ETV Bharat / bharat

బూస్టర్ డోసు అవసరమేనా? కేంద్రం ఏం చేయనుంది?

author img

By

Published : Dec 24, 2021, 2:30 PM IST

Covid booster dose india
కొవిడ్ టీకా బూస్టర్ డోసు

Vaccine booster dose india: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. చాప కింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో.. కొవిడ్ టీకా బూస్టర్ డోసు అవసరం ఎంత మేర ఉందో తెలుసుకునేందుకు అధ్యయనం చేయాలని కేంద్రం భావిస్తోంది. ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌(టీహెచ్‌ఎస్‌టీఐ) నేతృత్వంలో పలు పరిశోధనల సంస్థలు ఈ అధ్యయనాన్ని చేపట్టనున్నాయి.

Vaccine booster dose india: భారత్​లో క్రమక్రమంగా కరోనా కొత్త వేరియంట్‌ 'ఒమిక్రాన్‌' కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్నవారు వెంటనే బూస్టర్‌ డోసు వేసుకోవాలని కొందరు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. బూస్టర్‌ డోసు ద్వారా ఒమిక్రాన్‌ తీవ్రత నుంచి రక్షణ కలుగుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దేశంలో బూస్టర్‌ డోసు అవసరం ఎంతమేర ఉందో తెలుసుకోవడం కోసం అధ్యయనం చేపట్టాలని భావిస్తోందని, ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌(టీహెచ్‌ఎస్‌టీఐ) నేతృత్వంలో పలు పరిశోధనల సంస్థలు ఈ అధ్యయాన్ని చేపట్టనున్నట్లు ఓ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది.

3 వేల మందిపై..

Vaccines on omicron variant: అధ్యయనంలో భాగంగా ఆరు నెలల కిందట వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్న 3 వేల మంది ఆరోగ్య పరిస్థితిని పరిశోధకులు విశ్లేషించనున్నారు. ఇందుకోసం కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌, స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ వేయించుకున్న వారిని ఎంపిక చేశారు.

"రెండో డోసు పూర్తిచేసుకున్న వ్యక్తుల్లో ఆరు నెలల తర్వాత రోగనిరోధక శక్తి సామర్థ్యం ఎలా ఉందో తెలుసుకుంటాం. ఈ క్రమంలో యాంటీ-బాడీలు, టీ.. బీ కణాల ప్రతిస్పందన ఏ విధంగా ఉందో విశ్లేషిస్తాం. ఈ అధ్యయనం ద్వారా దేశంలో బూస్టర్‌ డోసు అవసరం ఉందా..? లేదా? అనే అంశంపై స్పష్టత వస్తుంది"

-పరిశోధకులు

త్వరలో ఈ పరిశోధక బృందం 'బూస్టర్‌ డోసు' అధ్యయనంపై చర్చించేందుకు నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌(ఎన్‌టీఈజీఐ)ని కలవబోతున్నట్లు సమాచారం.

అధ్యయనం ఎలా చేస్తారు?

ఈ అధ్యయనం కోసం 3 వేల మందిని.. 40 ఏళ్లుపైబడిన వ్యక్తులు - 40 ఏళ్లలోపు వ్యక్తులు - వ్యాక్సినేషన్‌కు ముందు కరోనా బారిన పడిన వారు - ఇప్పటికే ఇతర వ్యాధులతో బాధపడుతూ కరోనా సోకిన వారు.. ఇలా నాలుగు వర్గాలుగా విభజించనున్నారు. వీరి ఆరోగ్య చరిత్ర, వ్యాక్సినేషన్‌ వివరాలు తెలుసుకొని.. రక్త నమూనాలు సేకరిస్తారు. వాటిపై పరిశోధన చేసి నివేదిక రూపొందిస్తారు. దీని ఆధారంగా కేంద్రం బూస్టర్‌ డోసు అవసరంపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.