రైతు కుటుంబం నుంచి ఉపరాష్ట్రపతి పదవి వరకు.. జగ్​దీప్​ ధన్​ఖడ్​ ప్రస్థానం

author img

By

Published : Aug 6, 2022, 7:53 PM IST

Updated : Aug 6, 2022, 8:01 PM IST

India Vice President Elect Jagdeep Dhankhar Profile

Vice President Jagdeep Dhankad: భారత 16వ ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా జగ్​దీప్​ ధన్​ఖడ్​.. ఎన్నికయ్యారు. రాజస్థాన్‌ జాట్‌ సామాజిక వర్గానికి చెందిన రైతు కుటుంబంలో పుట్టిన ఆయన.. ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టే స్థాయికి ఎదిగారు. ఉపరాష్ట్రపతి పదవి చేపట్టనున్న తొలి ఓబీసీ నేతగానూ గుర్తింపు పొందారు. 30 ఏళ్లకుపైగా వేర్వేరు హోదాల్లో ప్రజాసేవ చేశారు. 40 ఏళ్ల పాటు న్యాయవాద వృత్తిలోనూ ధన్‌ఖడ్‌ రాణించారు.

Vice President Jagdeep Dhankad Profile: భారత 16వ ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌ఖడ్ ఎన్నికయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన జగదీప్ ధన్‌ఖడ్.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ ఆళ్వాపై విజయం సాధించారు. రాజస్థాన్‌ ఓబీసీ జాట్‌ సామాజిక వర్గానికి చెందిన ధన్‌ఖడ్‌.. మూడు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉన్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన సామాజిక, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూనే అత్యున్నత స్థాయికి ఎదిగారు.

ధన్‌ఖడ్‌ 1951 మే 18న.. రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లా కిథనా గ్రామంలో జన్మించారు. 1 నుంచి 5వ తరగతి వరకు పుట్టిన ఊర్లోనే ప్రభుత్వ బడిలో చదువుకున్నారు. 6వ తరగతి స్వగ్రామానికి 4-5 కిలోమీటర్ల దూరంలోని.. గార్ధానా ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో చదివారు. 1962లో ఛిత్తోడ్‌గఢ్‌ సైనిక్‌ స్కూల్‌కు ఎంపికై, మెరిట్‌ స్కాలర్‌షిప్‌పై మళ్లీ ఐదో తరగతిలో చేరారు. జైపుర్‌లోని మహారాజా కాలేజీలో ఫిజిక్స్‌లో బీఎస్సీ చేశారు. 1978-79లో రాజస్థాన్‌ విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ కోర్సు పూర్తిచేశారు. 1979 నవంబర్‌ 10న రాజస్థాన్‌ బార్‌ అసోసియేషన్‌లో అడ్వకేట్‌గా పేరు నమోదు చేసుకొని న్యాయవాదిగా సేవలందించారు.
1990 మార్చి 27న రాజస్థాన్‌ హైకోర్టు ద్వారా సీనియర్‌ అడ్వకేట్‌ హోదా పొందారు. 1990 నుంచి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. ఉక్కు, బొగ్గు, గనులు, అంతర్జాతీయ వాణిజ్య మధ్యవర్తిత్వ రంగాలపై జగదీప్‌ ధన్‌ఖడ్‌కు పట్టు ఉంది. వివిధ హైకోర్టుల్లోనూ వాదనలు వినిపించారు.

రాజకీయాల్లో..

  • 1989లో ఝన్‌ఝును లోక్‌సభ స్థానం నుంచి ధన్‌ఖడ్‌ గెలిచారు. 1990లో కేంద్ర సహాయమంత్రిగా పనిచేశారు. 1993-1998 మధ్యకాలంలో కిషన్‌గఢ్‌ నుంచి ఎమ్మెల్యేగా సేవలందించారు. 1998నుంచి ధన్‌ఖడ్‌ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ వచ్చారు.
  • 2019లో అనూహ్యంగా బంగాల్​ గవర్నర్‌గా కేంద్రం ఆయన్ని నియమించింది. 2019 జులై 30న బంగాల్‌ గవర్నర్‌గా ధన్‌ఖడ్‌ బాధ్యతలు చేపట్టారు. అక్కడ మమతా బెనర్జీ సర్కార్‌తో ఆయన తీవ్ర స్థాయిలో విభేదించారు. ప్రభుత్వంపై బహిరంగంగానే అనేక సందర్భాల్లో విమర్శలు చేశారు. సిట్టింగ్‌ గవర్నర్‌గా ఉండటం ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందడం సహా కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.
  • 40ఏళ్లు న్యాయవాద వృత్తిలో కొనసాగిన ధన్‌ఖడ్‌కు పెద్దలసభలో తలపండిన నేతలను నియంత్రించగలిగే శక్తిసామర్థ్యాలు ఉన్నాయని భాజపా భావిస్తోంది.
  • ధన్‌ఖడ్‌ ఉపరాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్లమెంటు ఉభయ సభల అధిపతులు.. రాజస్థాన్‌ వారే అవుతారు. రాజస్థాన్‌కు చెందిన ఓం బిర్లా ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రాజ్యసభ ఛైర్మన్‌గా ధన్‌ఖడ్‌ పెద్దల సభను నడిపించనున్నారు.

ఇదీ చదవండి: ఉపరాష్ట్రపతి పోలింగ్.. ఓటేసిన మోదీ.. మళ్లీ వీల్​ఛైర్​లోనే మన్మోహన్

Last Updated :Aug 6, 2022, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.