విద్యార్థి ప్రాణాలు తీసిన డేర్​ గేమ్.. పోటాపోటీగా ఐరన్ ట్యాబ్లెట్స్ మింగి మృతి

author img

By

Published : Mar 10, 2023, 1:07 PM IST

dare games to play with friends

స్కూల్​లో​ ఆటలాడుతూ ఓ విద్యార్థిని ప్రాణాలు విడిచింది. దీంతోపాటుగా ఈ గేమ్​ ఆడిన మరి కొంత మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్కూల్​ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థిని మరణించినట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. దీంతో స్కూల్​ హెచ్​ఎం, ఓ టీచర్​ను విధుల నుంచి తప్పిస్తూ విద్యాశాఖాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. మరో ఘటనలో ఓ బస్సులో మంటలు చెలరేగగా.. అందులో నిద్రిస్తున్న కండక్టర్ సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదం కర్ణాటకలో జరిగింది.

తమిళనాడులో ఓ విద్యార్థిని డేర్​ గేమ్​​ ఆడుతూ మృతిచెందింది. డేర్​ గేమ్​లో భాగంగా ట్యాబ్లెట్స్​ మింగి ప్రాణాలు విడిచింది. హెడ్​ మాస్టర్​ గదిలో ఉన్న మాత్రలతో.. గేమ్​ ఆడిన మరికొందరు విద్యార్థులు కూడా తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెడ్ ​మాస్టర్​తో పాటుగా మరో టీచర్​ను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఊటీలోని మున్సిపల్ ఉర్దూ పాఠశాలలో కొందరు విద్యార్థులు డేర్​ గేమ్​ ఆడారు. దీనిలో భాగంగా ప్రధానోపాధ్యాయుడి గదిలో ఉన్న సోడియం అయాన్​ మాత్రలు మింగారు. మొత్తం నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఈ గేమ్​లో పాల్గొన్నారు. అయితే ఈ గేమ్ ఆడిన.. వారంతా ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయారు. వీరిని గమనించిన స్కూల్ సిబ్బంది.. హుటాహుటిన అస్వస్థతకు గురైన విద్యార్థులను ఊటీ ప్రభుత్వ ఆస్పత్రికు తరలించారు. ప్రస్తుతం అస్వస్థతకు గురైన బాలురు కోలుకున్నారని వైద్యులు తెలిపారు. అయితే వీరిలో ఓ 13 ఏళ్ల బాలికకు తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో వెంటనే అక్కడి ఆస్పత్రి సిబ్బంది.. ఆమెను కోయంబత్తూర్​ మెడికల్​ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఎనిమిదో తరగతి చదువుతున్న మరో విద్యార్థిని పరిస్థితి విషమించగా ఆమెను చెన్నైలోని మరో ఆస్పత్రికి రిఫర్​ చేశారు ఊటీ ప్రభుత్వాస్పత్రి వెద్యులు. అయితే ఆ బాలిక చెన్నైకు తరలిస్తుండగా అంబులెన్స్​లోనే మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విద్యాశాఖ కూడా ఈ విషయంపై ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో హెడ్​మాస్టర్​, మరో టీచర్​ను విద్యాశాఖాధికారులు విధుల నుంచి తప్పించారు.

ప్రభుత్వ బస్సులో మంటలు.. సజీవదహనమైన కండక్టర్
కర్ణాటకలోని బెంగళూరులో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ బస్సులో మంటలు చెలరేగి అందులో నిద్రిస్తున్న కండక్టర్ సజీవ దహనమయ్యారు. శుక్రవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. గురువారం అర్థరాత్రి సుమ్మనహళ్లికి వెళ్లే ఓ ప్రభుత్వ బీఎంటీసీ బస్సును లింగధీరనహళ్లి బస్​స్టాప్​లో ఆపి ఉంచారు. స్టాప్​లో ఉంచిన ఆ బస్సులోనే.. డ్రైవర్​ ప్రకాశ్​, కండక్టర్​ ముత్తయ్య నిద్రించారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఒక్కసారిగా ఆ బీఎంటీసీ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సులో నిద్రిస్తున్న కండక్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంలో డ్రైవర్ ప్రకాశ్​​ టాయిలెట్​కు వెళ్లడం వల్ల ఈ అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని.. భారీ ఎత్తున ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలను గుర్తించే పనిలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలి బూడిదైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.