ETV Bharat / bharat

రాత్రి 7 కాగానే టీవీలు, ఫోన్లు బంద్.. ఆ గ్రామంలో స్ట్రిక్ట్​గా రూల్​ అమలు!

author img

By

Published : Oct 7, 2022, 3:37 PM IST

పిల్లల భవిష్యత్​ కోసం కీలక తీర్మానం చేసింది ఓ గ్రామ పంచాయతీ. రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు ఊళ్లోని టీవీలు, సెల్​ఫోన్లు అన్నింటినీ స్విచ్ ఆఫ్​ చేయాలని నిర్ణయించింది. పిల్లల చదువు కోసం తీసుకొచ్చిన ఈ నిబంధనను ఆగస్టు 15 నుంచి పక్కాగా అమలు చేస్తోంది.

tv and mobiles turned off
రాత్రి 7 కాగానే టీవీలు, ఫోన్లు బంద్.. ఆ గ్రామంలో స్ట్రిక్ట్​గా రూల్​ అమలు!

రాత్రి ఏడు గంటలకు ఆ గ్రామంలో సైరన్ మోగుతుంది. వెంటనే ఊళ్లోని టీవీలన్నీ మూగబోతాయి. సెల్​ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ అయిపోతాయి. పిల్లలంతా బుద్ధిగా కూర్చొని, పుస్తకాలు ముందేసుకుని చదువుతారు. గృహిణులు వంట చేయడంపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తారు. ఎనిమిదిన్నర గంటల వరకు ఇంతే. ఊరంతా మౌనంగా, ప్రశాంతంగా ఉంటుంది. మహారాష్ట్ర సంగ్లీ జిల్లా కాడేగావ్​ మండలం మోహితే వడ్గావ్​ గ్రామంలో కనిపించే దృశ్యమిది. ఏదో ఒక రోజో, రెండు రోజులో కాదు. ఆగస్టు 15 నుంచి నిత్యం ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది ఆ గ్రామంలో. దీని వెనుక పెద్ద కథే ఉంది.

స్మార్ట్ లోకంలో సమయం వృథా అని..
మోహితే వడ్గావ్​ జనాభా 3,105. దాదాపు అన్నీ రైతు కుటుంబాలే. చెరకు ఎక్కువగా సాగు చేస్తారు. నీరు పుష్కలంగా ఉండడం వల్ల వ్యవసాయంపై ఆదాయమూ బాగానే ఉంటుందట. అందుకే ఎక్కువ మంది తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో చేర్చారు. కరోనా లాక్​డౌన్​ సమయంలో ఆన్​లైన్​ క్లాసులు వినేందుకు విద్యార్థులకు స్మార్ట్​ ఫోన్లు కొనిచ్చారు. అయితే.. అదే ఇబ్బందులు తెచ్చిపెట్టింది. పిల్లలంతా గంటల తరబడి మొబైల్స్​తోనే కాలం గడపడం ప్రారంభించారు. ఇంటికొచ్చాక పుస్తకం తీయడం దాదాపు మానేశారు. సాయంత్రం టీవీ సీరియల్స్​ చూస్తూ మహిళలు బిజీ అయిపోయారు. పిల్లల చదువు గురించి పట్టించుకునేవారు అరుదు అయ్యారు.

పిల్లలు చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడం లేదని ఆందోళన చెందారు గ్రామ సర్పంచ్ విజయ్ నామ్​దేవ్. ఏదొకటి చేయకపోతే మున్ముందు ఇబ్బందులు తప్పవని అనుకున్నారు. ఎన్నడూ లేని విధంగా.. ఆగస్టు 15న గ్రామంలోని మహిళలు అందరితో సమావేశం అయ్యారు. సమస్యపై చర్చించి.. పరిష్కార మార్గంపై ఏకాభిప్రాయానికి వచ్చారు. రోజూ రాత్రి 7 నుంచి 8.30 మధ్య టీవీలు, సెల్​ఫోన్లు పూర్తిగా ఆఫ్ చేయాలని తీర్మానించారు. ఈ నిర్ణయం అమలును పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వ ఉపాధ్యాయులు, అంగన్​వాడీ కార్యకర్తలు, గ్రామ సేవక్​లు, గ్రామ పంచాయతీ సభ్యులకు అప్పగించారు.

కష్టమే అయినా..
టీవీలు, సెల్​ఫోన్లకు దూరంగా ఉండేందుకు మోహితే వడ్గావ్ గ్రామ ప్రజలు మొదట్లో కాస్త ఇబ్బంది ఎదుర్కొన్నారు. క్రమంగా అలవాటుపడ్డారు. సైరన్ మోగగానే పిల్లలు పుస్తకాలు తీస్తున్నారు. అమ్మలు.. వారికి రుచికరంగా వండి పెడుతున్నారు. "రాత్రి 7-8.30 గంటలు అంటే ప్రైమ్​టైమ్. వేర్వేరు ఛానళ్లలో మంచి సీరియల్స్ వస్తాయి. అలాంటి సమయంలో టీవీ ఆఫ్ చేయడం మహిళలకు కష్టమే. కానీ.. ఆ సీరియల్స్ వల్ల పిల్లల చదువులు, వంటను నిర్లక్ష్యం చేసేవాళ్లం. వంటపై సరిగా దృష్టిపెట్టకపోవడం వల్ల ఆహారం రుచిగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. వంట ఎంతో రుచిగా ఉంటోంది" అని చెప్పారు మోహితే వడ్గావ్​కు చెందిన సువర్ణా జాదవ్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.