ETV Bharat / bharat

బలగాల ఉపసంహరణ: చైనా ఉచ్చులో భారత్?

author img

By

Published : Feb 15, 2021, 9:59 PM IST

తూర్పు లద్దాఖ్​లోని గల్వాన్ లోయ, పాంగాంగ్​ సరస్సు ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణకు చైనాతో ఏకాభిప్రాయం కుదిరిందని రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్ చెప్పారు. ఇరు దేశాలు సమన్వయంతో విడతల వారీగా దళాలను వెనక్కి పంపిస్తాయని అన్నారు. దీంతో సరిహద్దులో శాంతియుత వాతావరణం నెలకొనే అవకాశం ఉన్నా.. ఈ ఒప్పందం వల్ల భారత్​కే నష్టమని విశ్లేషకులు చెబుతున్నారు .

Ladakh disengagement and the Chinese 1959 claim line
బలగాల ఉపసంహరణ: చైనాకు భారత్​ లొంగిపోయిందా?

సుదీర్ఘ ప్రతిష్టంభన తర్వాత బలగాల ఉపసంహరణకు భారత్, చైనా అంగీకరించాయి. తూర్పు లద్దాఖ్​ సరిహద్దులోని పాంగాంగ్​ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి ఇరు దేశాల బలగాలు వెనక్కు వెళ్తాయని పార్లమెంట్​లో రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్ తెలిపారు. దీంతో దేశ ప్రయోజనాలు, సార్వభౌమత్వాన్ని కాపాడినట్లైందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ, ఈ చర్యతో వాస్తవాధీన రేఖ (ఎల్​ఏసీ), భారత్​ వైఖరిపై ఆందోళన వ్యక్తమవుతోంది. బలగాల ఉపసంహరణతో భారత భూభాగాన్ని చైనాకు అప్పగించినట్లు అయ్యిందని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. దానిని కేంద్రం తోసిపుచ్చింది. అయితే రాహుల్ విమర్శలో వాస్తవమెంత? నిజంగానే చైనాపై ఒత్తిడి తీసుకురాగలిగామా? ఈ ఒప్పందంతో వెనక్కి తగ్గింది చైనానా? భారతా?

Ladakh disengagement and the Chinese 1959 claim line
పాంగాంగ్ సరస్సు

'చైనాకే అనుకూలం..'

సైనిక ఉపసంహరణ ప్రక్రియ '1959లో చైనా పేర్కొన్న రేఖ'కు అనుగుణంగా జరుగుతోందని మాజీ లెఫ్టినెంట్ జనరల్ హెచ్​ఎస్ పనాగ్​ అన్నారు. పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునే సైనిక శక్తి భారత్​కు లేకపోవడమే అందుకు కారణమని వివరించారు.

చైనా పేర్కొన్న రేఖ అంటే?

1959లో భారత ప్రధాని జవహర్​లాల్ నెహ్రూకు చైనా ప్రధాని చౌ ఎన్​లై రాసిన లేఖతో తొలిసారి ఈ రేఖ గురించి ప్రస్తావనకు వచ్చింది. 1914 సిమ్లా ఒప్పందంలోని మెక్​మోహన్​ రేఖ నుంచి ఇది ఉద్భవించింది. దానిని తనకు అనుకూలంగా మార్చి ప్రకటించిందే ఈ 1959 రేఖ.

మెక్​మోహన్ రేఖ భారత్, టిబెట్​ను వేరు చేస్తుంది. అయితే సిమ్లా ఒప్పందం జరిగిన 1914 జులై 3 నాటి నుంచి 1959 జనవరి వరకు మెక్​మోహన్​ రేఖకు చైనా అభ్యంతరం తెలపకపోవడం గమనార్హం.

Ladakh disengagement and the Chinese 1959 claim line
జవహర్​లాల్ నెహ్రూ

నెహ్రూకు రాసిన ఆ లేఖలో.. "తూర్పు భాగంలో మెక్​మోహన్​ రేఖ.. పశ్చిమాన ఇరు దేశాల అధీనంలో ఉన్న ప్రాంతం నుంచి 20 కిలోమీటర్లు వెనక్కు వెళ్లాలి" అని ఎన్​లై ప్రతిపాదించారు.

1959 రేఖ గురించి చైనా ప్రస్తావన..

