తన ఫోన్​లో పెగాసస్​ ఉందంటూ రాహుల్​ ఆరోపణలు.. తిప్పికొట్టిన బీజేపీ

author img

By

Published : Mar 3, 2023, 12:10 PM IST

I had Pegasus on my phone Indian says Rahul Gandhi

బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. తన ఫోన్​లో పెగాసస్​ సాఫ్ట్​వేర్​ ఉందని.. ఇలా చాలా మంది నాయకుల ఫోన్లలో ఉందని అన్నారు. ప్రజాస్వామ్యంపై భాజపా దాడి చేస్తోందన్నారు. సమస్యలపై మాట్లాడితే ప్రతిపక్ష నాయకులను జైళ్లలో వేస్తున్నారని ఆరోపించారు. రాహుల్​ గాంధీ చేసిన ఆరోపణలను భాజపా తిప్పికొట్టింది. ప్రధాని మోదీ గురించి ప్రపంచ నాయకులు చెప్పిన మాటలు రాహుల్​ వినాలని హితవు పలికింది.

బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. భారత్​లో.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని.. రాజ్యాంగ మౌలిక స్వరూపంపై అధికార పార్టీ దాడి చేస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్​లో పెగాసస్​ సాఫ్ట్​వేర్​ ఉందని, కాల్స్​ రికార్డింగ్ చేస్తున్నారని.. ఫోన్లలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఇంటెలిజెన్స్​ అధికారులు తనను హెచ్చరించినట్లు రాహుల్​ గాంధీ తెలిపారు. కేంబ్రిడ్జ్​ విశ్వవిద్యాలయంలో 'లెర్నింగ్​ టు లిజన్​ ఇన్​ ది 21 సెంచరీ' అనే లెక్చర్​​ సందర్భంగా రాహుల్​ ఉపన్యసించారు.

" నా ఫోన్లో పెగాసస్​ సాఫ్ట్​వేర్​ ఉంది. నాతో పాటు చాలా మంది రాజకీయ నాయకుల ఫోన్లలో కూడా పెగాసస్​ ఉంది. ఫోన్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. ఎందుకంటే తాము అంతా రికార్డ్​ చేస్తున్నామని కొంత మంది ఇంటెలిజెన్స్ అధికారులు నన్ను హెచ్చరించారు. ఇలా నిరంతరం మేము ఒత్తిడికి గురవుతాము. ప్రతిపక్షాలపై దొంగ కేసులు పెడుతున్నారు. నాపై కూడా చాలా కేసులు ఉన్నాయి. కానీ అవన్నీ.. ఉద్దేశపూర్వకంగా నమోదు చేసిన కేసులే. వాటినే మేము ఎదుర్కోదలచుకున్నాం"

-- రాహుల్​ గాంధీ, కాగ్రెస్​ పార్టీ అగ్రనేత

ప్రతిపక్షనాయకులను జైళ్లలో వేస్తున్నారు..
"భారత ప్రజాస్వామ్యం ఒత్తిడిలో ఉంది. దాడికి గురవుతోంది. ఈ విషయం చాలా మందికి తెలుసు. చాలా రోజుల నుంచి వార్తల్లో వస్తోంది. నేను ఇండియాలో ప్రతిపక్ష నేతను.. మా పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ప్రజాస్వామ్యానికి అవసరమైన పార్లమెంట్​, ఫ్రీ ప్రెస్​, న్యాయవ్యవస్థ తదితర అంశాలన్నింటినీ ప్రభుత్వం నిర్బంధిస్తోంది." అని రాహుల్​ గాంధీ భాజపా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అనంతరం పోలీసులతో ఉన్న తన ఫొటోను షేర్​ చేస్తూ.. "పార్లమెంట్​లో నిల్చుని కొన్ని సమస్యలపై మాట్లాడితే ప్రతిపక్ష నాయకులను జైళ్లలో వేశారు. కొన్నిసార్లు ఇలాంటి చర్యలు హింసాత్మక ధోరణిలో జరుగుతాయి." అని అన్నారు.

'పెగాసస్​.. ఆయన ఫోన్​లో కాదు మైండ్​లోనే ఉంది'
రాహుల్​ గాంధీ చేసిన ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. ఈ విషయంపై స్పందించిన కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​.. రాహల్​ విమర్శలను ఖండించారు. "రాహుల్​ గాంధీ మళ్లీ విదేశీ గడ్డకు వెళ్లి.. స్వదేశంలోని ప్రభుత్వంపై ఏడుస్తున్నారు. ఆయన మైండ్​లోనే పెగాసస్​ ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ గౌరవం మరింత పెరిగింది. ప్రపంచంలోని పెద్ద పెద్ద నాయకులు ఈ విషయాన్ని చెబుతున్నారు. ఇటలీ ప్రధానమంత్రి.. భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించి ఏం చెప్పారో రాహుల్​ గాంధీ వినాలి" అని రాహుల్​పై మండిపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.