ETV Bharat / bharat

రూ.4 కోట్ల బీమా కోసం ఫ్రెండ్​ మర్డర్​.. యాక్సిడెంట్​గా చిత్రీకరించి..

author img

By

Published : Dec 14, 2022, 11:19 PM IST

a friend for an insurance of 4 crores
a friend for an insurance of 4 crores

స్నేహితుడి పేరుపై ఉన్న రూ.4 కోట్ల బీమాను కాజేయడానికి అతన్ని హత్య చేశారు. అనంతరం దాన్ని యాక్సిడెంట్​గా చిత్రీకరించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. ఈ దారుణం మహారాష్ట్రలో వెలుగుచూసింది. మరో ఘటనలో ఓ వ్యక్తి రూ. 60 లక్షల అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని యువకుడిని హతమార్చాడు. ఈ దారుణం ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

మహారాష్ట్రలో దారుణం వెలుగుచూసింది. బీమా సొమ్ముకోసం కొందరు వ్యక్తులు వారి స్నేహితుడిని హత్య చేశారు. మృతుడి పేరుపై ఉన్న రూ.4 కోట్లు బీమా సొమ్మును కాజేయడానికే.. దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగతావారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అర్జున్​ రమేశ్​ భలేరావ్​ అనే 46 ఏళ్ల ఓ వ్యక్తి నాసిక్​లోని డియోలలీ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అయితే, అతని పేరు మీద రూ.4 కోట్ల ఇన్సూరెన్స్​ పాలసీ ఉంది. దీంతో అతని మిత్రులు రమేశ్​ను చంపి ఆ సొమ్మును కాజేయాలని ప్లాన్ చేశారు. కానీ.. రమేశ్​ కొన్నాళ్లుగా నాసిక్​లో లేనందున వారికి అవకాశం లేకపోయింది. మూడేళ్ల తర్వాత రమేశ్​ నాసిక్​ రాగా.. అతని నలుగురు స్నేహితులు మరో మహిళ సహాయంతో రమేశ్​ను హత్య చేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా.. రమేశ్ ప్రమాదవశాత్తూ మృతి చెందినట్లు చిత్రీకరించారు. బైక్​పై ప్రయాణిస్తున్న రమేశ్​ను.. ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రమేశ్​ మరణించిన అనంతరం అతని స్నేహితులు ఆ బీమా సొమ్మును కాజేశారు. ఆ బీమా డబ్బులు పంచుకునే విషయంలో ఐదుగురు నిందితుల మధ్య వివాదం చెలరేగింది. దీంతో వారిలో ఒకరు మృతుడి సోదరుడికి అది ప్రమాదం​ కాదని.. హత్య అని చెప్పాడు. దీంతో మృతుడి సోదరుడు డిసెంబర్​ 12న.. బీమా సొమ్ము కోసమే రమేశ్​ను హత్య చేసినట్లు పోలీసులకు తెలియజేశాడు.

ఆ బీమా సొమ్ము మొత్తాన్ని మృతుడి భార్య రజినీ ఉకే పేరుతో.. ఓ మహిళ నకిలీ వివరాలను సమర్పించి ఆ డబ్బును కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే.. పోలీసులు నిందితురాలు ఆ మహిళతోపాటు.. మృతుడి స్నేహితుడు మంగేశ్​ సావర్కర్​ను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు మంగేశ్​ నుంచి ఒక గన్​తోపాటు ఆరు బుల్లెట్​లను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

యువకుడి హత్య..
ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. అద్దెకు ఉంటున్న ఓ యువకుడిని.. ఇంటి యజమాని అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని నాలుగు ముక్కలు చేసి గంగా నదిలో పడేశాడు. అక్టోబర్​ 6న గాజియాబాద్​లో ఈ హత్య జరగగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అంకిత్ ఖోకర్​​ అనే వ్యక్తి కొంతకాలం క్రితం నుంచి మోదీనగర్​లోని ఉమేశ్​ శర్మ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ప్రస్తుతం అంకిత్​ లఖ్​నవూలోని బీఆర్​ అంబేడ్కర్​ యూనివర్శిటీలో పీహెచ్​డీ చేస్తున్నాడు. అయితే కొన్ని నెలల క్రితం అంకిత్​ కుటుంబం వారికి సంబంధించిన కొంత భూమిని విక్రయించారు. భూమి అమ్మగా వచ్చిన మొత్తంలో.. రూ.60 లక్షలను తన యజమాని ఉమేశ్​కు అప్పుగా ఇచ్చాడు అంకిత్​. కొన్నేళ్ల క్రితమే అంకిత్​ తల్లిదండ్రులు మరణించారు. అంకిత్​ను హత్య చేసినా సరే అడిగేవారు.. లేరని ఉమేశ్​ గుర్తించాడు.

అయితే ఓ పథకం ప్రకారం అక్టోబర్​ 6న అంకిత్​ను చంపి.. నాలుగు ముక్కలుగా చేసి గంగానదిలో పడేశాడు. అప్పటి నుంచి ఎవరికీ అనుమానం రాకుండా అంకిత్​ ఫోన్​ను నిందితుడు ఉమేశ్​ ఉపయోగించేవాడు. అంకిత్ మిత్రుల నుంచి వచ్చే మెసేజ్​లకు మాత్రమే సమాధానం ఇచ్చి.. ఫోన్​కాల్స్​కు స్పందించేవాడు కాదు. దానితో పాటు వారికి పంపే మెసేజ్​లలో తప్పులు ఉండటాన్ని అతని​ మిత్రులు గుర్తించి.. డిసెంబర్​ 12న అంకిత్​ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అంకిత్​ బ్యాంక్​ అకౌంట్​ నుంచి భారీ మొత్తం ఉమేశ్​కు బదిలీ అయినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు ఉమేశ్​తో అతడికి సహకరించిన మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకూ పోలీసులకు మృతదేహంలోని శరీరం భాగాలు కనిపించలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.