1962 నవంబర్ 21న చైనా ఏకపక్షంగా ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందం సమయంలో 1959 ఎల్​ఏసీ గురించి ఆ దేశం ప్రస్తావించింది. " 1962 డిసెంబర్​ 1 భారత్, చైనా మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ నుంచి చైనా సరిహద్దు దళాలు 20కి.మీలు వెనక్కు వస్తాయి." అని చైనా ప్రకటించింది.

1962 యుద్ధంలో ఓడినప్పటికీ చైనా పేర్కొన్న ఎల్​ఏసీని నెహ్రూ అంగీకరించలేదు. చైనా తాను చెబుతున్న ప్రదేశం నుంచి బలగాల ఉపసంహరణ చేయాలనే ప్రతిపాదన అర్థరహితమని నెహ్రూ అన్నారు.

తరువాత, 1988లో ప్రధాని రాజీవ్ గాంధీ బీజింగ్ పర్యటన తరువాత పలు సరిహద్దు ఒప్పందాలు జరిగాయి. దానికి ముందు ఎల్​ఏసీ అమరికపై చర్చలు జరిగాయి.

పదేపదే అదే మాట..

1993 ఒప్పందానికి ముందు 1959 ఎల్​ఏసీకే తాము అంగీకరిస్తామని చైనా నొక్కి చెప్పింది. అనంతరం జరిగిన చర్చల తర్వాత ఎల్​ఏసీపై ఇరు దేశాల మధ్య విభేదాలు తొలగించడానికి ఓ నిపుణుల కమిటీ ఏర్పాటైంది.

1993లో భారత్​, చైనా శాంతి స్థాపన ఒప్పందంలో ఎల్​ఏసీ అనే పదాన్ని వాడారు. అయిదే అది 1959లో చైనా పేర్కొన్న రేఖ కాదని భారత్​ స్పష్టంగా చెప్పింది.

అయితే చైనా సుముఖత చూపకపోవడం వల్ల 2003లో ఈ ప్రక్రియ అర్థాంతరంగా నిలిచిపోయింది.

Ladakh disengagement and the Chinese 1959 claim line
వాస్తవాధీన రేఖ వద్ద భారత్, చైనా బలగాలు

2017లో పాంగాంగ్​ సో సరస్సు వద్ద జరిగిన వివాదం సందర్భంగా 1959 ఎల్​ఏసీ గురించి చైనా మరోసారి ప్రస్తావించింది. " శాంతి కోసం ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు, ఒడంబడికలకు భారత్​ కట్టుబడి ఉండాలని కోరుతున్నాం. 1959 ఎల్​ఏసీని చిత్తశుద్ధితో అనుసరించి సైనిక చర్యలను చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం." అని 2017 ఆగస్టు 21లో చైనా ప్రకటన విడుదల చేసింది.

2020లో లద్ధాఖ్​ ప్రతిష్టంభన సమయంలోనూ చైనా విదేశాంగ మంత్రి అదే వక్కానించారు. భారత్​ చైనా సరిహద్దు అంటే 1959 నవంబర్ 7నాటి ఎల్​ఏసీనే అని చెప్పారు.

చైనా 1959 రేఖను భారత్ తిరస్కరించింది. నెహ్రూ కాలం నుంచి ఇప్పటి వరకు ఆ రేఖను భారత్​ ఎప్పుడూ అంగీకరించలేదు.

చైనా చెప్పిన రేఖ వద్దే ఉపసంహరణ..

పాంగాంగ్​ ఉత్తర ప్రాంతంలోని ఫింగర్​ 8 వద్ద చైనా బలగాలు, ఫింగర్​ 3 వద్ద భారత బలగాలు ఉంటాయని రాజ్​నాథ్ చెప్పారు. ఫింగర్ 4 కూడా మన ప్రాంతమే అని, కానీ ఫింగర్​ 3కి మారాలి వస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్​కు చెందిన భూభాగంలోనే బఫర్​ జోన్​లు ఏర్పాటు చేయడం వల్ల చైనా ముందు భారత్​ నిలువలేదని సందేశం ఇచ్చినట్లు అవుతందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదీ చూడండి: నేపాల్‌ చుట్టూ చైనా ఉచ్చు- వ్యూహాత్మకంగా భారత్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.