ETV Bharat / bharat

గుజరాత్​, హిమాచల్​ప్రదేశ్​ ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్​ లెక్క ఎంత వరకు కరెక్ట్?

author img

By

Published : Dec 8, 2022, 9:41 PM IST

EXIT POLL RESULTS 2022: ఎన్నికల పోరు ముగిశాక.. ఫలితాలు వచ్చే వరకు నాయకులకు కంటి మీద కునుకు ఉండదు. అత్యధికులు ఎగ్జిట్​ పోల్స్​పై ఎనలేని విశ్వసనీయతను కనబరుస్తారు. ఓటరు నాడి పట్టుకోవటంలో కొన్నిసార్లు విఫలమైతే, కొన్నిసారు సఫలమవుతాయి ఎగ్జిట్​ పోల్స్. గుజరాత్​, హిమాచల్​ ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలు నిజమయ్యాయనే చెప్పాలి.

exit poll results 2022
ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలు 2022

EXIT POLLS ACCURACY 2022: ఎన్నికలేవైనా, ఏ దేశమైనా ఒపీనియన్​, ఎగ్జిట్​ పోల్స్​కు విశేష ప్రజాదరణ ఉంటుంది. కొన్నిసార్లు ఓటరు నాడి పట్టుకోవడంలో ఎగ్జిట్​ పోల్స్ విఫలమైనా.. ఎక్కువ సందర్భాల్లో దాదాపుగా​ అవే ఫలితాలు వస్తున్నాయి. ఇందుకు తాజాగా జరిగిన గుజరాత్, హిమాచల్​ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే సాక్ష్యంగా నిలిచాయి. ​

2022 గుజరాత్ ఎగ్జిట్ ​పోల్స్..
గుజరాత్‌లో భాజపా అధికారం నిలబెట్టుకుంటోందని ఎగ్జిట్ పోల్స్ ముందే అంచనా వేశాయి. వరుసగా ఏడోసారి కమలదళం జయభేరి మోగిస్తుందని అన్ని సంస్థల సర్వేలు స్పష్టం చేశాయి. కాంగ్రెస్‌ రెండోస్థానానికి పరిమితం అవుతుందని.. ఆమ్‌ఆద్మీ పార్టీ పెద్దగా ఉనికి చాటుకోలేదని ఎగ్జిట్‌పోల్స్‌ తెలిపాయి.

exit poll results 2022
గుజరాత్ ఎగ్జిట్​​ పోల్స్

ఎగ్జిట్ పోల్స్​ చెప్పినట్టుగానే గుజరాత్​లో భాజపా రికార్డు విజయం సాధించింది. వరుసగా ఏడోసారి విజయం సాధించి 37 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టింది. మొత్తం 182 స్థానాలకు 156 స్థానాల్లో గెలుపొంది సరికొత్త చరిత్రను లిఖించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 17, ఆప్‌ 5, ఇతరులు 4 స్థానాలను దక్కించుకున్నాయి.

2022 హిమాచల్​ప్రదేశ్​ ఎగ్జిట్​ పోల్స్..
హిమాచల్‌ప్రదేశ్‌లో భాజపా, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని ఎగ్జిట్​పోల్స్ ముందే అంచనా వేశాయి. కానీ మొత్తం 68 స్థానాలకు గాను.. కాంగ్రెస్​ పార్టీ 40 సీట్లను గెలుచుకుని అధికారం కైవసం చేసుకుంది. గుజరాత్​లో ఘన విజయం సాధించిన భాజపా.. హిమాచల్​లో​ మాత్రం 25 సీట్లకే పరిమితమైంది. ఆమ్​ఆద్మీ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. కాగా, ముగ్గురు స్వతంత్రులు శాసనసభకు ఎన్నికయ్యారు.

