ETV Bharat / bharat

దిల్లీ మున్సి'పోల్స్'​లో ఆప్​ నయా చరిత్ర.. భాజపా 15 ఏళ్ల పాలనకు తెర

author img

By

Published : Dec 7, 2022, 1:49 PM IST

Updated : Dec 7, 2022, 3:58 PM IST

దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 250 వార్డుల్లో 133 స్థానాల్లో గెలుపొంది మేయర్‌ సీటు దక్కించుకుంది. ఫలితంగా 15 ఏళ్ల భాజపా పాలనకు తెరపడింది. మరోవైపు, విజయానంతరం సీఎం కేజ్రీవాల్​ ప్రసంగించారు. ప్రధాని మోదీ తమను ఆశీర్వదించాలని కోరారు.

Delhi MCD Elections 2022 counting
Delhi MCD Elections 2022 counting

Delhi MCD Elections 2022 : దేశ రాజధాని దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 15 ఏళ్ల భాజపా పాలనను ఆమ్‌ ఆద్మీ పార్టీ ఊడ్చేసింది. బుధవారం వెలువడిన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ మార్క్‌(126)ను దాటి.. ఆప్‌ 134 స్థానాలకు కైవసం చేసుకుంది. దీంతో మేయర్‌ సీటు ఆమ్ ఆద్మీ వశమైంది.

Delhi MCD Elections 2022 counting
సంబరాలు చేసుకుంటున్న ఆప్​ నేతలు

భాజపా గట్టి పోటీ..
ఈ ఎన్నికల్లో భాజపాకు ఘోర పరాజయం తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినా.. ఆప్​కు కాస్త గట్టి పోటీనే ఇచ్చింది కమలదళం. 104 వార్డులను గెలుచుకుంది. కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా చతికిలపడింది. ఈ ఫలితాల్లో హస్తం పార్టీ కేవలం 9 స్థానాలకు పరిమితమైంది. మరో మూడు చోట్ల ఇతరులు విజయం సాధించారు. దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఈ నెల 4న పోలింగ్ జరగ్గా 50.47శాతం ఓటింగ్ నమోదైంది.

తొలి ట్రాన్స్​జెండర్​ అభ్యర్థి ఎన్నిక
సుల్తాన్‌పురి-ఎ వార్డు నుంచి ఆప్ బరిలోకి దింపిన ట్రాన్స్​జెండర్​ అభ్యర్థి బోబీ ఆ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి వరుణ ఢాకాను 6,714 ఓట్ల తేడాతో ఆమె ఓడించారు. కాగా దిల్లీ మున్సిపల్​ ఎన్నికల్లో ట్రాన్స్​జెండర్​ అభ్యర్థి ఎన్నికవ్వడం ఇదే తొలిసారి అని ఎన్నికల సంఘం పేర్కొంది.

Delhi MCD Elections 2022 counting
ఆప్ ట్రాన్స్​జెండర్​ అభ్యర్థి బోబీ

అంబరాన్నంటిన కార్యకర్తల సంబరాలు..
బుధవారం ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అందుకోసం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఓట్ల లెక్కింపు జరిగిన 42 కేంద్రాల్లో 20కంపెనీల పారా మిలటరీ బలగాలతోపాటు 10వేలకుపైగా దిల్లీ పోలీసులు మోహరించారు. దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ఆప్‌ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. పార్టీ కార్యాలయం వద్ద ఆప్‌ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఎన్నికల్లో విజయం పట్ల ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. డీడీయూ మార్గ్​లో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయంలో కేజ్రీవాల్​ ప్రసంగించారు.

"దిల్లీ మున్సిపల్​ ఎన్నికల్లో ఆప్‌ ఘన విజయం సాధించినందుకు ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. భాజపా, కాంగ్రెస్‌ సహకారంతో పాటు 'ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులు' కావాలి. అప్పుడే పౌరసౌకర్యాలు మెరుగుపడతాయి."

-- అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ ముఖ్యమంత్రి

'విజయం మాత్రమే కాదు.. ఓ పెద్ద బాధ్యత'
మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీపై విశ్వాసం చూపించినందుకు దిల్లీ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోదియా. "ప్రజల తీర్పుతో మేం ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న పార్టీని ఓడించగలిగాం. ఇది మాకు విజయం మాత్రమే కాదు. ఓ పెద్ద బాధ్యత" అంటూ ప్రసంగించారు.

1958లో ఏర్పాటైన ఎంసీడీని 2012లో నాటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ హయాంలో మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు. తిరిగి వాటిని ఈ ఏడాది విలీనం చేసి ఎంసీడీగా పునరుద్ధరించారు. మే 22 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఒకటిన్నర దశాబ్దం పాటు భాజపానే అధికారంలో ఉంది. 2017 మున్సిపల్‌ ఎన్నికల్లో భాజపా 181 స్థానాల్లో గెలుపొందింది. ఆప్‌ 48, కాంగ్రెస్‌ 27 వార్డుల్ని కైవసం చేసుకున్నాయి.

Delhi MCD Elections 2022 counting
సంబరాలు చేసుకుంటున్న ఆప్​ నేతలు
Last Updated : Dec 7, 2022, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.