ETV Bharat / bharat

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​కే మా మద్దతు - లాలూ ప్రసాద్​

author img

By

Published : Oct 30, 2021, 1:47 PM IST

Updated : Oct 30, 2021, 4:24 PM IST

Lalu Yadav
లాలూ ప్రసాద్​ యాదవ్​

బిహార్​లో జరుగుతున్నఉపఎన్నికల్లో (Bihar By Election News) ఆర్​జేడీ భారీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ అన్నారు. ముఖ్యమంత్రిగా నితీశ్​కుమార్​ను ప్రజలు తిరస్కరించారని విమర్శించారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్​ పార్టీకి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.

బిహార్​లో అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉపఎన్నికల్లో (Bihar By Election News) ఆర్​జేడీ పార్టీ భారీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ ధీమా వ్యక్తం చేశారు. ఈటీవీ భారత్​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రిగా నితీశ్​ను బిహార్​ ప్రజలు తిరస్కరించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తారాపుర్​, కుశేశ్వర్​స్థాన్​ అసెంబ్లీ సెగ్మెంట్లకు శనివారం ఉపఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో.. సుదీర్ఘ విరామం తరువాత తిరిగి రాజకీయాల్లో అడుగుపెట్టడం గురించి మాట్లాడారు.

"ఆరేళ్ల తర్వాత రాజకీయంలో వచ్చాను. ఈ స్థాయిలో ప్రజల నుంచి మద్దతు లభించడం నిజంగా గొప్ప విషయం. నాకు చాలా ఆనందంగా ఉంది. కుశేశ్వర్ స్థాన్, తారాపుర్ అసెంబ్లీ సెగ్మెంట్​లలో భారీ విజయాన్ని నమోదు చేస్తాం. ఈ ఎన్నికల్లో నితీశ్​కు ప్రజలు బుద్ది చెప్తారు."

- లాలూ ప్రసాద్​ యాదవ్​, ఆర్​జేడీ అధినేత

కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంపై లాలూ ప్రసాద్​ యాదవ్​ స్పందించారు. భాజపాకు ప్రత్యామ్నాయంగా జాతీయస్థాయిలో ఓ బలమైన పార్టీ కావాలని.. అది కాంగ్రెస్సే అని అన్నారు.

"సోనియా గాంధీ ఫోన్​ చేసిన మాట వాస్తవమే. ఆమె నా మంచి కోరే వ్యక్తి. అందుకే ఫోన్​ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ స్థాయిలో భాజపాకు బలమైన ప్రత్యర్థి కావాలి. అనాది నుంచి కాంగ్రెస్​ ఉంది. ఈ పార్టీనే బలమైనదని నేను విశ్వసిస్తున్నాను. మా మద్దతు హస్తం నేతలకు ఎప్పుడూ ఉంటుంది. అందుకే వచ్చే సాధారణ ఎన్నికల కోసమని.. విపక్షాల మద్దతు కూడగట్టేందుకు అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని సోనియాగాంధీకి సూచించాను. బహుశా నవంబర్​లో ఈ సమావేశం జరగొచ్చు."

- లాలూ ప్రసాద్​, ఆర్​జేడీ అధినేత

అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్​కే మా మద్దతు..

ఉత్తర్​ప్రదేశ్​లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్​వాదీ పార్టీకి తమ మద్దతు ఉంటుందని ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ చెప్పారు. ఎస్​పీలో ఉండే అంతర్గత కలహాలపై స్పందించిన ఆయన.. అలాంటివి ఏమీ లేవని అన్నారు. యూపీ ఎన్నికల్లో ఆర్​జేడీని నుంచి ఎవరూ పోటీ చేయరని చెప్పిన లాలూ.. బహిరంగంగా ఎస్​పీకి మద్దతు ఇస్తామన్నారు.

తన కొడుకు తేజస్వీయాదవ్​పై లాలూ ప్రశంసల వర్షం కురిపించారు. తాను లేని సమయంలో కూడా పార్టీని కాపాడుకుంటూ వచ్చారని అన్నారు. అంచనాలకు మించి తేజస్వీ గత ఎన్నికల్లో రాణించినట్లు పేర్కొన్నారు. కష్టకాలంలో పార్టీకి, తేజస్వీకి తోడుండి నడిపించిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: 'పంటలను అమ్ముకునేందుకు పార్లమెంట్‌కు వెళ్తాం'

Last Updated :Oct 30, 2021, 4:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.