Dog funerals: బెంగళూరులో ఓ హృదయవిదారక ఘటనకు సంబంధించి వీడియో వైరల్గా మారింది. ఓ ఆడీ కారు.. రోడ్డుపైన నిద్రిస్తున్న శునకంపైనుంచి దూసుకెళ్లింది. కారు డ్రైవ్ చేసిన వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేసినట్లు వీడియోలో స్పష్టంగా ఉంది. జనవరి 26న జయనగరలో ఈ సంఘటన జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకు జనవరి 31న ఓ డ్రేనేజీ సమీపంలో అదే శునకం మరణించి ఉంది. ఈ విషయం తెలిసి స్థానికులు చలించిపోయారు. డ్రైవర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కారు డ్రైవ్ చేసింది వ్యాపారవేత్త ఆదికేశవులు నాయుడు కుమారుడు ఆది అని తెలిపారు.
ఈ ఘటనపై బద్రీ ప్రసాద్ అనే స్థానికుడు సిద్ధపుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఓ వ్యక్తి కావాలని కారును ఎక్కిచడం వల్ల శునకం మరణించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
అయితే పోలీసుల విచారణలో ఆది షాకింగ్ విషయాలు చెప్పాడు. కుక్కలు అంటే తనకు అసహ్యమని, అందుకే కావాలనే కారు ఎక్కించినట్లు చెప్పాడు. నిందితుడ్ని కోర్టులో హాజరుపరచకుండానే విడుదల చేసినట్లు తెలుస్తోంది.
శునకానికి నటి రమ్య అంత్యక్రియలు..
ఈ ఘటన విషయం తెలిసి కారు డ్రైవ్ చేసిన వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నటి, మాజీ ఎంపీ రమ్య. జంతు ప్రేమికులందరూ లారా(శునకం పేరు) అంత్యక్రియలకు రావాలని ట్విట్టర్లో పోస్టు చేశారు. సమనహళ్లిలో శునకానికి మంగళవారం సాయంత్రం అంతిమ వీడ్కోలు పలికారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా ట్విట్టర్లో షేర్ చేశారు. రమ్య పిలుపుతో జంతు ప్రేమికులు కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు.
జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించే వారిని శిక్షించేందుకు మన దేశంలో కఠినమైన చట్టాలు లేవని రమ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరుగుతాయని, కానీ కావాలని ఇలా జంతువులపైకి కార్లను ఎక్కించేవారికి కఠిన శిక్షలు పడేలా చేయాలన్నారు. సంపన్నులు నేరాలు చేసి ఎలాంటి శిక్ష లేకుండా సులభంగా బయటకు వస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: భర్త మృతితో చెదిరిన కల.. నిలువ నీడలేక కష్టాల కడలిలో ఎదురీత