ETV Bharat / bharat

చైనాకు చెక్​ పెట్టేలా ఆ సరిహద్దులో 'రఫేల్​'ల మోహరింపు!

author img

By

Published : Jun 24, 2021, 8:19 AM IST

Indo-Bhutan border
భారత్-భూటాన్

భారత్-చైనాల మధ్య ఘర్షణ నెలకొన్న తరుణంలో సరిహద్దు రక్షణ విషయంలో వ్యూహాత్మకంగా భారత్ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్-భూటాన్ సరిహద్దుల్లో కీలకమైన హసీమారా వైమానిక స్థావరం వద్ద రఫేల్ స్క్వాడ్రన్‌ను వాయుసేన మోహరించింది.

చైనాతో ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో.. భారత వాయుసేన కీలన నిర్ణయం తీసుకుంది. కొత్తగా తమ అమ్ములపొదిలో చేరిన రఫేల్(Rafale) యుద్ధ విమానాల్లోంచి ఐదింటిని భారత్-టిబెట్ సరిహద్దుల్లో మోహరించింది. బంగాల్​లోని హసిమారా కేంద్రంగా ఈ రెండో రఫేల్ స్క్వాడ్రన్​ను ఏర్పాటు చేశారు. దీనికి 101 స్క్వాడ్రన్​గా నామకరణం చేశారు. భారత్-భూటాన్ సరిహద్దుల్లోని అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్​లో ఉన్నదే ఈ హసిమారా ఎయిర్​ఫోర్స్ స్టేషన్!

సిక్కిం, భూటాన్, చైనాల మధ్య ట్రైజంక్షన్​గా పరిగణించే చంబీలోయకు ఇది అత్యంత దగ్గరలో ఉంటుంది. 2017లో ఫ్రాన్స్ నుంచి భారత్ అత్యంత ఆధునికమైన 36 రఫేల్ జెట్​లను కొనుగోలు చేసింది. వీటిని తొలుత హరియాణాలోని అంబాలా కేంద్రంగా మోహరించారు. ఆ స్క్వాడ్రన్​కు 'గోల్డెన్ యారో'గా నామకరణం చేశారు. ఇప్పటికే గత కొద్దినెలలుగా 18 రఫేల్​లు.. లద్దాఖ్​ గగనతలంలో నిరంతరం విహంగవీక్షణం చేస్తున్నాయి.

తాజాగా.. బంగాల్​లోని హసిమారా కేంద్రంలో రఫేల్​ల మోహరింపుతో.. తూర్పు దిశగా వాయుసేన బలం పెరిగినట్లవుతుంది. ఇప్పటికే అసోంలోని చబువా, తేజ్​పూర్​లలో సుఖోయ్-30 ఎంకేఐలను ఉంచారు. మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాల్లో మిగిలినవి 2022 మే కల్లా భారత్ చేరుకుంటాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.