ETV Bharat / bharat

సోషల్ ​మీడియాలో రాజకీయ విమర్శలూ నేరమేనా?.. వైసీపీ కోసం పోలీసుల ప్రత్యేక చట్టం..!

author img

By

Published : Apr 6, 2023, 7:37 AM IST

ACTION ON OPPOSITION PARTIES OVER SOCIAL MEDIA POSTS:  ఆంధ్రప్రదేశ్​లో పోలీసులు తీరు చూస్తుంటే ప్రతిపక్షాలకు వాక్‌ స్వాతంత్య్రమే లేదన్నట్లుగా అనిపిస్తోంది. "తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో నీకే దిక్కు లేదు. నీ బిడ్డకు ఎక్కడిది రా తమ్ముడూ " అంటూ ప్రతిపక్ష కార్యకర్త ఓ ఎమ్మెల్యేను ఉద్దేశించి ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. అయితే పోలీసులకు అది మహా నేరమట. ‘"నాయకుడు కార్యకర్తకు అండగా ఉండాలి. జీవనోపాధి మీద కొట్టకూడదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మా నాయకుడు మేలు చేయకపోగా.. ఉన్న ఉద్యోగంలో నుంచి తీసేయించి ద్రోహం చేశాడు "అని అధికార పార్టీ అభిమాని ఒకరు సోషల్​ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. అదీ శిక్షార్హమేనట. ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే.. ఆ వ్యక్తి గోప్యతకు భంగం కలిగించే సమాచారాన్ని పోలీసులు బయటపెట్టొచ్చట..ఏపీ పోలీసులు చెబుతున్న సరికొత్త భాష్యాలివి. ప్రభుత్వాన్ని, వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా, అభిప్రాయాలు వ్యక్తం చేసినా వారి పట్ల పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో చెప్పేందుకు తాజా ఉదాహరణలివి.

ACTION ON OPPOSITION PARTIES OVER SOCIAL MEDIA POSTS
ACTION ON OPPOSITION PARTIES OVER SOCIAL MEDIA POSTS

వైసీపీ కోసం పోలీసుల ప్రత్యేక చట్టం..!

ACTION ON OPPOSITION PARTIES OVER SOCIAL MEDIA POSTS: సోషల్​ మీడియాలో ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవారే లక్ష్యంగా కొన్నేళ్ల కిందట వరకూ సీఐడీ అధికారులు పెద్ద ఎత్తున కేసులు నమోదు చేసేవారు. అరెస్టు చేసి, విచారణ పేరిట వేధించేవారు. ఇప్పుడు ఈ బాధ్యతలను స్థానిక పోలీసులు తీసుకున్నారు. కేసులు పెట్టి, అదుపులోకి తీసుకుని విచారణ పేరిట హింసిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, వారి కుటుంబసభ్యులపై అత్యంత అసభ్యకరంగా పోస్టులు పెట్టేవారిపై మాత్రం అసలు చర్యలే తీసుకోవట్లేదు. అంతెందుకు ఫిర్యాదులే స్వీకరించడం లేదు.

విచారణ పేరిట ప్రతిపక్ష నాయకులపై వేధింపులు: ‘అధికార వైసీపీ నాయకులు ఎంతటి నేరానికి పాల్పడినా తప్పు కాదు కానీ... ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, నాయకులు వారి భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగించుకోవటమూ నేరమే’ అన్నట్లుగా పక్షపాత, ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో అధికార పార్టీ వారిపైన చిన్న రాజకీయ విమర్శ చేసినా సహించేది లేదన్నట్లుగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. విచారణ పేరిట ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తల్ని వేధిస్తున్నారు. అంటే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నాయకుల భావప్రకటన స్వేచ్ఛ, వాక్‌ స్వాతంత్య్రంపై ప్రభుత్వం, పోలీసులు ఏమైనా నిషేధం విధించారా అన్న ప్రశ్న వినిపిస్తోంది.

