భీమా కోరెగావ్ కేసులో ప్రొఫెసర్ ఆనంద్​కు బెయిల్​.. కానీ..

author img

By

Published : Nov 18, 2022, 12:46 PM IST

Updated : Nov 18, 2022, 1:19 PM IST

elgar parishad case

Elgar Parishad Case : భీమా కోరెగావ్ కేసులో ప్రొఫెసర్​ ఆనంద్ తెల్​తుంబ్డేకు ఊరట లభించింది. ఆయనకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ ఆయన మరో వారం వరకు బయటకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే?

Elgar Parishad Case : భీమా కోరెగావ్ కేసులో ప్రొఫెసర్​ ఆనంద్ తెల్​తుంబ్డేకు ఊరట లభించింది. ఆయనకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తు చెల్లించాలని ఆదేశించింది. కానీ ఎన్​ఐఏ.. సుప్రీంకోర్టును ఆశ్రయిచేందుకు వీలుగా బెయిల్​పై వారంరోజులపాటు హైకోర్టు స్టే విధించింది. దీంతో ఆయన మరో వారం రోజులు జైలులోనే ఉండనున్నారు.

భీమా కోరెగావ్ కేసులో ఆనంద్ తెల్​తుంబ్డేను ఎన్​ఐఏ.. 2020లో అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. బెయిల్​ కోసం ప్రత్యేక కోర్టును ఆనంద్​ ఆశ్రయించగా కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో గతేడాది హైకోర్టులో ఆయన పిల్ వేశారు. 2017లో పుణెలో జరిగిన ఎల్గార్ పరిషత్ కార్యక్రమానికి తాను హాజరుకాలేదని.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయలేదని ఆయన పేర్కొన్నారు.
భీమా కోరెగావ్ కేసులో బెయిల్ పొందిన మూడో వ్యక్తి ఆనంద్​ తెల్​తుంబ్డే. అంతకుముందు విరసం నేత వరవరరావు, న్యాయవాది సుధా భరద్వాజ్ బెయిల్​పై విడుదల అయ్యారు.

ఇదీ కేసు..
మహారాష్ట్ర.. పుణె జిల్లాలోని భీమా కోరెగావ్‌లో 2018 జనవరి 1న హింస చెలరేగింది. 200 ఏళ్ల కింద జరిగిన భీమా కోరేగావ్‌ యుద్ధాన్ని స్మరించుకునేందుకు ఎల్గార్‌ పరిషత్‌ నేతృత్వంలో చేసిన ప్రయత్నం చివరకి అల్లర్లకు దారితీసింది. ఆ అల్లర్లలో ఒకరు మృతి చెందగా, పోలీసులతో సహా పలువురు గాయపడ్డారు. వీటితో పాటు నక్సల్స్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో వరవరరావుతో సహా ఐదుగురిని 2018లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం 2020లో ఈ కేసును ఎన్‌ఐఏ చేపట్టింది.

Last Updated :Nov 18, 2022, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.