గాంధీని తలపించేలా 'అసుర' రూపం.. హిందూ మహాసభ దుర్గా మండపంపై దుమారం

author img

By

Published : Oct 3, 2022, 9:17 AM IST

gandhi as asura in durga madap

అఖిల భారతీయ హిందూ మహాసభ కోల్​కతాలో ఏర్పాటు చేసిన దుర్గా మండపం వివాదాస్పదమైంది. దుర్గమ్మ పాదాల కింద ఉండే అసురుడి(రాక్షసుడి) రూపం మహాత్మా గాంధీని తలపించడం దుమారం రేపింది.

మహాత్మా గాంధీని అసురుడిగా చూపిస్తూ కోల్​కతాలోని కస్బాలో ఏర్పాటు చేసిన దుర్గా మండపం వివాదాస్పదమైంది. దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో అఖిల భారతీయ హిందూ మహాసభ ఈ మండపాన్ని ఏర్పాటు చేసింది. దుర్గా మాత వధించిన అసురుడి ముఖం.. గుండ్రటి కళ్లద్దాలతో బాపూను తలపించింది.

ఈ విషయంపై తనదైన శైలిలో స్పందించింది అఖిల భారతీయ హిందూ మహాసభ. "గాంధీ.. జాతిపిత అని మేము విశ్వసించడం లేదు. దుర్గమ్మ విగ్రహంలో అసురుడి రూపం గాంధీని తలపించడం యాదృచ్ఛికం మాత్రమే. అవసరమైన అనుమతులు అన్నీ తీసుకున్నా.. మా పూజా మండపం మూసేయాలని అధికార యంత్రాంగం ఒత్తిడి చేస్తోంది." అని ఈటీవీ భారత్​కు చెప్పారు హిందూ మహాసభ బంగాల్ అధ్యక్షుడు మొహంతో సుందర్ గిరి మహారాజ్.

ఈ వ్యవహారం వివాదాస్పదమైన నేపథ్యంలో నిర్వాహకులు విగ్రహాన్ని మార్చారు. పోలీసుల ఒత్తిడి మేరకే ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పారు. అయితే.. పూజా మండపం మూసేయాలని అధికారులు ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణల్ని కోల్​కతాకు చెందిన సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తోసిపుచ్చారు. తాము ఎవరికీ అలాంటి సూచనలు చేయలేదని స్పష్టం చేశారు.

విగ్రహం వివాదంపై తీవ్ర విమర్శలు చేసింది అధికార తృణమూల్ కాంగ్రెస్. "ఇది ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. అసలు మాటలు కూడా రావడం లేదు. ఇంతకన్నా అవమానకరం ఇంకేమైనా ఉంటుందా? నవరాత్రి ఉత్సవ స్ఫూర్తినే ఇది దెబ్బతీసింది. ఈ మొత్తం వ్యవహారం అధికారుల దృష్టికి వచ్చింది. వారు తగిన చర్యలు తీసుకుంటున్నారు" అని చెప్పారు తృణమూల్ కాంగ్రెస్​ రాష్ట్ర అధికార ప్రతినిధి కునాల్ ఘోష్.
హిందూ మహాసభ కొంతకాలం క్రితం నిషేధానికి గురైంది. గాంధీ జయంతి అయిన అక్టోబరు 2ను ఆ సంస్థ బ్లాక్ డేగా పాటిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.