exit poll results 2022
హిమాచల్​ప్రదేశ్ ఎగ్జిట్​ పోల్స్

అంతకుముందు ఇలా..
ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి భాజపా అధికారాన్ని కైవసం చేసుకుంటుందని దాదాపు అన్ని ఎగ్జిట్​ పోల్స్​ వెల్లడించాయి. వాటి అంచనాలను నిజం చేస్తూ అధికార భాజపా స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. చెప్పినట్లుగానే సమాజ్​ వాదీ పార్టీ రెండో స్థానానికి పరిమితం అయ్యింది. మరోవైపు, పంజాబ్​లో ఓటర్లు మార్పు కోరుకున్నారని, ఈసారి అధికార కాంగ్రెస్‌కు గట్టి షాకిస్తూ.. ఆప్‌ వైపు మొగ్గనున్నారని ఎగ్జిట్​పోల్స్ స్పష్టం చేశాయి. ఆప్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని పేర్కొన్నాయి. ఆ మాటలను నిజం చేస్తూ.. ఆప్​ 92 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. అధికార కాంగ్రెస్​ కేవలం 18 స్థానాలకే పరిమితం అయ్యింది.

ఉత్తరాఖండ్​లో ఈ దఫా భాజపా, కాంగ్రెస్‌ నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డాయని ఎగ్జిట్​ పోల్స్​ పేర్కొన్నాయి. కానీ వాటి అంచనాలకు మించి కమలం పార్టీ రాణించింది. ఏకంగా 47 సీట్లను గెలుచుకుంది. మరోపైపు మణిపుర్​లో ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచినప్పటికీ, సరైన సమయంలో చక్రం తిప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన భాజపా.. ఈ దఫా కూడా సొంతంగా అధికార పీఠాన్ని చేజిక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎగ్జిట్​పోల్స్​ పేర్కొన్నాయి. అదే విధంగా ఏకైక అతిపెద్ద పార్టీగా భాజపా అవతరించింది. ఎప్పట్లాగే గోవాలో హంగ్‌ తలెత్తే సంకేతాలు కనిపిస్తున్నాయని ఎగ్జిట్​ పోల్స్​ లెక్క కట్టాయి. అయితే భాజపా మ్యాజిక్​ ఫిగర్​ కు ఒక్క అడుగు దూరంలో నిలిచి.. స్వతంత్రుల సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

బంగాల్ ఎన్నికల్లో..
2021 బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి స్వల్ప ఆధిక్యంతో.. భాజపాతో హోరాహోరీ పోరు ఉంటుందని అన్ని ఎగ్జిట్​ పోల్స్​ వెల్లడించాయి. అయితే.. ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలకు భిన్నంగా టీఎంసీ అధిక సీట్లు సాధించింది. తమిళనాడు శాసనసభ పోరులో డీఎంకేకే విజయావకాశాలు ఉన్నాయని దాదాపు అన్ని ఎగ్జిట్​ పోల్స్​ అంచనా వేశాయి. అవే అంచనాలు నిజమై.. డీఎంకే భారీగా సీట్లు సాధించింది. కేరళలో మరోమారు ఎల్​డీఎఫ్​కు మెజారిటీ వస్తుందని అన్ని ఎగ్జిట్​ పోల్స్​ తేల్చేశాయి. అంచనాలను నిజం చేస్తూ ఎల్​డీఎఫ్​ భారీ మెజారిటీతో మూడోసారి అధికారం చేపట్టింది. అసోంలో మరోమారు ఎన్డీఏకే విజయావకాశాలు మెండుగా ఉన్నాయని అన్ని సర్వేలు తేల్చాయి. అదే విధంగా.. భాజపా నేతృత్వంలోని కూటమి మెజారిటీ సాధించింది. పుదుచ్చేరిలో అధికార మార్పిడి తప్పదని దాదాపు అన్ని ఎగ్జిట్​ పోల్స్​ అంచనా వేశాయి. ఎన్డీఏ కూటమి మెజారిటీ సాధిస్తుందని తేల్చాయి. ఎగ్జిట్​ పోల్స్​ నిజం చేస్తూ.. ఫలితాలు వెలువడ్డాయి.

