ETV Bharat / bharat

ప్రభుత్వ భూమితో దందా.. లీజుకు ఇచ్చి రూ.కోట్లు స్వాహా.. భార్య కోసం హ్యాకర్​గా మారి..

author img

By

Published : Feb 16, 2023, 10:55 PM IST

కేంద్ర ప్రభుత్వ భూమిపై ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి రూ.కోట్లు సంపాదించుకున్నారు కేటుగాళ్లు. ఏకంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భూమినే తమ దందాకు ఆసరాగా చేసుకున్నారు. చివరకు పోలీసులకు చిక్కారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. మరోవైపు, భార్య కోసం హ్యాకర్​గా మారాడు ఓ వ్యక్తి.

HINDUSTAN AERONAUTICS LIMITED LAND ISSUE
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భూ వివాదం

కేంద్ర ప్రభుత్వ భూమినే మింగేయాలని కేటుగాళ్లు ప్లాన్ చేసి పోలీసులకు చిక్కారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)కు చెందిన భూమి ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేశారు. అనంతరం ఆ భూమిని ఇతరులకు లీజుకు ఇచ్చి రూ.కోట్లు సంపాదించారు. కర్ణాటకలోని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. హెచ్ఏఎల్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. నిందితులు సయ్యద్ మునావర్ సబ్రి, ప్రతాప్, సయ్యద్ అఫ్రోజ్, రాజ్ కుమార్, శ్రీనివాస మూర్తి, వైజయంత్​లపై కేసు నమోదు చేశారు. వీరంతా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న భూములపైనే కన్నేశారని పోలీసులు తెలిపారు. పాత ఎయిర్​పోర్టు రోడ్​కు సమీపంలోని 833 ఎకరాల హెచ్ఏఎల్ భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించారని చెప్పారు.

ఇదీ కథ
పోలీసులు చెప్పిన కథనం ప్రకారం.. హెచ్ఏఎల్ నుంచి భూమిని లీజుకు తీసుకున్నామని నిందితులు ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించారు. హెచ్ఏఎల్ సీల్​ను, అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశారు. ఫేక్ పత్రాల ఆధారంగా ఇద్దరు వ్యక్తులను మోసం చేశారు. భూమిని 30 ఏళ్లకు లీజుకు తీసుకున్నామని.. వ్యాపార కార్యకలాపాల కోసం దాన్ని అద్దెకు ఇస్తామని వారి నుంచి రూ.కోట్లు వసూలు చేశారు. ఈ వ్యవహారం గురించి హెచ్ఏఎల్ అధికారులకు తెలిసింది. దీనిపై పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు బినీశ్ థామస్ పరారీలో ఉన్నాడని చెప్పారు.

భార్య కోసం హ్యాకర్​గా మారి..
ఓ సాఫ్ట్​వేర్​ ఇంజనీర్​ తన భార్యను ఇంప్రెస్​ చేసేందుకు ఎవరు చేయని ఆలోచన చేశాడు. విదేశాలకు వెళ్లాలన్న తన భార్య కోరికను తీర్చేందుకు ఏకంగా పాస్​పోర్ట్ కార్యాలయంలోని పలు ఫైళ్లను హ్యాక్​ చేశాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

గాజియాబాద్​కు చెందిన ఓ రాజాబాబు సాఫ్ట్​వేర్​ ఇంజనీర్​గా పనిచేస్తున్నాడు.​ విదేశాలకు వెళ్లాలన్న తన భార్య కోరిక కోసం పాస్​పోర్టు కార్యాలయంలోని కొన్ని ఫైళ్లను హ్యాక్​ చేశాడు. దీనిని గుర్తించిన బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కాగా, ఈ ఘటన గతేడాది సెప్టెంబరు 24న జరగ్గా.. అదే నెల 26న అధికారుల దృష్టికి వచ్చింది. అయితే పాస్​పోర్టు కార్యాలయంలో విధులు నిర్వహించే ఓ మహిళా ఉద్యోగి ఐడీతో ముగ్గురి మహిళల పాస్​పోర్టు దరఖాస్తుల ఫైళ్లకు సంబంధించి పాస్​వర్డ్​ను చోరీ చేసి వారి అప్లికేషన్లను క్లియర్​ చేశాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ముమ్మరంగా దర్యాప్తు నిర్వహించారు. ఐపీ అడ్రెస్ ద్వారా నిందితుడిని గుర్తించారు. హ్యాకింగ్ చేసి ఫైళ్లను క్లియర్ చేసినట్లు పోలీసులు తేల్చారు. రాజాబాబును అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.