ETV Bharat / bharat

Hyderabad Rains : భాగ్యనగరంపై వరుణ ప్రతాపం.. వానలో ప్రయాణం నరకం

author img

By

Published : Jul 25, 2023, 8:01 AM IST

Heavy Rain in Telangana
Heavy Rain in Telangana

Heavy Rain in Hyderabad : అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. భాగ్యనగరం మొత్తం తడిసి ముద్ధైంది. సాయంత్రం వేళ ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై కుండపోతగా వర్షం కురిసింది. విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే సమయంలో భారీ వర్షం పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షపు నీరు రహాదారులపై ప్రవహించడంతో వాహానదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల కొద్దీ నిలిచిపోయిన ట్రాఫిక్‌తో నానాఅవస్థలు ఎదుర్కొన్నారు. అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల చెట్లు విరిగిపడటంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

భాగ్యనగరంలో కుండపోత వర్షం.. రహదారులు జలమయం.. గంటల కొద్ది నిలిచిపోయిన ట్రాఫిక్

Rain Problems in Hyderabad : అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌లో ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైంది. కుండపోతగా వర్షం కురిసింది. విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే సమయంలో వానపడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షపునీరు రహాదారులపై ప్రవహించడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు. గంటల కొద్దీ నిలిచిపోయిన ట్రాఫిక్‌తో బారులు తీరారు. పలుచోట్ల చెట్లు విరిగిపడటంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

Massive Traffic Jam in Hyderabad : హైదరాబాద్‌లో వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే సమయంలో భారీవర్షం కురవడంతో ప్రజలు నానాఅవస్థలు పడ్డారు. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా డ్రైనేజీలు పొంగిపొర్లాయి. వర్షపు నీటితో రహదారులు.. చెరువులను తలపించాయి. ఒకవైపు వర్షం.. మరోవైపు ట్రాఫిక్‌ రద్దీతో నగరవాసుల బాధలు వర్ణణాతీతం. వర్షపు నీరు రహాదారులపై ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలిగి వాహనాలు బారులు తీరాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించిపోగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Hyderabad Rains Problems for Motorists : కొద్దిపాటి జల్లులతో మొదలైన వర్షం కుంభవృష్టిగా మారడంతో.. ముందుకెళ్లే అవకాశం లేక ప్రజలు నానాయాతన పడ్డారు. రాయదుర్గం, హైటెక్‌సిటీ, మాదాపూర్‌ ప్రాంతాల్లో.. ట్రాఫిక్‌ పరిస్థితిని గమనించిన సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర స్వయంగా రంగంలోకి దిగారు. ఐకియా కూడలి వద్ద వాహనదారులకు సూచనలిస్తూ ట్రాఫిక్‌ విధులు నిర్వర్తించారు. తార్నాక నుంచి హబ్సిగూడ, జూబ్లిహిల్స్ చెక్‌ పోస్ట్ నుంచి ఎన్టీఆర్ భవన్, పంజాగుట్ట మార్గంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఖైరతాబాద్- పంజాగుట్ట, బేగంపేటపై వంతెన, క్యాంపు ఆఫీస్, రాణీగంజ్, బహదూర్‌పురా, మైత్రివనం కూడలి, నల్లకుంట, మలక్ పేట నుంచి ఎంజీబీఎస్ మార్గాల్లో భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వర్షానికి మెట్రో స్టేషన్ల కింద తలదాచుకునేందుకు రోడ్లపై వాహనాలు నిలపగా ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి. పోలీసులు రంగంలోకి దిగి ఎక్కడికక్కడ వాహనాల రద్దీని క్రమబద్దీకరించారు.

భారీ వర్షానికి పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. గంటల కొద్దీ విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. జీహెచ్​ఎంసీ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొని విరిగిపడిన చెట్లను తొలగించారు. వర్షపు నీరు నిలిచిపోకుండా చర్యలు చేపట్టారు. కంట్రోట్‌ రూం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు పది చెట్లు కూలిపోయాయని, 26 చోట్ల నీరు నిలిచిపోయిందని, రెండు చోట్ల గోడలు కూలాయని జీహెచ్​ఎంసీ అధికారులు తెలిపారు. రానున్న మరో మూడు రోజులు భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బల్దియా సూచించింది.

Heavy Rains in Telangana : రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి పలు జిల్లాల్లో వర్షాపాతం అధికంగా నమోదైంది. వరంగల్ జిల్లా సంగెంలో 14.7, ఖమ్మం జిల్లా బొనకల్‌ మండలం రావినూతల 12.3, నిజామాబాద్‌ జిల్లా వాయిలపూర్, 12.3, సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌ 11.7, మహబూబాబాద్ జిల్లా చిన్న గూడురు 9.4, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండు మైలారంలో 7.7 సెంటీ మీటర్ల వర్షాపాతం నమోదైంది. భాగ్యనగరంలోనూ వర్షాపాతం ఆరు సెంటీ మీటర్లకు పైగా నమోదైంది. చార్మినార్‌ 6.3, హస్తినాపురం 6, గోల్కండ 5.8, అంబర్‌ పేట 5.7, బహదూర్‌పురా 5.7, సరూర్‌ నగర్‌ 5.6, సైదాబాద్‌ 5.5, బండ్లగూడ 5.4, శేరిలింగంపల్లి 5.4, సికింద్రాబాద్‌ 5.3, ఆసిఫ్ నగర్‌ 5.1, ఖైరతాబాద్‌ 5.1, నాంపల్లి 5 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో నగరప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైంది. రిస్క్యూ టీంలను సిద్ధం చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.