అప్పుడు ఒక్క ఓటు తేడాతో ఓటమి.. ఇప్పుడు 59వేల మెజారిటీతో బంపర్​ విక్టరీ

author img

By

Published : May 14, 2023, 11:16 AM IST

Updated : May 14, 2023, 11:35 AM IST

karnataka-assembly-election-2023-results-ar-krishnamurthy-wone-by-59-thousand-votes
ఏఆర్ కృష్ణమూర్తి కాంగ్రెస్ ()

Karnataka Election 2023 Results : గతంలో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన ఓ అభ్యర్థి.. తాజాగా జరిగిన ఎన్నికల్లో 59వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్​ పార్టీ నుంచి బరిలోకి దిగిన ఆయన.. బీజేపీ సిట్టింగ్​ ఎమ్మెల్యేపై విజయం సాధించారు. జేడీఎస్​ అభ్యర్థి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు.

Karnataka Election 2023 Results : 2004 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన ఆ అభ్యర్థి.. 2023 ఎన్నికల్లో మాత్రం 59వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన.. బీజేపీ అభ్యర్థిపై భారీ విజయం సాధించారు. చామరాజనగర జిల్లాలోని కొల్లేగల అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన ఏఆర్​ కృష్ణమూర్తి.. సమీప ప్రత్యర్థి ఎన్​ మహేశ్​పై విజయ ఢంకా మోగించారు. గతంలో జరిగిన పలు ఎన్నికల్లో అనేక సార్లు ఓటమి చవిచూసిన​ కృష్ణమూర్తి.. ఈ సారి సిట్టింగ్ ఎమ్మెల్యేపై సునాయసంగా గెలిచారు.

తాజాగా జరిగిన ఎన్నికల్లో ఏఆర్ కృష్ణమూర్తికి మొత్తం 1,08,363 ఓట్లు వచ్చాయి. సిట్టింగ్​ ఎమ్మెల్యే ఎన్​ మహేశ్..​ 48,844 ఓట్లను మాత్రమే పొందారు. జేడీఎస్​ తరఫున పోటీ చేసిన బి పుట్టస్వామి జాతీయ పార్టీలకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. ఆయన కేవలం 3,925 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. 2018 ఎన్నికల్లో ఎన్​ మహేశ్​ బీఎస్​పీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అనంతరం కుమార స్వామి కేబినెట్​ మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత వివిధ కారణాల రీత్యా 2021లో బీజేపీలో చేరారు. జేడీఎస్ నుంచి బరిలోకి దిగిన పుట్టస్వామి.. పోలీసు ఇన్​స్పెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మరి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారు.

"నేను అప్పుడు ఒక్క ఓటుతో ఓడిపోయాను. కానీ ఇప్పుడు 50వేల ఓట్లతో గెలుపొందాను. ఎన్ని ఓట్ల తేడా అనేది ముఖ్యం కాదు. విజయం సాధించామా లేదా అన్నదే ముఖ్యం."
-ఏఆర్​ కృష్ణమూర్తి, ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి

ఏఆర్ కృష్ణమూర్తి.. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో సంతేమారనహళ్లి స్థానం నుంచి జేడీఎస్​ తరఫున బరిలోకి దిగారు. అప్పుడు బీజేపీ నుంచి కాంగ్రెస్​ పార్టీలో చేరిన ఆర్ ధృవనారాయణపై ఓటమిని చవిచూశారు. ఆ ఎన్నికల్లో కృష్ణమూర్తి మొత్తం 40,751 ఓట్లు పొందారు. ఆర్ ధృవనారాయణ 40,752 ఓట్లు సంపాందించి ఒక్క ఓటు తేడాతో గెలిచారు. అయితే ఓట్ల లెక్కింపుపై కృష్ణమూర్తి అనుమానం వ్యక్తం చేశారు. మరోసారి కౌంటింగ్​ జరపాలని అధికారులను కోరారు. అనంతరం అధికారులు మరోసారి లెక్కపెట్టినప్పటికి అవే ఫలితాలు వచ్చాయి.

ఫలితాల సరళిపై కర్ణాటక హైకోర్టు, సుప్రీం కోర్టును సైతం కృష్ణమూర్తి ఆశ్రయించారు. ఆ తరువాత 2008లో ఆయన బీజేపీలో చేరారు. ఆ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఆర్ ధృవనారాయణ చేతిలో 11,800 ఓట్ల మోజారిటీతో ఓడిపోయారు. అనంతరం 2018లో కృష్ణమూర్తి కాంగ్రెస్​లో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందటంపై కృష్ణమూర్తి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Last Updated :May 14, 2023, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.