ETV Bharat / bharat

భార్యను ఉద్యోగుల లిస్ట్​లో చేర్చిన HR.. పనిచేయకుండానే 10 ఏళ్లుగా రూ.4 కోట్ల జీతం

author img

By

Published : Aug 1, 2023, 10:32 AM IST

Updated : Aug 1, 2023, 11:45 AM IST

man puts unemployed wife payrool
man puts unemployed wife payrool

Man Adds Unemployed Wife Name On Payrool : ఓ ప్రైవేటు సంస్థలో హెచ్‌ఆర్‌ విభాగంలో పని చేస్తున్న ఓ ఉన్నత ఉద్యోగి 10 ఏళ్ల పాటు సంస్థను మోసగించాడు. గృహిణిగా ఉన్న తన భార్య పేరును పేరోల్‌లో చేర్చి.. ప్రతి నెలా జీతం తీసుకున్నాడు. తద్వారా సంస్థకు దాదాపు రూ.4 కోట్ల మేర నష్టం కలిగించాడు. ఈ ఘటన దిల్లీలో జరిగింది.

Man Puts Unemployed Wife Payrool : గృహిణిగా ఉన్న తన భార్య పేరును పేరోల్‌లో చేర్చి.. ప్రతి నెలా జీతం తీసుకున్నాడు ఓ ప్రైవేట్​ సంస్థ హెచ్​ఆర్​. ఇలా దాదాపు 10 ఏళ్ల పాటు సంస్థను మోసగించాడు. ఫలితంగా సంస్థకు సుమారు రూ.4 కోట్ల వరకు నష్టాన్ని కలిగించాడు. ఈ ఘటన దేశ రాజధాని దిల్లీలో జరిగింది. గతేడాది డిసెంబర్​లో ఈ విషయం సంస్థకు తెలియడం వల్ల అతడిని విధుల్లో నుంచి తొలగించింది. అనంతరం దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసకున్న పోలీసులు.. న్యాయస్థానం ఆదేశాలతో పూర్తి దర్యాప్తు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

ఇదీ జరిగింది
దిల్లీ కేంద్రంగా పని చేస్తున్న మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ సర్వీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ వివిధ కంపెనీలకు సిబ్బందిని సరఫరా చేస్తుంది. ఈ కంపెనీలో రాధా వల్లబ్‌ నాథ్‌ అనే వ్యక్తి 2008లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా (ఫైనాన్స్‌ విభాగం) ఉద్యోగంలో చేరాడు. తర్వాత క్రమంగా మేనేజర్‌ స్థాయి వరకు ఎదిగాడు. తనకు వస్తున్న జీతంతో సంతృప్తి చెందకుండా అక్రమంగా డబ్బు సంపాదించాలని భావించాడు రాధా వల్లబ్. ఇందుకోసం గృహిణిగా ఉన్న తన భార్య పేరును వాడుకున్నాడు. తన కంపెనీలో అధునాతన డేటా ప్రైవసీ చర్యలు తీసుకున్నప్పటికీ.. చాకచక్యంగా వ్యవహరించి 10 ఏళ్లపాటు ఎవరికీ అనుమానం రాకుండా నెట్టుకొచ్చాడు రాధా వల్లబ్.

ఈ సంస్థలోని ఆర్థిక లావాదేవీలన్నీ కేవలం ముగ్గురు ఉద్యోగుల చేతుల మీదుగానే జరుగుతాయి. ఇందులోని పేరోల్‌ వెండర్‌కు, సంస్థలోని హెచ్‌ఆర్‌, అకౌంట్స్‌ తదితర విభాగాలకు మధ్య రాధా వల్లభ్‌ మధ్యవర్తిగా వ్యవహరించేవాడు. రాజీనామాలు, కొత్త చేరికలు, వివిధ వెండర్ల వద్ద పని చేస్తున్న ఉద్యోగుల హాజరు వివరాలను పేరోల్‌ వెండర్‌కు అందించి.. నెలవారీ జీతాలకు సంబంధించిన జాబితాను తయారు చేయించేవాడు. జాబితా తయారైన తర్వాత అనుమతి కోసం దానిని హెచ్‌ఆర్‌ డైరెక్టర్‌కు, అక్కడి నుంచి సీహెచ్‌ఆర్వో (చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ ఆఫీసర్‌)కు పంపించేవాడు. వారిద్దరి అనుమతి పొందిన తర్వాత తిరిగి అది రాధానాథ్‌ దగ్గరికి చేరుతుంది. దానిని పేరోల్‌ వెండర్‌కు పంపించి.. ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడేలా చేయడం అతడి విధి. ఇక్కడే రాధా మోసానికి పాల్పడ్డాడని సంస్థ ఎఫ్‌ఐఆర్‌లో చెప్పింది.

అనుమతి పొందిన ఎక్సెల్‌ షీట్‌ జాబితాలో మరో వరుసను జతచేసి అందులో తన భార్య పేరు, జీతం తదితర వివరాలు నింపి పేరోల్‌ వెండర్‌కు పంపేవాడని సంస్థ చెప్పింది. దీంతో అందరి ఉద్యోగులతో పాటు అతడి భార్య ఖాతాలోనూ నగదు జమయ్యేదని తెలిపింది. తన కంప్యూటర్‌ నుంచి జత చేస్తే అనుమానం వస్తుందనే ఉద్దేశంతో మరో మేనేజర్‌ లాగిన్‌ ఐడీతో పంపించి తర్వాత ఆ వరుసను డిలీట్ చేసేవాడని తెలిపింది. అంతర్గత విచారణలోనూ ఇదే అంశం వెల్లడైందని వివరించింది. జీతం కాకుండా.. 2012 నుంచి అక్రమంగా దాదాపు మరో రూ.3.6 కోట్ల నగదును కూడా అతడు తన భార్య ఖాతాకు బదిలీ చేసినట్లు సంస్థ ఆరోపిస్తోంది. ఈ సొమ్ముతో అతడు దిల్లీ, ఆయన స్వస్థలం ఒడిశా, జైపుర్‌లో ఆస్తులు కొనుగోలు చేశాడని.. అంతేకాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాడని సంస్థ ఆరోపిస్తోంది. వీటన్నింటిపై ఆరా తీసేందుకు దిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Last Updated :Aug 1, 2023, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.