ETV Bharat / bharat

కూతుర్ని వ్యభిచార ఊబిలోకి దింపి.. తండ్రి అత్యాచారం.. రోజూ 25 మందితో కలిసి!

author img

By

Published : Jul 1, 2022, 8:37 PM IST

Updated : Jul 1, 2022, 8:56 PM IST

Girl Forced into sex: కన్న తండ్రే అత్యాచారానికి పాల్పడ్డ దారుణ ఘటన బిహార్​ సమస్తిపుర్​లో జరిగింది. ఆపై డబ్బుల కోసం అత్యాచారాలకు ప్రోత్సహించారు తల్లిదండ్రులు. రోజు 20-25 మంది తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేసింది బాధితురాలు.

bihar latest news
bihar latest news

Girl Forced into sex: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే అత్యాచారం చేశాడు. ఆపై డబ్బుల కోసం ఇతరులతో అత్యాచారాలకు ప్రోత్సహించాడు. ఆమె తల్లి సైతం వారికే మద్దతు తెలిపింది. ఫిర్యాదు చేస్తానని పోలీస్​ స్టేషన్​కు వెళ్లగా.. వారు సైతం అత్యాచారానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది బాధితురాలు. ఈ అమానుష ఘటన బిహార్ సమస్తిపుర్​ సింఘియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. ఈ అఘాయిత్యాలను భరించలేకపోయిన బాధితురాలు.. సెల్ఫీ వీడియో తీసి సోషల్ ​మీడియాలో పోస్ట్​ చేసింది. తనపై రోజుకు 20-25 మంది అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

"మా అమ్మ ఇంట్లోనే మద్యం విక్రయిస్తోంది. ఈ క్రమంలోనే మద్యం తాగడానికి వచ్చినవారు నాపై అత్యాచారం చేసేవారు. తిరస్కరిస్తే కొట్టేవారు. ఈ విషయం మా నాన్న, మామకు చెబితే వారు సైతం అదే చేసేవారు. గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్​, ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ వెళితే పోలీసులు అత్యాచారం చేశారు. మద్యం తాగి రోజుకు 20-25 మంది అత్యాచారానికి పాల్పడేవారు. నన్ను రక్షించండి లేకుంటే వారు చంపేస్తారు."

- బాధితురాలు

ఈ ఘటనకు సంబంధించి వీడియో బయటకు రావడం వల్ల అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలి స్టేట్​మెంట్​ తీసుకుని.. వైద్య పరీక్షలు నిర్వహించారు. తల్లిదండ్రులు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోలీస్​ స్టేషన్ ఏఎస్సై మనోజ్​ కుమార్​ పైన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్పీ హృదయ్​కాంత్​ విచారణకు ఆదేశించారు. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ వారందరిపైనా కేసులు నమోదు చేస్తామని.. నిందితులకు శిక్ష పడేలా చేస్తామన్నారు.

భార్య, పిల్లలను చంపి తాను ఆత్మహత్య: ఛత్తీస్​గఢ్ దుర్గ్​ జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ సమస్యలతో భార్య సహా ఇద్దరు కుమారులను హత్య చేశాడు ఓ వ్యక్తి. తర్వాత నిందితుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఉమర్​కొటి గ్రామానికి చెందిన భోజ్​రామ్​ సాహూ.. అతడి భార్య, కుమారులను గొంతు నులిమి హత్యచేశాడు. అనంతరం అతడు కూడా సీలింగ్​ ఫ్యాన్​కు ఉరివేసుకుని చనిపోయాడు. మృతులను భార్య లలిత(25), కుమారుడు ప్రవీణ్​(4), టికేశ్​గా (2) గుర్తించారు.

రుణం చెల్లించలేక హత్య: ఉత్తర్​ప్రదేశ్​ మథురకు చెందిన ఓ మహిళ తన ప్రేమికుడితో కలిసి అత్తతో పాటు ఆమె కుమారుడిని హత్య చేసింది. నేహా, యోగేశ్​లు మాల అనే మహిళ వద్ద రూ. 4లక్షల రుణం తీసుకున్నారు. ఈ రుణం చెల్లించని నేహా.. తన అత్త మాలను హత్యచేసేందుకు ప్రణాళిక రచించింది. మార్చి 25న డబ్బులు ఇస్తానంటూ పిలిచిన నేహా.. మాల, ఆమె కుమారుడు వినయ్​ను కాలువలోకి తోసేసింది. నిందితులు నేహా, యోగేశ్​లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వీరికి సహకరించిన ఇమ్రాన్​, రాకేశ్​లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

పొలంలో ఇటుక పడిందని పదేళ్ల బాలికను చంపిన మహిళ: బిహార్ పశ్చిమ చంపారన్​లోని బేతియాలో దారుణం జరిగింది. ఓ మహిళ పదేళ్ల బాలికను హత్య చేసింది. తన పొలంలో ఇటుక పడేసిందన్న కోపంతో.. బాలిక చాతీపైన తన్నింది. ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. నిందితురాలితో అంతకుముందే గొడవలు జరిగాయని.. ఆ కోపంతోనే తమ కూతురిని హత్య చేసినట్లు మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.

తొమ్మిది నెలల చిన్నారి గొంతు కోసి చంపిన తల్లి: బిహార్ సర్దార్ ​శహర్​ జిల్లాలో హృదయ విదారక ఘటన జరిగింది. తొమ్మిది నెలల చిన్నారి గొంతు కోసి చంపింది తల్లి. శవపరీక్ష నిర్వహించిన వైద్యులు.. మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

భర్తతో గొడవ.. పిల్లలకు విషం ఇచ్చి తాను: భర్తతో గొడవ పెట్టుకున్న భార్య ఆగ్రహంతో ముగ్గురు చిన్నారులకు విషం ఇచ్చి.. ఆపై తాను తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని ధార్​లో జరిగింది. ముగ్గురు పిల్లలకు ఎలుకలను చంపే విషం ఇచ్చింది. అపస్మారక స్థితిలో ఉన్న వారిని గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో పారి(7), కునాల్​(3) మరణించగా.. సాక్షి(8), మమత చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి: బైక్​తో నేరుగా కాల్వలోకి దూసుకెళ్లిన యువకుడు.. స్టంట్ పేరుతో..

Last Updated :Jul 1, 2022, 8:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.