ETV Bharat / bharat

నకిలీ బర్త్, డెత్ సర్టిఫికేట్​ల కోసం ఆస్పత్రి సర్వర్ హ్యాక్!

author img

By

Published : Aug 22, 2021, 1:54 PM IST

hacking in hospitals
ఆస్పత్రుల్లో హ్యాకింగ్​

దేశంలోనే ఆస్పత్రులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి తెరతీశారా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ ఆస్పత్రి అధికారులు గుర్తించిన సైబర్​ మోసం.. ఈ అనుమానాలకు తావునిస్తోంది. ప్రసూతి వార్డు లేకపోయినా.. ఓ ఆస్పత్రి నుంచి 41 జనన ధ్రువీకరణ పత్రాలను సైబర్​ మోసగాళ్లు జారీ చేశారు.

ఉత్తర్​ప్రదేశ్​లో సైబర్​ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. లఖ్​నవూలోని బలరాంపుర్ ఆస్పత్రిలోని కంప్యూటర్ నెట్​వర్క్​ను హ్యాక్​ చేసి, భారీ మోసానికి పాల్పడ్డారు. నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలను తయారు చేసి, వాటిని వివిధ వ్యక్తులకు అందించారు. ఈ వ్యవహారాన్ని నెలరోజులపాటు దుండగులు కొనసాగించారు. ఈ మోసాన్ని గుర్తించిన ఆస్పత్రి యాజమాన్యం.. వజీర్​గంజ్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

ప్రసూతి వార్డు లేకపోయినా..

బలరాంపుర్​ ఆస్పత్రిలో గైనకాలజీ, ప్రసూతి వార్డు లేనే లేవు. ఇక్కడ ఏ మహిళా ఇప్పటివరకు శిశువుకు జన్మనివ్వలేదు. అయినప్పటికీ.. తమ ఆస్పత్రి నుంచి 41 జనన ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యాయని ఆస్పత్రి అధికారులు గుర్తించారు. అయితే.. ఈ తరహా మోసాలు ఇంకా ఏమైనా జరిగాయా? అన్న కోణంలోనూ ఇంటర్నల్​ ఆడిట్​ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ హ్యాకింగ్​ వెనుక ఆల్​-ఇండియా రాకెట్​ ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల్లో నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ఆన్​లైన్​లో తయారు చేసి, వాటిని ఈ ముఠా అమ్ముతున్నట్లు భావిస్తున్నారు.

నెలరోజులుగా..

చీఫ్​ రిజిస్ట్రార్​ కింద పని చేసే పౌర రిజిస్ట్రేషన్ వ్యవస్థ(సీఆర్​ఎస్​)తో అనుసంధానమైన ఓ పోర్టల్​ ద్వారా తాము సర్టిఫికేట్​లు ఇస్తామని బలరాం ఆస్పత్రిలో ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే అధికారి డాక్టర్ ఎం.పి.సింగ్ తెలిపారు. అయితే.. నెలరోజులుగా పోర్టల్​లోకి లాగిన్​ కావడంలో సమస్యలు ఎదురుకాగా అనుమానం వచ్చిందని వెల్లడించారు.

"మా ఆస్పత్రికి ప్రత్యేక ఐడీ, పాస్​వర్డ్​ ఉంటాయి. అయితే.. గత నెలరోజులుగా మరణ ధ్రువీకరణ పత్రాలను జారీ చేసేందుకు ప్రయత్నించినప్పుడు పోర్టల్​లో మాకు కొన్ని సమస్యలు ఎదురవుతూ వచ్చాయి. మేము దీనిపై చీఫ్​ రిజిస్ట్రార్​ కార్యాలయానికి ఫిర్యాదు చేశాం. అనంతరం ఆగస్టు 16న మళ్లీ మాకు పోర్టల్​ యాక్సెస్​ చేసేందుకు వీలు కాలేదు. దాంతో.. కంప్యూటర్​ నిపుణులు, ఆరోగ్య డైరెక్టరేట్​ అధికారులకు తెలియజేశాం. అప్పుడు చేపట్టిన దర్యాప్తులో కంప్యూటర్ నెట్​వర్క్​ హ్యాకింగ్​ గురైనట్లు తేలింది."

-డాక్టర్ ఎం.పి.సింగ్​, బలరాం ఆస్పత్రి అధికారి

బలరాంపుర్ ఆస్పత్రి తరహాలో ఇతర ఆస్పత్రుల్లో ఏమైనా సమస్యలు ఎదురైతే తమకు తెలియజేయాలని ఆస్పత్రులను కోరామని ముఖ్య వైద్య అధికారి డాక్టర్ మనోజ్ అగర్వాల్​ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చౌక్​ ఏసీపీ ఐ.పి.సింగ్​ తెలిపారు.

ఇదీ చూడండి: Drug smuggling: పొట్టలో రూ.11కోట్లు విలువైన కొకైన్​

ఇదీ చూడండి: 'చెల్లెలి కొడుకే అమ్మకు ఇష్టం.. అందుకే చంపేశా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.