ETV Bharat / bharat

Crime Journalist Murdered : క్రైమ్​ జర్నలిస్ట్ దారుణ హత్య.. ఇంటి తలుపు తట్టి.. కాల్పులకు తెగబడి..

author img

By

Published : Aug 18, 2023, 12:24 PM IST

Updated : Aug 18, 2023, 2:27 PM IST

Crime Journalist Murdered
Crime Journalist Murdered

Crime Journalist Murdered : నేర వార్తలను అందించే ఓ వార్తాపత్రిక జర్నలిస్ట్​ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అతడి ఇంటికి వెళ్లి మరీ కాల్పులకు తెగబడ్డారు. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. బిహార్​లో జరిగిందీ ఘటన.

Crime Journalist Murdered : బిహార్​లోని అరరియా జిల్లాలో ఓ దినపత్రికకు క్రైమ్​ జర్నలిస్ట్​గా పనిచేస్తున్న వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. మృతుడిని విమల్​ కుమార్​గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని రాణిగంజ్​ బ్లాక్​లో ఈ ఘటన జరిగింది. మృతుడు విమల్​ కుమార్​ యాదవ్​.. గతకొన్నేళ్లుగా ఓ వార్తాపత్రికలో రిపోర్టర్​గా పనిచేస్తున్నారు. అయితే శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు విమల్​ ఇంటి తలుపు తట్టారు. వెంటనే విమల్​ తలుపు తీయగా.. అతడి ఛాతిపై కాల్పులు జరిపి పరారయ్యారు. అక్కడికక్కడే విమల్​ కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు.. అతడిని రాణిగంజ్​ ఆస్పత్రికి తరలించినా లాభం లేకుండాపోయింది. అప్పటికే విమల్​ మరణించినట్లు వైద్యులు నిర్ధరించారు.

  • Araria, Bihar | "In the Raniganj Bazar area, a journalist namely Vimal Kumar Yadav was shot dead by unidentified miscreants...post-mortem is being done, dog squad has been called to the murder spot...investigation is on and efforts to arrest the culprits are underway": Ashok… pic.twitter.com/ipvhw6nabL

    — ANI (@ANI) August 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. విమల్​ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్షల కోసం అరరియా సదర్​ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెనిక్స్​ బృందాన్ని పిలిపించారు. విచారణ ప్రారంభించామని.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్పీ అశోక్​ కుమార్​ సింగ్​ తెలిపారు. విమల్​ కుమార్​ హత్య తర్వాత అతడి కుటుంబసభ్యులు భయాందోళనకు గురవుతున్నట్లు వెల్లడించారు. అయితే వారికి తాను అండగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎవరూ భయపడి జీవించాల్సిన అవసరం లేదన్నారు.

'తన అన్న హత్య కేసులో విమల్​ ప్రత్యక్ష సాక్షి'
Journalist Murdered : తన భర్త సోదరుడిని నాలుగేళ్ల క్రితం కొందరు హత్య చేశారని మృతుడు విమల్ కుమార్ భార్య తెలిపింది. "ఆ హత్య కేసులో నా భర్తే ప్రత్యక్ష సాక్షి. ప్రస్తుతం ఈ కేసు విచారణ కోర్టులో కొనసాగుతోంది. కోర్టులో వాంగ్మూలం ఇచ్చినందుకు విమల్‌కు నిత్యం బెదిరింపులు వచ్చేవి. ఆ తర్వాత భద్రత కల్పించాలని పోలీసులను కోరాం. పోలీసులు కనీస భద్రత కల్పించలేదు. బెదిరించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు" అని విమల్​ భార్య ఆరోపించింది.

'సీఎం నీతీశ్​ రాజీనామా చేయాల్సిందే'
ఈ ఘటన తర్వాత బిహార్‌లో నీతీశ్​ ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో నేరాలు బాగా పెరిగిపోయాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి నీతీశ్​ కుమార్.. తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. బిహార్ ప్రజలు సురక్షితంగా లేరని ఆరోపణలు చేశారు.

'రాష్ట్రంలో జంగిల్​ రాజ్​..'
Crime Reporter Killed : అరరియా ఎంపీ ప్రదీప్ కుమార్ సింగ్.. విమల్​ కుమార్​ ఇంటికి చేరుకుని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. నాలుగేళ్ల క్రితమే జర్నలిస్ట్​ విమల్​ సోదరుడు హత్యకు గురయ్యాడని తెలిపారు. ఆ సమయంలోనే నేరస్థులకు శిక్ష పడితే ఈరోజు ఇలా జరిగి ఉండేది కాదని అన్నారు. "రాష్ట్రంలో జంగిల్ రాజ్ మొదలైంది. ఇప్పుడు బిహార్​కు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ లాంటి సీఎం అవసరం. మూడు రోజుల క్రితం ఇన్‌స్పెక్టర్‌ హత్య.. నేడు జర్నలిస్ట్​ మర్డర్.. ఎన్ని హత్యలు జరుగుతున్నా.. నీతీశ్​ ప్రభుత్వం నిందితులను పట్టుకోవడం లేదు" అని ఆరోపించారు.

జర్నలిస్ట్​ మృతి ఘటన దురదృష్టకరం : సీఎం
జర్నలిస్ట్​ విమల్​ కుమార్​ యాదవ్​ హత్యపై ముఖ్యమంత్రి నీతీశ్​ కుమార్​ స్పందించారు. అతడి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇది చాలా దురదృష్టకర ఘటన అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Last Updated :Aug 18, 2023, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.