ETV Bharat / bharat

మనీలాండరింగ్​ కేసులో మాజీ హోంమంత్రి అరెస్ట్​

author img

By

Published : Nov 2, 2021, 2:24 AM IST

Updated : Nov 2, 2021, 6:38 AM IST

మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. 12 గంటలపాటు ఆయను విచారించిన తర్వాత అదుపులోకి తీసుకుంది.

Anil Deshmukh
అనిల్​ దేశ్​ముఖ్

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్​ను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం అర్ధరాత్రి రాత్రి అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో 12 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు.. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం ఆయనపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

విచారణకు అనిల్ దేశ్​ముఖ్​ సహకరించలేదని ఈడీ అధికారులు తెలిపారు. మంగళవారం స్థానిక న్యాయస్థానం ఎదుట ఆయనను హాజరు పరిచి, కస్టడీకి అప్పగించాలని కోరుతామని చెప్పారు. విచారణ కోసం.. దక్షిణ ముంబయిలోని బల్లార్డ్ ఎస్టేట్ ప్రాంతంలోని ఈడీ కార్యాలయానికి అనిల్ దేశ్​ముఖ్​ తన న్యాయవాదులతో కలిసి ఉదయం 11:40 గంటలకు వచ్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని దేశ్​ముఖ్​కు ఈడీ ఐదు సార్లు నోటీసులు పంపించింది. అయితే.. ఈ సమన్లను రద్దు చేయాలని కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం గతవారం తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో.. సోమవారం ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు.

బార్లు, రెస్టారెంట్ల నుంచి ప్రతి నెల రూ.100కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారులపై దేశ్‌ముఖ్‌ ఒత్తిడి తెచ్చినట్లు ముంబయి మాజీ సీపీ పరంబీర్‌ సింగ్‌ ఆరోపించారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆయనపై కేసు నమోదు చేసింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​ ఆధారంగా ఈడీ ఆయనపై చర్యలు చేపట్టింది.

ఇదీ చూడండి: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి ఇంట్లో సీబీఐ సోదాలు​

Last Updated : Nov 2, 2021, 6:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.