ETV Bharat / bharat

సీఎం సహా క్యాంపులకు ఎమ్మెల్యేలు.. ఆ పార్టీ నుంచి తప్పించుకునేందుకే!

author img

By

Published : Aug 30, 2022, 4:58 PM IST

Updated : Aug 30, 2022, 6:47 PM IST

Jharkhand Crisis : సంక్షోభం అంచున నిలిచిన ఝార్ఖండ్​లోని సంకీర్ణ ప్రభుత్వం తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడింది. ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడనుందన్న సంకేతాల నేపథ్యంలో యూపీఏ తమ శాసనసభ్యులను క్యాంపులకు తరలించింది. అంతా ఛత్తీస్​గఢ్​లోని రాయ్​పుర్​కు చేరుకున్నారు.

Jharkhand Crisis UPA shifting MLAs to Chhattisgarh to prevent BJPs poaching bid
Jharkhand Crisis UPA shifting MLAs to Chhattisgarh to prevent BJPs poaching bid

Jharkhand Crisis : ఝార్ఖండ్​ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రం రాజకీయ సంక్షోభం నడుమ ఊగిసలాడుతోంది. ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు భాజపా ప్రయత్నిస్తోందని అధికార యూపీఏ ఆరోపిస్తోంది. అందుకే తమ ఎమ్మెల్యేలను ఛత్తీస్​గఢ్​కు తరలించింది.
ఈ మేరకు ఎమ్మెల్యేలతో రెండు బస్సులు తొలుత ముఖ్యమంత్రి హేమంత్​ సోరెన్​ నివాసం నుంచి రాంచీ ఎయిర్​పోర్ట్​కు బయర్దేరాయి. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రాయ్​పుర్​కు చేరుకున్నాయి. అక్కడ మేఫెయిర్ రిసార్ట్​లో ఎమ్మెల్యేలు బస చేయనున్నారు. ఎమ్మెల్యేలను తరలించిన ఒక బస్సులో సోరెన్​ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన సీఎం మాత్రం.. ఒకవేళ తాను ఎమ్యెల్యేలతో వెళ్తే చెబుతానని అన్నారు.
భాజపాయేతర ప్రభుత్వం అధికారంలో ఉన్న ఛత్తీస్​గఢ్​లోని ఓ రిసార్ట్​కు తమను తరలించే అవకాశముందని అంతకుముందు ఝార్ఖండ్​కు చెందిన ఓ కాంగ్రెస్​ శాసనసభ్యుడు చెప్పారు. ఎమ్మెల్యేల కోసం ఓ విమానం బుక్​ అయిందని విమానాశ్రయ వర్గాలు కూడా వెల్లడించాయి.

మహారాష్ట్ర తరహాలో సంకీర్ణ కూటమిలోని ఎమ్మెల్యేలను ఆకర్షించి, ప్రభుత్వాన్ని పడగొట్టే యోచనలో భాజపా ఉందని అధికార పక్షం నమ్ముతోంది.
81 మంది సభ్యులున్న ఝార్ఖండ్‌ అసెంబ్లీలో సోరెన్‌ సర్కారుకు 49 మంది సంఖ్యాబలం ఉంది. సంకీర్ణ ప్రభుత్వంలో 30 మంది ఎమ్మెల్యేలతో ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా అతిపెద్ద పార్టీగా ఉండగా.. కాంగ్రెస్‌కు 18 మంది, ఆర్జేడీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. భాజపాకు 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకవేళ సోరెన్‌పై అనర్హత వేటు పడితే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే మధ్యంతర ఎన్నికలు పెట్టాలని భాజపా నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సంకీర్ణ ప్రభుత్వం ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడింది. అందుకే వారిని సురక్షిత ప్రాంతంలో ఉంచాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

సీఎంగా ఉంటూ గనుల లీజును సోరెన్‌.. తనకు తానే కేటాయించుకోవడం వివాదాస్పదమైంది. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 9-ఏకు విరుద్ధమంటూ ప్రతిపక్ష భాజపా.. రాజ్‌భవన్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై గవర్నర్‌ రమేశ్‌ బైస్‌.. ఎన్నికల సంఘం (ఈసీ) అభిప్రాయాన్ని కోరారు. ఈసీ కూడా తన అభిప్రాయాన్ని ఆగస్టు 25న సీల్డ్‌కవర్‌లో గవర్నర్‌కు పంపింది. అయితే సోరెన్​ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎన్నికల సంఘం సిఫార్సు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

ఇవీ చూడండి: దేశానికి ఐదు రాజధానులు అవసరం, సీఎం కీలక ప్రతిపాదన

ఆప్ వర్సెస్ భాజపా, అసెంబ్లీలో అర్ధరాత్రి హైడ్రామా, పోటాపోటీ ఆందోళన

Last Updated : Aug 30, 2022, 6:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.