గోవా కాంగ్రెస్​కు షాక్.. కాషాయ పార్టీలోకి 8 మంది ఎమ్మెల్యేలు

author img

By

Published : Sep 14, 2022, 11:16 AM IST

Updated : Sep 14, 2022, 1:42 PM IST

GOA CONGRESS

కాంగ్రెస్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గోవా అసెంబ్లీలో కాంగ్రెస్​కు ఉన్న 11 మంది సభ్యుల్లో.. 8 మంది భాజపాలో చేరారు. సీఎం ప్రమోద్ సావంత్ సమక్షంలో వారు కాషాయ కండువా కప్పుకున్నారు.

Goa congress MLA join BJP : గోవాలో కాంగ్రెస్​కు షాక్ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్​.. కండువ కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం హస్తం పార్టీపై విమర్శలు గుప్పించారు సావంత్. "భారత్ జోడో అంటూ కాంగ్రెస్ యాత్ర ప్రారంభించింది. కానీ, గోవాలో 'కాంగ్రెస్ ఛోడో' కార్యక్రమం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడి భాజపాలో చేరుతున్నారు" అని వ్యాఖ్యానించారు.

అంతకుముందు ఎమ్మెల్యేలు సీఎం, అసెంబ్లీ స్పీకర్​తో సమావేశమయ్యారు. కాంగ్రెస్ శాసనపక్షాన్ని భాజపాలో విలీనం చేయాలని ఎమ్మెల్యేలు తీర్మానించారు. విపక్ష నేతగా ఉన్న మైఖెల్ లోబో ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. దీన్ని మాజీ సీఎం, ఎమ్మెల్యే దిగంభర్ కామత్ బలపర్చగా.. మిగితా ఎమ్మెల్యేలు ఆమోదించారు. అనంతరం, సీఎం ప్రమోద్ సావంత్​తో కలిసి ఎమ్మెల్యేలు చిత్రాలు దిగారు. ఈ ఫొటోలు వెంటనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పార్టీ మారిన వారిలో లోబో, కామత్​తో పాటు.. దెలిలా లోబో, రాజేశ్ ఫల్దేశాయ్, కేదార్ నాయక్, సంకల్ప్ అమోంకర్, అలెక్సియో సెక్వీరా, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్​లు ఉన్నారు.

GOA CONGRESS
సీఎంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
GOA CONGRESS
.

గోవాలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 40 స్థానాలకు గానూ భాజపా 20 సీట్లు దక్కించుకొంది. మెజార్టీ మార్కుకు ఒక్క సీటు తగ్గిన నేపథ్యంలో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదే ఎన్నికల్లో కాంగ్రెస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు వారిలో ఎనిమిది మంది భాజపాలో చేరిపోయారు. మూడింట రెండొంతుల మంది పార్టీని వీడిన నేపథ్యంలో... ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని వీరు తప్పించుకున్నట్లైంది.

కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని రెండు నెలల క్రితమే వార్తలు వచ్చాయి. గోవా అసెంబ్లీ సమావేశానికి ఒక రోజు ముందు కాంగ్రెస్‌ పార్టీ సమావేశం ఏర్పాటు చేయగా.. ఏడుగురు ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. త్వరలోనే వారంతా భాజపాలో చేరతారన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. సీనియర్ నేత ముకుల్ వాస్నిక్‌ను రంగంలోకి దింపి నాటి సంక్షోభం సద్దుమణిగేలా చూశారు. ఇక 2019లో 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 10 మంది భాజపాలో చేరారు. ఇదిలా ఉంటే.. ఒకవైపు కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపేందుకు అగ్రనేత రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర చేపట్టిన తరుణంలో తాజా పరిణామాలు పార్టీకి గట్టిదెబ్బే.

Last Updated :Sep 14, 2022, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.