ETV Bharat / bharat

'మోదీ 'జాకెట్'​ మాత్రమే ఫేమస్.. రోజుకు నాలుగు మార్చుతారు!'

author img

By

Published : May 7, 2023, 5:58 PM IST

karnataka-election-2023-mallikarjun-kharge-comments-on-modi-and-rss
కర్ణాటక ఎన్నికలు 2023

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ, బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​పై.. మల్లిఖార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ జాకెట్లు మాత్రమే ఫేమస్​ అవుతున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోవైపు.. కాంగ్రెస్​ను పగిలిన బెలూన్​గా మోదీ అభివర్ణించారు. కర్ణాటకలో హింస చెలరేగితే దానికి నిరుద్యోగం, 40 శాతం కమీషనే కారణమని ప్రియాంక ఆరోపించారు.

దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ధరించే జాకెట్ మాత్రమే ఫేమస్​ అని కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన రోజుకు నాలుగు జాకెట్లు మారుస్తారని దుయ్యబట్టారు. ఎరుపు, పసుపు, నీలం, కాషాయం రంగుల జాకెట్లు వేసుకుంటారని విమర్శలు గుప్పించారు. మహాత్మా గాంధీ కారణంగా 'గాంధీ టోపీ' ప్రాచుర్యం పొందిందని, జవహర్​లాల్​ నెహ్రూ వల్ల 'నెహ్రూ షర్ట్' ప్రసిద్ధి గాంచిందని ఖర్గే గుర్తుచేశారు. ఇప్పుడు మాత్రం మోదీ జాకెట్​లు మాత్రమే​ ఫేమస్​ అవుతున్నాయని అన్నారు. ఆదివారం తన సొంత జిల్లా అయిన కలబురగిలో కాంగ్రెస్​ అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహించిన ఖర్గే.. ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ వల్లే దేశానికి స్వాతంత్ర్య వచ్చిందని ఖర్గే గుర్తు చేశారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఆర్​ఎస్​ఎస్​ పాత్ర గానీ, బీజేపీ పాత్ర గానీ ఏమీ లేదన్నారు. ఉద్యమంలో కాంగ్రెస్​ నాయకులు దేశం కోసం ప్రాణాలు త్యాగం చేస్తుంటే.. ఆర్​ఎస్​ఎస్​ నాయకులు మాత్రం ఉద్యోగాలు పొందటంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. "70 ఏళ్లలో కాంగ్రెస్​ ఏం చేసిందని ప్రధాని అడుగుతున్నారు. ఈ 70 ఏళ్లు కాంగ్రెస్ ఏం చేయకపోతే.. దేశానికి మీరు(మోదీ) ప్రధాని అయి ఉండేవారు కాదు. మేం దేశానికి స్వాతంత్ర్య తెచ్చాం." అని ఖర్గే అన్నారు.

karnataka-election-2023-mallikarjun-kharge-comments-on-modi-and-rss
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో నరేంద్ర ఖర్గే

కర్ణాటక నుంచి ఇంతమంది బీజేపీ ఎంపీలను పార్లమెంట్​కు​ పంపిస్తే.. ఏ ఒక్క సమస్యపైనా వారు ప్రధానితో మాట్లాలేదని ఖర్గే విమర్శించారు. అందుకు మోదీ వారికి అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. మోదీ వారితో మాట్లాడరని, ఇది దూరదర్శన్​ అని.. దూరం నుంచి మాత్రమే చూడాలని ఎద్దేవా చేశారు. కేవలం టీవీ చూడటం లాంటిదేనని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్​ను తిట్టడం వల్ల దేశం అభివృద్ధి చెందుతుందా? అని మోదీని.. ఖర్గే ప్రశ్నించారు. మోదీ ఎక్కడికి వెళ్లినా "మోదీ, మోదీ" నినాదాలు చేయించుకుంటున్నారన్న ఖర్గే.. దానికి బదులు ఈ ప్రాంతానికి, దేశానికి మంచి చేయాలని హితవు పలికారు.

నిరుద్యోగం, 40 శాతం కమీషనే​ కారణం..
కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. " ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఒకవేళ కర్ణాటకలో హింస చెలరేగితే, దానికి నిరుద్యోగం, 40 శాతం కమీషనే కారణం" అని ప్రియాంక ఆరోపించారు. ఇంతకు ముందు కార్పొరేషన్ బ్యాంక్, విజయ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, కన్నడ బ్యాంక్ అనే నాలుగు వేర్వేరు బ్యాంకులు ఉండేవని.. ఇప్పుడు ఈ ప్రభుత్వం వల్ల అన్నీ ఒకే బ్యాంకుగా విలీనమయ్యాయని ప్రియాంక వివరించారు. ఆదివారం దక్షిణ కన్నడ జిల్లాలోని మూడ్​బిద్రిలో జరిగిన ప్రచారం కార్యక్రమంలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.

karnataka-election-2023-mallikarjun-kharge-comments-on-modi-and-rss
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ అబద్ధాల బెలూన్​: మోదీ..
ఆదివారం ఉదయం శివమొగ్గలో రోడ్​ షో నిర్వహించిన మోదీ కాంగ్రెస్​ను అబద్ధాల బెలూన్​గా అభివర్ణించారు. దాన్ని ప్రజలు పగలగొట్టారని.. అది ఇక పనిచేయదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ భయపడిందని ఆరోపించిన మోదీ.. అందుకే మాజీ కాంగ్రెస్​ అధ్యక్షురాలిని ప్రచారంలోకి దింపిందన్నారు. ఈ రోడ్​ షోలో తనపై ప్రజలు ఎంతో ప్రేమ చూపారన్న ప్రధాని.. దానిని తిరిగి వడ్డీతో సహా వారికి చెల్లిస్తానని హామీ ఇచ్చారు.

karnataka-election-2023-mallikarjun-kharge-comments-on-modi-and-rss
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.