రాజకీయ విమర్శలతో పోస్టులు పెడితే.. కౌన్సిలింగ్​ పేరిట అదుపులోకి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఐటీడీపీ అధ్యక్షుడు రాకేశ్‌ చౌదరిని పోలీసులు ఇటీవల ఆయన ఇంటికెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నారో సమాచారమే ఇవ్వలేదు. స్థానిక టీడీపీ నాయకులు పోలీసుస్టేషన్‌ వద్దకు వెళ్లి గట్టిగా ప్రశ్నిస్తే అసలు విషయం బయటపడింది. ‘వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అతని కుమారుడిపై సోషల్​మీడియాలో పోస్టులు పెట్టటంతో రాకేష్‌ చౌదరిని పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చాం అని’ సీఐ ప్రకటించారు. కానీ రాజకీయ విమర్శలతో పోస్టులు పెడితే కౌన్సెలింగ్‌ పేరిట అదుపులోకి తీసుకోవటం ఏంటి అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

అధికార పార్టీ నాయకుడికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే పోలీసుల థర్డ్​ డిగ్రీ: సూళ్లూరుపేట పురపాలక సంఘంలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేసే తనను ఉద్యోగం నుంచి తీసేశారన్న ఆవేదనతో శ్రీహరికోటకు చెందిన వైసీపీ సానుభూతిపరుడు మంగపల్లి జ్యోతిష్‌ కుమార్‌రెడ్డి అలియాస్‌ బాబురెడ్డి.. వైసీపీ నాయకుడికి వ్యతిరేకంగా పరోక్షంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. పోలీసులు ఆయన్ను స్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాదారు. అధికార పార్టీ నాయకుడికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తారా? ఆ హక్కు పోలీసులకు ఎక్కడిదనే ప్రశ్న వినిపిస్తోంది.

ప్రవాసాంధ్రుడి పర్సనల్​ ఇన్ఫర్​మేషన్​ మీడియాకి రిలీజ్​: ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్‌కు, పార్టీకి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నాడంటూ ప్రవాసాంధ్రుడైన పొందూరు కోటిరత్న అంజన్‌ను కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అయితే ఆ నేరంతో సంబంధం లేని అతని వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశాలను మీడియాకు ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు తీర్పుకు, మార్గదర్శకాలకు విరుద్ధంగా ఒకరి వ్యక్తిగత వివరాలను పోలీసులు బహిరంగంగా ఎలా ప్రకటిస్తారు? ఇది వ్యక్తిగత, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించటం కాదా అన్న ప్రశ్న వినిపిస్తోంది.

గత 45నెలల్లో వందల మందిపై కేసులు: వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ప్రతిపక్ష నాయకులు, ప్రజాసంఘాల నేతలు, సామాజిక మాధ్యమ కార్యకర్తలు, తటస్థులు, పాత్రికేయులు ఇలా ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న పోస్టు పెట్టినా వారిపై కేసులు పెట్టి అణచివేస్తున్నారు.. గత 45 నెలల్లో వందల మందిపై ఇలా కేసులు పెట్టి వేధించారు. వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినట్లు, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు కేసులు పెడుతున్నారు. ఐటీ చట్టంలోని సెక్షన్లు బనాయిస్తున్నారు. గతంలో రాజద్రోహం సెక్షన్లు కింద కేసులు పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టటం ఏమైనా నేరపూరిత కుట్రా..??

టీడీపీ మహిళా నేతలు ఫిర్యాదు చేస్తే.. సంవత్సరాలు దాటినా చర్యలు కరవు: తమపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా, అడ్డగోలుగా పోస్టులు పెడుతున్నారని ప్రతిపక్ష నాయకులు ఫిర్యాదు చేస్తే మాత్రం పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు. రాజమహేంద్రవరం అర్బన్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని కించపరుస్తూ కొంతమంది సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసి రెండున్నర సంవత్సరాలు అయినా కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. ఈ విషయాన్ని భవాని పలుమార్లు అసెంబ్లీలోనూ ప్రస్తావించినా చర్యలు శూన్యం. అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న మహిళా రైతులను దూషిస్తూ వైసీపీ కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారు. దీనిపై ఫిర్యాదు చేసి రెండున్నర సంవత్సరాలు దాటుతున్నా కేసు లేదు.

