ETV Bharat / bharat

సిబల్ ఇంటి వద్ద నిరసనలపై జీ23 నేతల ఆగ్రహం

author img

By

Published : Sep 30, 2021, 7:07 PM IST

కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ నివాసం ఎదుట పార్టీ కార్యకర్తలు నిరసన చేయడాన్ని జీ23 నేతలు (G23 Leaders list) తప్పుబట్టారు. ఘటనకు సంబంధం ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని (G23 congress) డిమాండ్ చేశారు. ఇది పార్టీకి మంచిది కాదని అన్నారు.

g23 leaders list
జీ23 నేతలు

కాంగ్రెస్​ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కపిల్ సిబల్ (Kapil Sibal news) చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పార్టీ కార్యకర్తలు ఆయన ఇంటి ముందు నిరసన చేయడాన్ని జీ23 నేతలు(G23 Leaders) గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ ఖండించారు. ఇది ప్రణాళికా ప్రకారం చేసిన గూండాయిజమని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు సంబంధించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

"ఆయన(సిబల్) నమ్మకమైన కాంగ్రెస్​వాది. పార్లమెంట్ బయట, లోపల పార్టీ కోసం పోరాడారు. సలహాలు ఎలాంటి వర్గం నుంచి వచ్చినా వాటిని అణచివేయకుండా, స్వీకరించాలి. గూండాయిజం ఆమోదయోగ్యం కాదు."

-గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ సీనియర్ నేత

ప్రజాస్వామ్యంలో అభిప్రాయభేదాలు సహజమేనని జీ23 నేతల్లో ఒకరైన ఆనంద్ శర్మ (Anand sharma) పేర్కొన్నారు. హింస, అసహనం కాంగ్రెస్ సంస్కృతికి వ్యతిరేకమని చెప్పారు. ఇలాంటి దుర్భరమైన ఘటనలు పార్టీకి అప్రతిష్ఠను తీసుకొస్తాయని ట్వీట్ చేశారు. వీటిని ఖండించాలని అన్నారు. 'భావప్రకటనా హక్కును పరిరక్షించిన ఘనమైన చరిత్ర కాంగ్రెస్​కు ఉంది. ఈ ఘటనకు కారకులైనవారిని గుర్తించి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi news) ఘటనను తీవ్రంగా పరిగణించాలి' అని పేర్కొన్నారు.

'సీనియర్లు పార్టీకి కీలకం'

మరోవైపు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సైతం కార్యకర్తల నిరసనను ఖండించారు. 'పార్టీ నాయకత్వానికి సంతృప్తికరం కాని అభిప్రాయాలు చెప్పినందుకే.. సిబల్ ఇంటిపై దాడి జరిగింది' అని చెప్పుకొచ్చారు.

"సీనియర్ నేతలను పూర్తిగా విస్మరించడం దురదృష్టకరం. ఇలా చేయడం పార్టీకే మంచిది కాదు. సీనియర్ నేతలు ఆలోచనాపరులు. పార్టీ భవిష్యత్​కు వారు కీలకం. వ్యూహాలు రూపొందించేందుకు సీనియర్ నేతలను ఉపయోగించుకోవాలి. యువ నాయకత్వానికి వాటిని అమలు చేసే బాధ్యత అప్పగించాలి."

-అమరీందర్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత, పంజాబ్ మాజీ సీఎం

కాంగ్రెస్ ఎంపీలు మనీశ్ తివారీ, శశి థరూర్, వివేక్ తన్ఖా సైతం నిరసనలను ఖండించారు.

రాహుల్ గాంధీనే కారణం!

మరోవైపు, కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం ఏమాత్రం సరిగ్గా లేదని మాజీ విదేశాంగ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నట్వర్ సింగ్ అన్నారు. దీనికి ముగ్గురు కారకులని చెప్పారు. అందులో ఒకరు రాహుల్ గాంధీ అని తెలిపారు. పార్టీలో ఎలాంటి పదవులు లేకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

నిరసన ఎందుకంటే?

పంజాబ్​ కాంగ్రెస్​లో సంక్షోభ పరిస్థితుల (Punjab Congress Crisis) నేపథ్యంలో పార్టీలో సంస్కరణలపై కపిల్ సిబల్ బుధవారం మాట్లాడారు. గతేడాది ఆగస్టులో కాంగ్రెస్ నాయకత్వానికి లేఖ రాసిన నేతలు (G23 Congress) ఇప్పటికీ చర్యల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. అధ్యక్ష పదవితో పాటు సీడబ్ల్యూసీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఎన్నికలపై అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్​కు అధ్యక్షులు లేరని.. ఇలాంటప్పుడు నిర్ణయాలన్నీ ఎవరు తీసుకుంటున్నారో తెలియదని అన్నారు.

కాగా, సిబల్ వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం రాత్రి ఆయన నివాసం ఎదుట నిరసనకు దిగారు. త్వరగా కోలుకోవాలంటూ రాసి ఉన్న ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. కపిల్ సిబల్ వ్యాఖ్యలు తమను బాధించాయని, అందుకే తమంతట తాముగా వెళ్లి ఆయన నివాసం ఎదుట నిరసన చేసినట్లు దిల్లీ పీసీసీ వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చదవండి: 'కాంగ్రెస్​కు అధ్యక్షులు లేరు.. నిర్ణయాలు ఎవరివో తెలీదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.