రాయపడింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు మణిపుర్‌ డీజీపీ తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

manipur-violence-supreme-court-directed-manipur-dgp-to-appear-before-them
మణిపుల్ హింసపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు

Manipur Violence Supreme Court : మణిపుర్​లో శాంతిభద్రతలు నెలకోల్పడంలో ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమయ్యాయని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. మణిపుర్​ దారుణాలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంలోనూ అక్కడి పోలీసులు అలసత్వం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్​ఐఆర్​లు దాఖలు తీరు సైతం సరిగ్గా లేదని మండిపడింది. జాతుల మధ్య ఘర్షణలో పరిస్థితులను అదుపులోకి తెచ్చే విషయంలో పోలీసులు చేతులెత్తేశారని పేర్కొంది. మణిపుర్‌ డీజీపీని శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తమ ఎదుట హాజరుకావాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

చీఫ్​ జస్టిస్​ డీవై చంద్రచూడ్​ నేతృత్వంలో జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్​.. మణిపుర్​​ ఘర్షణలపై, మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. మే 4న ఇద్దరు మహిళను నగ్నంగా ఊరేగించిన ఘటన తీవ్రంగా కలచివేసిందన్న చీఫ్​ జస్టిస్​ చంద్రచూడ్.. దారుణానికి సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఘటన జరిగిన చోటు, జీరో ఎఫ్​ఐఆర్, రెగ్యూలర్​ ఎఫ్​ఐఆర్​ నమోదైన తేదీలను తమ ముందు ఉంచాలని తెలిపారు. 6వేల ఎఫ్​ఐఆర్​లలో ఎంతమంది నిందితుల పేర్లు నమోదు చేశారో తెలపాలన్న చీఫ్​ జస్టిస్​.. ఆ తరువాత వారి అరెస్ట్​కు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలన్నారు.

మణిపుర్​లో​ జరిగిన ఘటనలపై విచారణ చేయడంలో పోలీసులు తీవ్ర అలసత్వం ప్రదర్శించారన్న ప్రధాన న్యాయమూర్తి.. ఎఫ్​ఐఆర్​లను సైతం ఆలస్యంగా నమోదు చేశారని మండిపడ్డారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడంపై కేసు నమోదు చేయడంలోనూ.. పోలీసులు నిర్లక్ష్యం వహించారన్నారు. మణిపుర్​లో పరిస్థితులపై పూర్తి స్థాయి నివేదిక కోసం ఓ రిటైర్డ్​ జడ్జ్ కమిటీ లేదా సిట్​ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.

అంతకు ముందు.. జాతుల మధ్య ఘర్షణలో మేలో మొత్తం 6,523 కేసులను రికార్డ్​ చేసినట్లు మణిపుర్​ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. సోలిసిటర్ జనరల్​ తుషార్ మెహతా.. కేంద్రం, మణిపుర్​ రాష్ట్ర ప్రభుత్వం తరుపున సుప్రీం కోర్టు ముందు హాజరయ్యారు. మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలో మైనర్లతో పాటు మొత్తం ఏడుగురుని అరెస్ట్ చేసినట్లు కోర్టుకు తెలిపారు. బాధితుల స్టేట్​మెంట్​ను సైతం పోలీసులు రికార్డ్​ చేశారని తుషార్ మెహతా కోర్టుకు విన్నవించారు. కాగా.. న్యాయవాది నిజాం పాషా బాధిత మహిళ తరుపున కోర్టుకు హాజరయ్యారు.

సుమోటోగా స్వీకరించిన సుప్రీం
Manipur Incident Details : జూన్​ 20వ తేదీన.. నగ్నంగా ఇద్దరు మహిళల ఊరేగింపు ఘటనపై అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటన తనను ఆందోళనకు గురిచేశాయని, ఇలాంటి దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై కేంద్రం తగిన రీతిలో స్పందించకుంటే న్యాయస్థానమే చర్యలు చేపడుతుందన్నారు. ఈ ఘటనను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. మహిళలపై హింస దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమైన ఈ వీడియోతో ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారని పేర్కొంది.

Last Updated :Aug 1, 2023, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.