ETV Bharat / bharat

హిమాచల్​లో కాంగ్రెస్​ జాక్​పాట్.. మార్పు సంప్రదాయానిదే గెలుపు

author img

By

Published : Dec 8, 2022, 2:39 PM IST

Updated : Dec 8, 2022, 5:25 PM IST

మూడు దశాబ్దాల సంప్రదాయాన్ని హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు కొనసాగించారు. ప్రభుత్వాన్ని ఐదేళ్లకోసారి గద్దె దించే పద్ధతిని ఈసారీ పాటించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపా ఓటమి చవిచూడగా.. మెజారిటీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.

HIMACHAL PRADESH ELECTION 2022 RESULTS
HIMACHAL PRADESH ELECTION 2022 RESULTS

సంప్రదాయం మారలేదు.. ప్రభుత్వమే మారింది.. ఐదేళ్లకోసారి అధికారం మారే ఆచారం హిమాచల్ ప్రదేశ్​లో ఈసారీ కొనసాగింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న భాజపా.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. సంప్రదాయం కలిసొచ్చి కాంగ్రెస్ పార్టీ జాక్​పాట్ కొట్టింది. హిమాచల్ అసెంబ్లీలో 68 స్థానాలుండగా.. కాంగ్రెస్ పార్టీ 40 సీట్లలో విజయం సాధించింది. భాజపా 25 సీట్లు గెలుచుకోగా.. ఆమ్​ఆద్మీ ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయింది.

పార్టీ పేరుగెలిచిన స్థానాల సంఖ్య
కాంగ్రెస్​40
భాజపా25
ఆప్0
ఇతరులు3

హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉదయం నుంచీ రసవత్తరంగా సాగాయి. ఆధిక్యం ఇరుపార్టీల మధ్య దోబూచులాడింది. హోరాహోరీ ఫలితాలు ఉంటాయని ఎగ్జిట్ పోల్స్ ఇదివరకే అంచనా వేశాయి. అందులోనూ భాజపాది కాస్త పైచేయి ఉంటుందని పేర్కొన్నాయి. అయితే, ఫలితాల్లో ఆధిక్యం మాత్రం కాంగ్రెస్​కే దక్కింది. ఆప్ కనీసం పోటీ ఇవ్వలేక.. ఒక్క శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందారు. సొంత నియోజకవర్గమైన సిరాజ్‌ స్థానం నుంచి బరిలోకి దిగిన సీఎం జైరాం ఠాకూర్‌.. ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి చేత్​రామ్​పై 22,200 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మరోవైపు, మండీ అసెంబ్లీ స్థానంలో అనిల్‌ శర్మ (భాజపా) గెలుపొందారు.

సంప్రదాయానికి బలి!
హిమాచల్‌ప్రదేశ్​లో మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌, భాజపాలు ఒక దాని తరవాత ఒకటి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ వస్తున్నాయి. వరుసగా రెండు దఫాలు ఏ పార్టీ అధికారంలోకి రాలేదు. ఈ సంప్రదాయాన్ని మార్చేందుకు కమలనాథులు విశ్వప్రయత్నాలు చేశారు. 'సంప్రదాయాన్ని మారుద్దాం.. ప్రభుత్వాన్ని కాదు' అన్న నినాదంతో ప్రచారం నిర్వహించారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వంటి కీలక నాయకుల స్వరాష్ట్రం కాబట్టి.. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ఆ పార్టీ. అయినా.. సంప్రదాయానికి బలి కాక తప్పలేదు.

భాజపాకు రెబల్స్ సమస్య..
ఉద్యోగుల పింఛను, యాపిల్‌ వ్యాపారుల సమస్యల్లాంటి సామాజిక అంశాలు ఎన్నికలపై బలంగా ప్రభావం చూపించాయి. భాజపాకు సైతం అంతర్గత సమస్యలు, నాయకుల మధ్య సమన్వయ లేమి, తిరుగుబాట్లు తలనొప్పిగా పరిణమించాయి. తిరుగుబాటు నేతలను సైతం నడ్డా ఒప్పించలేకపోయారు. రెబల్స్​ను బుజ్జగించడానికి స్వయంగా మోదీయే రంగంలోకి దిగారు. అలా ప్రధాని నరేంద్ర మోదీనే.. తన బ్రహ్మాస్త్రంగా ప్రయోగించింది భాజపా. అయినప్పటికీ ఈ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయింది.