2019 సార్వత్రికంలో అంచనాలకు మించి..
2019 సాధారణ ఎన్నికలు ముగిసిన రోజే ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలు విడుదలయ్యాయి. రెండోసారి భాజపా నేతృత్వంలోని ఎన్డీఏనే మరోమారు అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశాయి పలు సర్వే సంస్థలు. సుమారు 300 పైచిలుకు సీట్లు సాధిస్తుందని తెలిపాయి. కానీ ఏబీపీ న్యూస్​, నేత న్యూస్​ ఎక్స్​ మాత్రమే అధికార కూటమికి మెజారిటీ తగ్గిపోతుందని తెలిపాయి. ఎన్డీఏకు 267 సీట్లు వస్తాయని ఏబీపీ న్యూస్​ చెప్పగా, న్యూస్​ ఎక్స్​ 242 వస్తాయని తెలిపింది.

అయితే.. భాజపా అంచనాలకు మించి అధిక స్థానాలతో సొంతంగానే మెజార్టీ సాధించింది. ఎన్డీఏ 353 స్థానాలు గెల్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2014 కంటే 21 సీట్లు అధికంగా గెలిచి భాజపానే ఆధిపత్యం చెలాయించింది. యూపీఏ 90 సీట్లకే పరిమితమైంది.

2014 ఎగ్జిట్​ పోల్స్​..
2014లో మొత్తం 7 సంస్థలు తమ ఎగ్జిట్​ పోల్స్​ను ప్రకటించగా అందులో న్యూస్​-24 చాణక్య మాత్రమే దాదాపు కచ్చితమైన ఫలితాలను అంచనా వేయగలిగింది. ఎన్డీఏకు 340 సీట్లు వస్తాయని పేర్కొనగా.. అప్పటి ఎన్నికల్లో 336 సీట్లు వచ్చాయి. యూపీఏకు 70 సీట్లు అంచనా వేయగా 59 సీట్లు వచ్చాయి.

2004, 2009 విఫలం..
2004, 2009 ఎన్నికల్లోనూ ఎగ్జిట్​ పోల్స్​ విఫలమయ్యాయి. యూపీఏ, ఎన్డీఏల మధ్య గట్టి పోటీ ఉంటుందని చెప్పినప్పటికీ ఫలితాలు తారుమారయ్యాయి. రెండు సార్లూ యూపీఏ సునాయాసంగానే అధికారం చేజిక్కించుకుంది.

2015 దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు..
2014 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా సునామీ సృష్టించిన ఏడాది తర్వాత దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో భాజపా, ఆమ్​ఆద్మీ, కాంగ్రెస్​ కొదమ సింహాల్లా గర్జించాయి. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న దిల్లీలో ఆప్​ 40-45 సీట్ల వరకు గెలుస్తుందనుకున్న ఎగ్జిట్​ పోల్స్​ అంచనాల నేపథ్యంలో.. వాటిని తలకిందులు చేస్తూ ఆప్​ 70కి 67 సీట్లు గెలిచి చరిత్ర సృష్టించింది.

బిహార్​లోనూ అంతే..
2015 బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ భాజపా, జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్​ మహాకూటమి మధ్యే. 243 అసెంబ్లీ స్థానాల్లో ఎగ్జిట్​ పోల్స్​ భాజపాకు 100+ వస్తాయని, మహాకూటమి.. కాషాయ పార్టీ వెనుక ఉండొచ్చని అంచనా వేశాయి. ​అయితే ఫలితాలు మాత్రం తారుమారయ్యాయి. ఎన్​డీఏ 58 సీట్లకే పరిమితమైంది. జేడీయూ, ఆర్​ఎల్​డీ నేతృత్వంలోని మహాకూటమి 178 సీట్లతో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఇక్కడా ఎగ్జిట్​ పోల్స్ ఓటరు నాడి పట్టుకోలేకపోయాయి.

ఎగ్జిట్​ పోల్స్​లో గెలిచి.. ఫలితాల్లో ఓడారు..
2004 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా గెలుపు తథ్యమని ఎగ్జిట్​ పోల్స్​ కోడై కూశాయి. 543 లోక్​సభ సీట్లలో 230- 275 స్థానాలు ఎన్​డీఏకు వస్తాయని అంచనా వేశాయి ఎగ్జిట్​ పోల్స్​. ఫలితాల్లో మాత్రం యూపీఏ 218 గెల్చుకుని ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.