ETV Bharat / bharat

'కరోనాతో కలిసి జీవించే స్థితికి భారత్​'

author img

By

Published : Aug 24, 2021, 9:57 PM IST

Updated : Aug 25, 2021, 6:16 AM IST

భారత్​లో కరోనా ఎండెమిక్​(covid endemic stage in india)గా మారే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అంచనా వేశారు. దేశంలో కరోనా వ్యాప్తి తీరు ప్రస్తుతం ఉన్నట్లుగానే కొనసాగే అవకాశం ఉందన్నారు. కొవాగ్జిన్ టీకాకు డబ్ల్యూహెచ్ఓ ఎప్పుడు అనుమతిస్తుందనే విషయంపై స్పష్టతనిచ్చారు.

WHO SWAMINATHAN
'భారత్​లో ఎండెమిక్ స్థితికి కరోనా వైరస్'

భారత్​లో కరోనా మహమ్మారి స్థానిక వ్యాధి(ఎండెమిక్)గా మారే స్థితికి చేరినట్లు కనిపిస్తోందని(covid endemic phase in india) డబ్ల్యూహెచ్ఓ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో వ్యాధి నెమ్మదిగా వ్యాపిస్తోందని అన్నారు. ఒక్కసారిగా కేసులు పెరగడం లేదని చెప్పారు. వైవిధ్యమైన జనాభా, భారీ భూభాగం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే.. భారత్​లో కరోనా వ్యాప్తి తీరు ప్రస్తుతం ఉన్నట్లుగానే కొనసాగే అవకాశం ఉందన్నారు. వివిధ ప్రాంతాల్లో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతాయని చెప్పారు.

నిర్దిష్ట ప్రాంతంలోని జనాభా.. ఓ వ్యాధితో కలిసి జీవించే స్థితిని ఎండెమిక్​గా పేర్కొంటారు. అంటువ్యాధి దశతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నం.

మరోవైపు, చిన్నారులకు కరోనా సోకినా.. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్వామినాథన్(WHO's Soumya Swaminathan) పేర్కొన్నారు. పిల్లల్లో స్వల్పంగానే కరోనా లక్షణాలు ఉంటాయని, మరణాల శాతం కూడా పెద్దలతో పోలిస్తే తక్కువగానే ఉందని తెలిపారు. అయితే, ఆస్పత్రుల్లో చికిత్స సదుపాయాలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

మూడో వేవ్ ఎప్పుడు(Covid third wave in india) వస్తుందో కచ్చితంగా చెప్పలేమని స్వామినాథన్ అన్నారు. అయితే, వైరస్ వ్యాప్తిని గమనిస్తూ దీనిపై ఓ అంచనాకు రావొచ్చని చెప్పారు. బూస్టర్ డోసులపై(Covid vaccine booster dose) అప్పుడే నిర్ణయం తీసుకోవడం సరికాదని చెప్పారు. ఇందుకు శాస్త్రీయ, నైతిక కారణాలు వివరించారు. ఇప్పటికే చాలా దేశాలకు టీకాలు అందలేదని చెప్పారు. డోసుల లభ్యత అధికంగా ఉన్న దేశాలు.. కోవాక్స్ కూటమికి అందించాలని విజ్ఞప్తి చేశారు.

కొవాగ్జిన్​ అనుమతులపై

భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకాకు అత్యవసర అనుమతులు(WHO clearance to Covaxin) ఇచ్చే విషయంపై సెప్టెంబర్​లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు స్వామినాథన్. కొవాగ్జిన్​కు డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక గ్రూప్ తప్పక అనుమతులు ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జులై మూడో వారంలో తొలి సెట్, ఆగస్టు మధ్యలో రెండో దఫా టీకా సమాచారాన్ని భారత్ బయోటెక్.. డబ్ల్యూహెచ్ఓకు అందించిందని తెలిపారు. దీనిపై కంపెనీని పలు ప్రశ్నలు అడిగినట్లు చెప్పారు. సెప్టెంబర్ 10లోపు డబ్ల్యూహెచ్ఓ బృందం సమావేశమవుతుందని.. ఆ తర్వాత తుది అనుమతులు వచ్చే అవకాశం ఉందని వివరించారు.

ఇవీ చదవండి:

Last Updated :Aug 25, 2021, 6:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.