అంతా లోకల్ ప్రచారం!
కాంగ్రెస్ పార్టీ ఏమీ సులభంగా విజయం సాధించలేదు. అంతర్గత లుకలుకలతో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది హస్తం. ఎన్ని సమస్యలు ఉన్నా.. అధికారం మారే సంప్రదాయంతో పాటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటుపైనే ఆశలు పెట్టుకుంది. ధరల భారం, నిరుద్యోగం వంటి సమస్యలను ప్రస్తావిస్తూ ఓట్లు దండుకుంది. ఎన్నికల్లో స్థానిక కాంగ్రెస్‌ నేతలే ఒంటరి పోరాటం చేశారు. గుజరాత్ మాదిరిగానే.. హిమాచల్​లోనూ పార్టీ అధిష్ఠానం నుంచి పెద్దగా సహకారం లేదు. ప్రియాంక గాంధీ వంటి నేతలు ప్రచారానికి వచ్చినా అదంత ప్రభావం చూపే పరిస్థితి లేదు. చిన్న రాష్ట్రం కాబట్టి.. ఓటర్లతో వ్యక్తిగత సంబంధాలే కీలకమని గుర్తించిన కాంగ్రెస్‌ నేతలు ఆ దిశగా తమ ప్రచార వ్యూహాల్ని రచించారు. ప్రజల రోజువారీ జీవితాలను ప్రభావితం చేస్తున్న ధరలు, నిరుద్యోగం గురించి పదేపదే ప్రస్తావిస్తూ.. భాజపా సర్కారుపై వ్యతిరేకతను పెంచటానికి ప్రయత్నించారు.

కుమ్ములాటలు కట్టిపెట్టి..
మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ మరణానంతరం నిజానికి హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌లో బలమైన నేత అంటూ లేకుండా పోయారు. పార్టీలో చాలామందే ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తున్నారు. ఈ అంశాన్ని భాజపా అగ్రనాయకులు సైతం తమ విమర్శలకు వాడుకున్నారు. అయితే ఇక్కడే కాంగ్రెస్ నేతలు జాగ్రత్తపడ్డారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు సీఎం పదవిపై ఆశలు, ఆకాంక్షలను ప్రదర్శించి విభేదాలతో రోడ్డున పడకుండా చూసుకున్నారు. అంతా కలసికట్టుగా ఉన్నట్లు కనిపిస్తూ.. కమలనాథుల డబుల్‌ ఇంజిన్‌ సర్కారు నినాదాన్ని వారు బలంగా తిప్పికొట్టారు.

ఆప్ జాడేది?
అరణ్యాలతో నిండిన హిమాచల్‌లోని పర్వత ప్రాంతాల్లో దాదాపు ఇరవై వేలకు పైగా గ్రామాలు చెల్లాచెదురుగా విస్తరించి ఉంటాయి. జాతీయ భావం మెండుగా నిండిన ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌, భాజపాలు మినహా ఇతర ప్రాంతీయ పార్టీల ఎదుగుదలకు మొదటి నుంచి అవకాశం తక్కువగా ఉంటోంది. చాలా రాష్ట్రాల్లో మాదిరిగా స్థానిక సమస్యలతో ఏదైనా ప్రాంతీయ పార్టీ హిమాచల్‌ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఆస్కారం లభించడంలేదు. ఆ విషయం తెలిసీ, ఈసారి ఆమ్‌ఆద్మీ పార్టీ తన అదృష్టాన్ని అక్కడ పరీక్షించుకోవాలని చూసింది. గెలుపు కోసం పంజాబ్‌లో మాదిరిగా హిమాచల్‌లోనూ కేజ్రీవాల్‌ భారీ ప్రచారానికి తెరతీశారు. పంజాబ్‌లో ఆయన వ్యూహాలు ఫలించి ఆప్‌ ఘన విజయం సాధించింది. అయితే ఆ వ్యూహాలు హిమాచల్‌లో పనిచేయలేదు. భాజపాకు ప్రత్యామ్నాయంగా భావించిన కాంగ్రెస్​కే పగ్గాలు అప్పగించారు.

Last Updated : Dec 8, 2022, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.