మధ్యప్రదేశ్లో ఓ రైతు అనతికాలంలోనే లక్షాధికారి అయ్యాడు. అదేదో వ్యాపారంలో లాభంతోనో, లేక పండించిన పంటల వల్లనో కాదు. అదృష్టం వరించి ఓ వజ్రం అతడికి దొరకడం వల్ల... సుమారు రూ.60 లక్షలను సొంతం చేసుకున్నాడా వ్యక్తి.
ఇదీ జరగింది..
పన్నా జిల్లాలోని కృష్ణ కళ్యాణ్పుర్కు చెందిన లఖన్ యాదవ్(45) అనే రైతు.. గత నెల తన పొలంలో పని చేస్తుండగా 14.98 క్యారెట్ల వజ్రం దొరికింది. ఈ వజ్రాన్ని రూ. 60.60లక్షలకు విక్రయించాడు లఖన్. రెండెకరాల భూమి ఉన్న ఈ రైతు.. వజ్రం దొరకడంపై ఆనందం వ్యక్తం చేశాడు. ఇది దేవుడిచ్చిన వరం అన్న ఆయన.. ఈ సొమ్మును తన పిల్లల చదువుకోసం వినియోగిస్తానని చెప్పాడు.
బుందేల్ఖండ్ ప్రాంతంలోని పన్నా జిల్లా వజ్రాల గనిలో.. గతంలోనూ ముగ్గురు రైతులకు వజ్రాలు లభించాయి. అయితే.. లఖన్ వార్త మాత్రం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
వచ్చే ఏడాది వేలం!
ఈ ప్రాంతంలో ఇలా లభించిన మొత్తం 203 వజ్రాల(269.16 క్యారెట్లు)ను వేలానికి ఉంచామని తెలిపారు స్థానిక జిల్లా కలెక్టర్. అందులో మన్నికలేని(131) వాటిని అమ్మకానికి ఉంచలేదన్నారు. ఈ వేలం ప్రక్రియను వచ్చే ఏడాది నిర్వహిస్తున్నట్టు సమాచారం.
ఇదీ చదవండి: కోరినంత మందు పోయలేదని వరుడి హత్య