ETV Bharat / bharat

'హిజాబ్' వివాదం హింసాత్మకం- లాఠీ ఛార్జ్​లు, రాళ్ల దాడులు

author img

By

Published : Feb 8, 2022, 6:24 PM IST

Karnataka Hijab row: హిజాబ్ వివాదం కర్ణాటకను కుదిపేస్తోంది. పలు జిల్లాలో హిజాబ్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు జరగడం వల్ల.. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు, దీనిపై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు.. శాంతియుతంగా ఉండాలని ప్రజలు, విద్యార్థులకు సూచించింది.

Karnataka Hijab row
Karnataka Hijab row

Karnataka Hijab row: కర్ణాటకలో హిజాబ్ వివాదం అంతకంతకూ తీవ్రమవుతోంది. హిజాబ్ నిబంధన అనేక విద్యాసంస్థల్లో ఉద్రిక్తతలకు దారి తీసింది. పరిస్థితి చేయి దాటిపోవడం వల్ల సెలవులు ప్రకటించాల్సిన గత్యంతరం ఏర్పడింది. విద్యా సంస్థలను మూడు రోజులు మూసేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదేశాలు జారీ చేశారు. అందరూ సంయమనం పాటించాలని ట్వీట్ చేశారు.

hijab controversy high court

మరోవైపు, అంశంపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరిగింది. ఉడుపి ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ కళాశాల విద్యార్థినులు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. శాంతియుతంగా ఉండాలని ప్రజలు, విద్యార్థులకు సూచించింది. కొందరు చెడ్డ వ్యక్తులే సమస్యను మరింత తీవ్రం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులు ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం మంచిది కాదని పేర్కొంది. తదుపరి విచారణ సోమవారం మధ్యాహ్నం 2.30కి వాయిదా వేసింది.

Hijab issue in karnataka

ఆజ్యం పోసుకున్న ఘర్షణలు

కాగా, అనేక విద్యా సంస్థల్లో హిజాబ్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. హిజాబ్ ధరించి వచ్చిన వారిని అడ్డుకోవడంపై మహిళలు అభ్యంతరం చెప్పగా.. వారిని అనుమతించిన కళాశాలలో ఇతర విద్యార్థులు కాషాయ కండువాలు కప్పుకొని రావడం వివాదాస్పదమైంది.

hijab issue in karnataka

శివమొగ్గలోని ప్రభుత్వ డిగ్రీ కళాళాల వద్ద ఇరు వర్గాల విద్యార్థులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్పీ కూడా పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లారు. కాషాయ శాలువాలు ధరించి వచ్చిన విద్యార్థులను కాలేజ్​లోకి అనుమతించకపోవడం వల్ల వారు బయట నిరనసన చేపట్టారని, అనంతరం మరో వర్గం విద్యార్థులు అక్కడకు రావడం హింసకు దారితీసిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Karnataka Hijab row
శివమొగ్గలో కాషాయ వర్గాన్ని అదుపు చేస్తున్న పోలీసులు

144 సెక్షన్

బాపూజీ నగర్ ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ కళాశాల పరిధిలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. హిజాబ్ ధరించిన విద్యార్థులకు, కాషాయ కండువాలు ధరించిన వారికి మధ్య మాటల యుద్ధంతో ప్రారంభమైన ఘర్షణ.. చివరకు రాళ్లు రువ్వుకునే స్థాయికి చేరుకుందని పోలీసులు తెలిపారు. ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారని వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో శివమొగ్గలో 144 సెక్షన్ విధించారు.

Karnataka Hijab row
మతపరమైన నినాదాలు చేస్తూ ఇలా..

ఉడుపి జిల్లాలో...

ఉడుపిలోని మహాత్మా గాంధీ మెమోరియల్ కళాశాలలోనూ నిరసనలు భగ్గుమన్నాయి. హిజాబ్ ధరించిన ముస్లిం యువతులు న్యాయం కోసం నిరసన ప్రదర్శన చేపట్టగా.. కాషాయ కండువాలు ధరించిన వ్యక్తులు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు, మరో వర్గం నీలి రంగు కండువాలు కప్పుకొని హిజాబ్​కు మద్దతుగా నిరసన వ్యక్తం చేశారు. ఇది ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు.

బాగల్​కోట్​లో...

బాగల్​కోట్​లోని రబకావిబనహట్టి ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ కళాశాలలోనూ ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో యాజమాన్యం కళాశాలకు సెలవు ప్రకటించింది.

Karnataka Hijab row
బాగల్​కోట్​లో ముస్లింల నిరసన
Karnataka Hijab row
బాగల్​కోట్​లో రోడ్డెక్కిన మహిళలు

విజయపురలోనూ హిజాబ్​ వివాదం ముదురుతోంది. క్లాస్​లో హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకిస్తూ శాంతేశ్వర ప్రీ యూనివర్సిటీ విద్యార్థులు కాషాయ కండువాలతో వచ్చారు. అయితే సిబ్బంది వారిని లోనికి అనుమతించలేదు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అనంతరం క్లాసులు సస్పెండ్ చేసి సెలవు ప్రకటించింది యాజమాన్యం.

యువతిని చూసి.. నినాదాలు చేసి..

మండ్య పీఈఎస్ కళాశాలలో హిజాబ్ ధరించిన ఓ యువతిని కాషాయ కండువా కప్పుకున్న వ్యక్తులు హేళన చేశారు. కళాశాలకు వచ్చిన యువతిని చూసి మతపరమైన నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా ఆ మహిళ సైతం నినదించింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కళాశాల యజమాన్యం కల్పించుకొని కాషాయ దళాన్ని నిలువరించే ప్రయత్నం చేయగా... యువతి భవనంలోకి వెళ్లిపోయింది.

Karnataka Hijab row
హిజాబ్ ధరించిన మహిళ వెంట కాషాయ వర్గం

హిజాబ్ వివాదం కర్ణాటకవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర విద్యార్థులకు వార్నింగ్ ఇచ్చారు. శాంతియుతంగా వ్యవహరించాలని, పోలీసులను ఉపయోగించే పరిస్థితి తీసుకురావొద్దని సూచించారు.

పార్లమెంట్​కు సెగ!

ఈ వ్యవహారం పార్లమెంట్​నూ తాకింది. కాంగ్రెస్, డీఎంకే, ఐయూఎంఎల్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, జేఎంఎం పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి.

ఇదీ చదవండి: ముదిరిన హిజాబ్​ వివాదం.. మూడు రోజులు విద్యాసంస్థలు బంద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.