ETV Bharat / bharat

మణిపుర్​లో మళ్లీ హింస- దుండగుల కాల్పుల్లో నలుగురు మృతి- కర్ఫ్యూ విధించిన సర్కార్

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 2, 2024, 6:24 AM IST

Updated : Jan 2, 2024, 11:12 AM IST

Manipur Violence News : మణిపుర్​లో మరోసారి హింస చెలరేగింది. స్థానిక ప్రజలపైకి సాయుధ దుండగులు కాల్పులు జరపగా నలుగురు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు.

Manipur Violence News
Manipur Violence News

Manipur Violence News : ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లోని దౌబాల్ జిల్లాలో సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. లిలాంగ్ చింగ్జీవ్ ప్రాంతానికి భద్రతా బలగాలను పోలిన దుస్తులు ధరించిన దుండగులు వచ్చి ప్రజలపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు.

డబ్బులు దోచుకోవడానికి వచ్చి!
దుండగుల కాల్పుల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి దగ్గర డబ్బులు దోచుకోవడానికి నిందితులు కార్లలో వచ్చారని, అది వాగ్వాదానికి దారితీసినట్లు చెప్పారు. దుండగులను స్థానికులు తరమికొట్టారని, ఆ సమయంలో పారిపోతూ వారు కాల్పులు జరిపినట్లు తెలిపారు.

దుండగుల కార్లను తగలబెట్టిన స్థానికులు
Violence In Manipur : ఈ ఘటనతో స్థానికులు ఆగ్రహం చెందారని అధికారులు తెలిపారు. వెంటనే దుండగులకు చెందిన నాలుగు కార్లను తగలబెట్టినట్లు చెప్పారు. పరిస్థితులు ఉద్రిక్తతంగా మారడం వల్ల లోయ ప్రాంతాలైన దౌబాల్, ఇంఫాల్ తూర్పు, పశ్చిమ, కాక్చింగ్, బిష్ణుపుర్ జిల్లాల్లో మణిపుర్‌ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.

అరెస్ట్ చేసి శిక్షిస్తాం: సీఎం
మరోవైపు, ఈ హింసాత్మక చర్యను రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. త్వరలోనే అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షిస్తామని వెల్లడించారు. ఈ ఘటనపై లిలాంగ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అబ్దుల్ నాసిర్ కూడా స్పందించారు. సంబంధిత అధికారులు తనకు పరిస్థితిని తెలియజేశారని చెప్పారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. ఆ ప్రాంతంలో భద్రతను కూడా పటిష్ఠం అదేశించారు.

పోలీసు వాహనంపై కాల్పులు
మూడురోజులు క్రితం, మణిపుర్​లో పోలీస్‌ కమాండోలపై గుర్తుతెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. తెంగ్‌నౌపాల్ జిల్లాలోని మోరేలో శనివారం 3:50 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. భారత్‌ - మయన్మార్‌ అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతమైన మోరే నుంచి కీలక ప్రాంతాలకు వెళుతున్న పోలీసు కమాండో వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని సాయుధులు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ఈ పూర్తి వార్త కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

తిరుగుబాటు దళంతో శాంతి ఒప్పందం!- మణిపుర్ సీఎం ప్రకటన

మణిపుర్​లో రెండు ఉగ్రవాద గ్రూపుల మధ్య కాల్పులు- 13మంది మృతి

Last Updated : Jan 2, 2024, 11:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.