ETV Bharat / bharat

రూ.45 చోరీ కేసులో 24ఏళ్లకు తీర్పు.. వృద్ధుడికి శిక్ష.. ఎంత కాలం అంటే..

author img

By

Published : Oct 4, 2022, 8:15 AM IST

verdict after 24 years in rs 45 theft case
రూ.45 చోరీ కేసులో 24ఏళ్లకు తీర్పు.. వృద్ధుడికి శిక్ష

ఓ వ్యక్తి జేబులో నుంచి రూ.45 కొట్టేసిన కేసులో ఏకంగా 24 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది. నేరం చేశానని అంగీకరించిన వృద్ధుడికి 4 రోజుల జైలుశిక్ష వేసింది ఉత్తర్​ప్రదేశ్​ మైన్​పురిలోని న్యాయస్థానం.

  • నేరం జరిగిన తేదీ: 1998 ఏప్రిల్ 17
  • చోరీ అయిన సొమ్ము: రూ.45
  • విచారణ సమయం: 24 ఏళ్లు
  • తీర్పు వెలువడిన తేదీ: 2022 సెప్టెంబర్ 28
  • శిక్షా కాలం: 4 రోజులు

ఆశ్చర్యంగా ఉంది కదూ! ఇదేదో సరదాగా రాసింది కాదు. ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ కేసు డైరీ సంక్షిప్త రూపమిది. ఓ వ్యక్తి జేబులో నుంచి రూ.45 దొంగతనం చేసిన కేసులో ఏకంగా 24 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది. నేరం తానే చేశానని అంగీకరించిన వృద్ధుడికి 4 రోజులు జైలు శిక్ష పడింది.

ఇదీ జరిగింది..
అది 1998 ఏప్రిల్​ 17. ఉత్తర్​ప్రదేశ్​ మైన్​పురిలోని ఛపట్టీ ప్రాంతానికి చెందిన వీరేంద్ర బాథం.. పోలీసులకు ఓ ఫిర్యాదు చేశాడు. లైన్​గంజ్​ దగ్గర తన జేబులోని రూ.45ను ఇటావాలోని భూరా ప్రాంతానికి చెందిన మన్నన్​ అనే వ్యక్తి కాజేశాడని అందులో పేర్కొన్నాడు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గరున్న రూ.45ను స్వాధీనం చేసుకున్నారు. మైన్​పురిలోని సీజేఎం కోర్టు ఆదేశాలతో 1998 ఏప్రిల్ 18న మన్నన్​ను జైలుకు పంపారు.

విచారణ ఖైదీగా జైలులో 2 నెలల 21 రోజులు ఉన్నాడు మన్నన్. తర్వాత బెయిల్​పై విడుదల అయ్యాడు. కొంతకాలానికి పోలీసులు అభియోగ పత్రం సమర్పించారు. విచారణకు హాజరు కావాలని కోర్టు నుంచి సమన్లు వెళ్లినా మన్నన్​కు అందలేదట. అసలు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదట. మన్నన్​ గైర్హాజరు నేపథ్యంలో అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అయితే.. భూరా ప్రాంతంలో మన్నన్ పేరుతో ఎవరూ లేరని పోలీసులు కోర్టుకు నివేదిక ఇచ్చారు.

రూ.45 చోరీ కేసు, మన్నన్​పై జారీ అయిన అరెస్ట్ వారెంట్ ఇన్నేళ్లుగా అలానే పెండింగ్​లో ఉన్నాయి. ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడాలని ఇటీవల అనుకున్నాడు మన్నన్. తాను నేరం చేశానని ఒప్పుకుంటున్నానని, అరెస్ట్ వారెంట్ ఉపసంహరించుకోవాలని కోరుతూ గత నెల 27న మైన్​పురి సీజేఎం కోర్టును ఓ న్యాయవాది ద్వారా అభ్యర్థించాడు. ఇందుకు న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది.

2022 సెప్టెంబర్ 28న కోర్టులో ప్రత్యక్షంగా హాజరయ్యాడు మన్నన్. నేరం చేశానని జడ్జి ముందు అంగీకరించాడు. కోర్టు అతడికి నాలుగు రోజులు జైలు శిక్ష వేసింది. పోలీసులు వెంటనే మన్నన్​ను అదుపులోకి తీసుకుని.. కారాగారానికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.