ETV Bharat / bharat

కుల గణన.. రిజర్వేషన్లపై 50% పరిమితి ఎత్తివేత.. కాంగ్రెస్​ కొత్త రాజకీయం!

author img

By

Published : Apr 17, 2023, 7:16 PM IST

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ కొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది! దేశంలో రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్​ చేస్తోంది. ఈ అంశాన్ని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్​ లేవనెత్తారు. అసలు రాహుల్​ ఏం అన్నారు? జనాభా గణన చివరగా ఎప్పుడు జరిగింది? ఇప్పుడు ఎందుకు ఇంత ప్రాధాన్యం?

congress
congress

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చెక్‌ పెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తోంది. కాషాయదళంలో అసంతృప్తులను చేర్చుకుంటున్న హస్తం పార్టీ.. ఉచిత హామీలు ఎన్నికల్లో విజయాన్ని కట్టబెడతాయని భావిస్తోంది. ఇప్పటికే నాలుగు ఉచిత హామీలను ప్రకటించిన కాంగ్రెస్‌... మేనిఫెస్టోలో మరిన్ని చేర్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్​ పార్టీ కొత్త అస్త్రాన్ని సిద్ధం చేసుకుంది! ఆ అస్త్రంతో అధికారంలో ఉన్న బీజేపీపై మాటల దాడి చేస్తోంది. దేశంలో రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని హస్తం పార్టీ డిమాండ్​ చేస్తోంది. కులగణన వివరాలను బహిరంగంగా విడుదల చేయాలంటూ పలు అంశాలను లేవనెత్తుతోంది.

దేశంలో రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ డిమాండ్​ చేశారు. కులగణన వివరాలను విడుదల చేయాలని.. ఓబీసీలకు మెరుగైన ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన సూచించారు. కర్ణాటక సంఘ సంస్కర్త బసవన్న ఆశయాలను బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​ అమలు పరచట్లేదని ఆరోపించారు. భాల్కీ, హుమ్నాబాద్‌లో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్న రాహుల్​.. ఈ వ్యాఖ్యలు చేశారు.

"2011 జనాభా లెక్కల ఆధారంగా ఓబీసీ వర్గీకరణ డేటాను విడుదల చేయాలి. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలి. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. మోదీ ఓబీసీల గురించి మాత్రమే మాట్లాడతారు. కానీ డేటాను విడుదల చేయరు. మోదీకి ఓబీసీ ఓట్లు మాత్రమే కావాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఓబీసీ డేటాను విడుదల చేస్తాం. మేము (కాంగ్రెస్) అధికారంలోకి వచ్చే వరకు.. రిజర్వేషన్ సంబంధిత డిమాండ్లతో బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉంటాం. బసవన్న ఆశయాలపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దాడి చేస్తున్నాయి. దేశంలో బీజేపీ హింసను వ్యాప్తి చేస్తోంది. పేద, బలహీన వర్గాల ప్రజల నుంచి డబ్బును తీసుకొని ధనవంతులకు ఇస్తోంది."

-- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత

కులగణన వివరాలు లేకపోతే.. సామాజిక న్యాయం అసంపూర్ణమే!
సామాజిక న్యాయం, సాధికారత కార్యక్రమాల అమలు కోసం తక్షణమే కులగణన చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కులగణన వివరాలు లేకపోతే అర్థవంతమైన సామాజిక న్యాయం, సాధికారత కార్యక్రమాలు అసంపూర్ణంగా ఉంటాయని లేఖలో పేర్కొన్నారు. 2021లో జనగణన నిర్వహించాల్సి ఉన్నా.. ఇంతవరకు ఆ పని పూర్తి కాలేదని గుర్తుచేశారు. పలుమార్లు తమ ఎంపీలు సహా ఇతర ప్రతిపక్షాలు పార్లమెంటులో ప్రస్తావించిన విషయాన్ని ఖర్గే గుర్తు చేశారు.

చివరిసారిగా యూపీఏ ప్రభుత్వ హయంలో 2011-12 సామాజిక, ఆర్థిక కులగణనలో 25కోట్ల కుటుంబాలను భాగస్వామ్యం చేసినట్లు ఖర్గే తెలిపారు. కొన్ని కారణాల వల్ల ఆ జాబితా విడుదల కాలేదని.. 2014లో అధికారం చేపట్టిన బీజేపీ కూడా ఆ విషయాన్ని విస్మరించిందని పేర్కొన్నారు. తక్షణమే జనగణన జరిపి సమగ్ర కులగణనను అంతర్భాగం చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు.

ఓబీసీలపై ప్రేమ ఉంటే..
ఓబీసీల పట్ల ప్రభుత్వానికి నిజంగా శ్రద్ధ ఉంటే, కుల, సామాజిక, ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన డేటాను విడుదల చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నేత కన్హయ్య కుమార్ ప్రశ్నించారు. "తాను ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తినని ప్రధాని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వానికి నిజంగా ఓబీసీలపై ప్రేమ ఉంటే, ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడగడం చాలా ముఖ్యం. దేశ ప్రజల సామాజిక డేటాను విడుదల చేయడానికి బీజేపీ ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోంది? " అని ఆయన ప్రశ్నించారు.

బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎటువంటి డేటా ఇవ్వలేదని అని కన్హయ్య కుమార్ ఆరోపించారు. డిజిటల్ ఇండియాలో డేటా చాలా ముఖ్యమని అని ఆయన అన్నారు. దేశంలో ఎంత మంది ఉన్నారో, వారి కులం, ఆర్థిక స్థితిగతులు అందరికీ తెలియాలని చెప్పారు. 2021లో జరగని జనాభా గణన ప్రక్రియను ప్రారంభించాలని తాము ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ప్రధాని ఓబీసీ కేటగిరీ నుంచి వచ్చినట్లయితే.. ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేసేలా చూడాలని డిమాండ్​ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.