ETV Bharat / bharat

'ఉక్రెయిన్- రష్యా యుద్ధానికి పరిష్కారం అదే.. శాంతి చర్చలకు సహకరిస్తాం'

author img

By

Published : Feb 25, 2023, 12:20 PM IST

Updated : Feb 25, 2023, 4:18 PM IST

రష్యా-ఉక్రెయిన్‌ వివాదాన్ని దౌత్యం, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్‌ ఒత్తిడి చేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. కొవిడ్​, రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం యావత్​ ప్రపంచంపై పడిందని అన్నారు. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ రెండు రోజుల భారత పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

german chancellor olaf scholz
german chancellor olaf scholz

రష్యా-ఉక్రెయిన్‌ వివాదాన్ని దౌత్యం, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరుదేశాలకు భారత్‌ సూచిస్తూనే ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఎలాంటి శాంతి చర్చలకైనా సహకరించేందుకు భారత్​ సిద్ధంగా ఉందని తెలిపారు. ఉక్రెయిన్ వివాదం మొదలైనప్పటి నుంచి దౌత్యం, చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని భారత్ నొక్కి చెబుతోందని మోదీ పేర్కొన్నారు. కొవిడ్​, ఉక్రెయిన్- రష్యా యుద్ధ ప్రభావం యావత్​ ప్రపంచం అనుభవించిందని అన్నారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్​కు వచ్చిన జర్మనీ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్​కు ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. శనివారం దిల్లీకి చేరుకున్న ఆయనకు త్రివిధ దళాలు గౌరవ వందనం పలికాయి. అనంతరం ఇరువురు నేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు. ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్​లో మోదీ, షోల్జ్ మాట్లాడారు.

german chancellor olaf scholz
భారత ప్రధాని నరేంద్ర మోదీ, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్

"ఉగ్రవాదం, వేర్పాటువాదంపై పోరులో భారత్, జర్మనీల మధ్య పరస్పర సహకారం ఉంది. సీమాంతర ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు గట్టి చర్యలు అవసరమని ఇరు దేశాలు నమ్ముతున్నాయి. యూరప్‌లో భారత్​కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి జర్మనీ. అంతేకాకుండా భారత్‌లో పెట్టుబడులకు ముఖ్యమైన వనరు కూడా. అలాగే భారత్​, జర్మనీ మధ్య బలమైన సంబంధాలు ప్రజాస్వామ్య విలువలపై ఆధారపడి ఉన్నాయి. గత కొన్నేళ్లుగా భారత్​, జర్మనీ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

'ప్రపంచం మొత్తం బాధపడుతోంది'
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ కారణంగా ప్రపంచం మొత్తం బాధపడుతోందని జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్‌ షోల్జ్ తెలిపారు. హింసతో దేశ సరిహద్దులను ఎవరూ మార్చలేరని ఆయన నొక్కి చెప్పారు. ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం వల్ల అపారమైన నష్టం, విధ్వంసం జరిగిందని గుర్తు చేశారు. ఈ యుద్ధాన్ని ఒక విపత్తుగా అభివర్ణించారు.

"భారత్ ఇటీవల కాలంలో బాగా అభివృద్ధి చెందింది. అది భారత్, జర్మనీ మధ్య సంబంధాలకు చాలా మంచిది. రష్యా దురాక్రమణ పర్యవసానాలతో ప్రపంచం అల్లాడిపోతోంది. దాదాపు 1,800 జర్మన్ కంపెనీలు భారత్​లో ఉన్నాయి. అవి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించాయి. మాకు ప్రతిభ, నైపుణ్యం కలిగిన కార్మికులు కావాలి. సాఫ్ట్‌వేర్ రంగం భారత్​లో బాగా అభివృద్ధి చెందుతోంది. ప్రముఖ ఐటీ కంపెనీలు భారత్​లో ఉన్నాయి."
-ఒలాఫ్‌ షోల్జ్, జర్మనీ ఛాన్సలర్

అంతకుముందు జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్‌ షోల్జ్​కు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్​ చౌదరి దిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి భవన్​లో ఒలాఫ్‌ షోల్జ్​ను ప్రధాని మోదీ కలిశారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త టెక్నాలజీ, ఇంధనం, రక్షణ రంగాల్లో సంబంధాలను పెంపొందించడంపై చర్చలు జరిపారు. ఈ పర్యటనలో భాగంగా భారత్​-జర్మనీల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడతాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్​ ద్వారా తెలిపారు. 2021 డిసెంబర్‌లో జర్మన్ ఛాన్సలర్ అయిన తర్వాత షోల్జ్ భారతదేశానికి రావడం ఇదే మొదటి సారి.

German Chancellor Olaf Scholz
రాజ్​ఘాట్​లో మహాత్మ గాంధీకి నివాళి అర్పిస్తున్న జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్

2011లో ఇరుదేశాల మధ్య.. ఇంటర్‌ గవర్నమెంటల్‌ కన్సల్టేషన్‌ మెకానిజం ప్రారంభమైన తర్వాత జర్మనీ ఛాన్సలర్‌ భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. జర్మనీ ఛాన్సలర్‌తోపాటు ఉన్నతస్థాయి అధికారులతోపాటు పారిశ్రామికవేత్తల బృందం వచ్చినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈ పర్యటన సందర్భంగా జర్మనీ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ స్కోల్జ్‌.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతోనూ సమావేశం కానున్నారు.

Last Updated :Feb 25, 2023, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.