టీడీపీ మహిళా నేతలు వంగలపూడి అనిత, పంచుమర్తి అనురాధలను ఉద్దేశించి వైసీపీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారు. వాటిపైనా పోలీసులు చర్యలు తీసుకోలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంతకాల్ని ఫోర్జరీ చేసి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నాయకులు సీఐడీకి ఫిర్యాదు చేస్తే.. కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. టీడీపీ నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌పైన, ఆయన కుటుంబ సభ్యులపైన సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు, చంపేస్తామని హెచ్చరించే పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదిచ్చారు. దాన్ని పట్టించుకున్న నాథుడే లేడు.

అధికార పార్టీ దళిత ఎమ్మెల్యే పైనా అసభ్యకర పోస్టులు: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారంటూ తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని ఆ పార్టీ ఇటీవల సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో దళిత మహిళ అయిన ఎమ్మెల్యే, ఆమె కుమార్తెలపైన వైసీపీ శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో అత్యంత అసభ్యకరమైన పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందారు. వీటిపై పోలీసులకు ఫిర్యాదులు అందినా కేసు నమోదు చేయలేదు. ఇదంతా వైసీపీకు ఎదురుతిరిగితే చట్టాలేవీ మీకు అండగా ఉండవని, మీపై ఎంతటి నేరం జరిగినా చూస్తూ ఉంటామని పోలీసులు పరోక్షంగా చెబుతున్నట్లే ఉంది.

వైకాపా శ్రేణులపై కేసులు ఎత్తేసుకోవచ్చా? మిమ్మల్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులా?: 2019 ఆగస్టు 14న జరిగిన వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ ప్రకటన చేశారు. ఏడాదిన్నర తర్వాత 2020 డిసెంబరు 6న విశాఖలో నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.

"గత ప్రభుత్వ హయాంలో వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్తలపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తేయాలని ఇప్పటికే పార్టీ తరఫున డీజీపీని కలిశాం. అధికారికంగా డీజీపీకి లేఖ రాస్తాం. మీపై నమోదైన కేసుల వివరాల్ని కేంద్ర కార్యాలయానికి తెలియజేస్తే వాటిని ఎత్తేయించే బాధ్యత పార్టీ తీసుకుంటుంది" 2019 ఆగస్టు 14న వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్తల సమావేశంలో ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు

"వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్తలపై గత ప్రభుత్వంలో నమోదైన 135 కేసులకు గాను 120 ఉపసంహరించుకున్నాం. న్యాయస్థానాల్లో మరో 7 కేసుల విచారణ కొనసాగుతోంది. వాటిలో పార్టీ తరఫున న్యాయసహాయం అందిస్తున్నాం"2020 డిసెంబరు 6న విశాఖలో నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ విజయసాయి వ్యాఖ్యలు

వైసీపీ కార్యకర్తలు.. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను అసభ్యపదజాలంతో దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెడితే వారిపై నమోదైన కేసుల్ని ఎత్తేస్తారా? ప్రభుత్వ వైఫల్యాల్ని, విధానాల్లోని లోపాల్ని ప్రశ్నిస్తూ ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, సామాజిక కార్యకర్తలు పోస్టులు పెడితే వారిపైన కేసులు నమోదు చేసేసి అరెస్టు చేస్తారా? మరీ ఇంత ఏకపక్ష, పక్షపాత ధోరణా? ఈ రాష్ట్రంలో వైసీపీ కోసం పోలీసులు ప్రత్యేక చట్టమేమైనా అమలు చేస్తున్నారా ఏంటి అనే ప్రశ్న వినిపిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.