ETV Bharat / bharat

Ganesh Chaturthi 2023 : చంద్రయాన్​-3 గణేశ్​.. రూ.360 కోట్లతో మండపానికి బీమా.. 66 కిలోల బంగారంతో అలంకారం

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2023, 10:50 PM IST

Updated : Sep 18, 2023, 10:58 PM IST

Ganesh Chaturthi 2023 : వినాయక చవితి పండుగను దేశమంతా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. వివిధ రూపాల్లో ప్రతిష్ఠించిన గణనాథులు.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పందిళ్లలో పూజలు అందుకుంటున్నారు. అయితే మహారాష్ట్రలో కొలువుదీరిన ఓ గణనాథుడికి రూ.360.40 కోట్ల బీమా చేయించారు. మరో వినాయకుడిని 500, 200, 100 రూపాయల కరెన్సీ నోట్లు, నాణేలతో అలంకరించారు. అందరి దృష్టిని ఆకర్షిస్తు ఇలాంటి గమనాథుల విశేషాలపై ప్రత్యేక కథనం.

Ganesh Chaturthi 2023
Ganesh Chaturthi 2023

Ganesh Chaturthi 2023 : దేశవ్యాప్తంగా వినాయక ఉత్సవాలు.. భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. కొన్నిచోట్ల ఖరీదైన గణేశ్‌ విగ్రహాలు వివిధ రూపాల్లో ఏర్పాటు చేయగా.. మరికొన్ని చోట్ల భారీ సెట్టింగ్‌లతో మండపాలను అలంకరించారు. అందులో భాగంగా ఓ గణనాథుడికి రు.360 కోట్లతో నిర్వాహకులు బీమా చేయించగా.. రూ. కోట్లు విలువైన కరెన్సీ నోట్లతో ఓ వినాయకుడిని అలంకరించారు. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ వినాయకుల విశేషాలేంటో తెలుసుకుందాం.

వినాయకుడికి రూ.360.40 కోట్లతో బీమా..
Insurance To Lord Ganesha : ముంబయిలోని ప్రముఖ జీఎస్‌బీ సేవా మండల్‌ మహాగణపతి ఈ ఏడాదీ జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని ఏకంగా 66.5కిలోల బంగారు, 295 కిలోలకుపైగా వెండి ఆభరణాలు, ఇతరత్రా విలువైన వస్తువులతో అలంకరించారు. ఈ ఏడాది 69వ వార్షికోత్సవం జరుపుకొంటున్న వేళ.. ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా మండపం వద్ద మొదటిసారి ఫేషియల్‌ రికగ్నిషన్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు.

అంతేకాకుండా మండపానికి రికార్డు స్థాయిలో రూ.360.40 కోట్లకు బీమా చేయించారు. ఇది భక్తులకు కూడా వర్తిస్తుందన్నారు. గతేడాది రూ.316 కోట్లకు బీమా చేయించినట్లు చెప్పారు. భక్తుల సౌలభ్యం కోసం క్యూఆర్‌ కోడ్, డిజిటల్ లైవ్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. వచ్చే ఏడాది అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని హోమం, ఇతరత్రా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జీఎస్‌బీ సేవా మండల్‌ నిర్వాహకులు తెలిపారు.

చంద్రయాన్​-3 గణపతి..
Chandrayaan 3 Ganesh Decoration : తమిళనాడులోని కీల్‌కట్టలైలో నిర్వాహకులు.. చంద్రయాన్‌ 3 దిగ్విజయానికి గుర్తుగా మండపం వద్ద చంద్రయాన్‌ 3 రాకెట్‌ నమూనాను ఏర్పాటు చేశారు. కోల్‌కతాలో ఓ చోట వినాయక మండపాన్ని చంద్రయాన్‌ 3 వాహకనౌక ఆకృతిలో తీర్చిదిద్దారు.

కరెన్సీ నోట్లతో అలంకరణ..
Ganesha Decoration With Currency Notes : కర్ణాటకలోని పుట్టెనహళ్లిలో సత్యగణపతి ఆలయంలోని మండపాన్ని 500, 200, 100 రూపాయల కరెన్సీ నోట్లు, నాణేలతో అలంకరించారు. ముంబయిలో ప్రతిష్ఠించిన ఓ వినాయక విగ్రహానికి ఏకంగా 69 కిలోల బంగారం, 336 కిలోల వెండితో చేసిన ఆభరణాలను అలంకరించారు. తమిళనాడులోని మలైకొట్టై ఆలయంలో విగ్నేషుడికి వెయ్యి కిలోల కొబ్బరి, తాటిబెల్లంతో చేసిన 150 కిలోల కొరుకట్టై ప్రసాదాన్ని సమర్పించారు.

ఒకే చోట 20 వేల గణేశ్‌ విగ్రహాలు..
పుణెలోని ప్రసిద్ధ దగ్డుషేట్‌ హల్వాయి గణేషుడి మండపాన్ని అయోధ్య రామమందిర నమూనా తరహాలో ఏర్పాటు చేశారు. ఈ పందిరిని చూసేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. తమిళనాడు చిట్లపక్కంలో ఒకే చోట 20 వేల గణేశ్‌ విగ్రహాలను ఎగ్జిబిషన్‌కు పెట్టారు. చిన్నవి, పెద్దవి, మట్టి, కొయ్య విగ్రహాలు, సూపర్‌ హీరోల ఆకృతుల్లో ప్రదర్శిస్తున్న వీటిని చూసేందుకు సందర్శకులు భారీగా వస్తున్నారు.

Last Updated : Sep 18, 2023, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.