ETV Bharat / bharat

లండన్​లో జాతీయ జెండాకు అవమానం.. బ్రిటన్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు

author img

By

Published : Mar 20, 2023, 9:00 AM IST

లండన్​లో భారత దౌత్య కార్యాలయంపై ఎగురవేసిన జెండాను ఖలిస్థాన్ అనుకూలవాదులు అగౌరవపరచడంపై యూకే సీనియర్ దౌత్యవేత్తకు భారత ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. దీనిపై వివరణ ఇచ్చి.. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేసింది.

India puts notice UK
యూకేకు భారత్ నోటీసులు

లండన్‌లోని భారత్‌ హైకమిషన్‌ భవనంపై ఎగురవేసిన జాతీయ జెండాను.. ఖలిస్థాన్‌ అనుకూలవాదులు కిందికి దింపేసి అగౌరవపరచడంపై భారత్‌ మండిపడింది. దీనికి సంబంధించి దిల్లీలోని బ్రిటన్‌ సీనియర్‌ దౌత్యవేత్తకు భారత ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. ఖలిస్థాన్ వేర్పాటు వాదులు.. లండన్‌లో చేసిన ఈ పనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. వెంటనే అక్కడి ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్‌ చేసింది. కాగా ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్‌ పంజాబ్‌ దే' నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌ అనుచరులను పంజాబ్‌ పోలీసులు అరెస్టులు చేశారు. అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం కూడా పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత రెండు, మూడు రోజులుగా పంజాబ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

సోమవారం సాయంత్రం నుంచి ప్రవాస సిక్కుల్లోని ఓ వర్గం లండన్‌లో నిరసనలు ప్రారంభించింది. లండన్‌లోని భారత హై కమిషన్‌ భవనంపై ఏర్పాటు చేసిన జెండాను కిందికి దించుతున్నట్లు సోషల్​ మీడియాలో వీడియోలు పోస్టు చేసింది. ఈ చర్యను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా పరిగణించింది. నిరసనకారులు భారత హైకమిషన్‌ కార్యాలయానికి వచ్చేంత వరకు అక్కడి భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని బ్రిటన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. వియన్నా ఒప్పందం ప్రకారం భారత హైకమిషన్‌కు భద్రత కల్పించడం యునైటెడ్ కింగ్​డమ్ ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని భారత విదేశాంగ శాఖ గుర్తు చేసింది. భారత దౌత్య కార్యాలయ ప్రాంగణం, అక్కడి సిబ్బంది భద్రత పట్ల యూకే ప్రభుత్వ ఉదాసీనంగా వ్యవహరించటం ఆమోదయోగ్యం కాదని తెలిపింది.

అమృత్​పాల్ సింగ్ కోసం పంజాబ్​ పోలీసుల వేట..
ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్​ పంజాబ్​ దే' అధినేత అమృత్​పాల్ సింగ్ కోసం పంజాబ్​ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అతడిని పరారీలో ఉన్న నిందితుడిగా పోలీసులు ఆదివారం ప్రకటించారు. అమృత్‌పాల్ స్వస్థలమైన అమృత్‌సర్​లోని జల్లుపుర్‌ ఖేరాలో అతడి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటి వరకు ఖలీస్థానీ నేత అమృత్‌ పాల్‌ అనుచరుల్లో 78 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో అతడి ఆర్థిక వ్యవహారాలను చూసుకునే దల్జీత్‌ సింగ్‌ కూడా ఉన్నాడు. దల్దీత్ సింగ్​ను హరియాణాలోని గురుగ్రామ్​లో పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే అమృత్‌పాల్‌కు సెక్యూరిటీగా ఉన్న మరో ఏడుగురిని సైతం పోలీసులు పట్టుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.