ETV Bharat / bharat

పంజాబ్​ కాంగ్రెస్​ పగ్గాలు సిద్ధూకు దక్కేనా?

author img

By

Published : Jul 15, 2021, 1:14 PM IST

Updated : Jul 15, 2021, 1:49 PM IST

congress in punjab
పంజాబ్​ కాంగ్రెస్​

పంజాబ్​ కాంగ్రెస్​లో నెలకొన్న సంక్షోభాన్ని తెరదించేందుకు ఆ పార్టీ ​అధిష్ఠానం తీవ్రంగా శ్రమిస్తోంది. నేతల మధ్య విభేదాలను పరిష్కరించి.. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఉమ్మడిగా ఎదుర్కోవాలని భావిస్తోంది. అదే సమయంలో మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ డిమాండ్లనూ పరిగణనలోకి తీసుకోవటం, పంజాబ్​ కాంగ్రెస్​ చీఫ్​గా ఎవర్ని నియమిస్తారన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​కు, మాజీ మంత్రి నవజ్యోత్​ సింగ్​ సిద్ధూకు మధ్య విభేదాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో పంజాబ్ ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ చీఫ్(పీసీసీ)​ నియామకంపై కాంగ్రెస్​ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. పీసీసీ చీఫ్​తో పాటు, ఇద్దరు కార్యనిర్వాహక అధ్యక్షులను నియమించాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

2022 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. సామాజిక వర్గాల పరంగా అందరినీ సంతృప్తిపరిచేలా పంజాబ్​లో కాంగ్రెస్​ నాయకత్వం ఉండాలని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్​ పీసీసీ చీఫ్​ ఎవరన్న దానిపై ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. అయితే.. ఇప్పటివరకు దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. "అన్ని స్థాయుల్లోనూ కాంగ్రెస్​ సంప్రదింపులు జరిపింది. పార్టీ నియామకాల్లో అసమ్మతి నెలకొనేందుకు అవకాశం లేదు" అని ఆ పార్టీకి చెందిన సీనియర్​ నేత ఒకరు తెలిపారు.

రాహుల్​తో రావత్​ భేటీ..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీతో పంజాబ్​ కాంగ్రెస్ ఇన్​ఛార్జ్​ హరీశ్​ రావత్​ సమావేశం బుధవారం జరగాల్సి ఉంది. అయితే.. అనివార్య కారణాల వల్ల రాహుల్ గాంధీ ఈ భేటీకి హాజరు కాలేదు. "రాహుల్​ గాంధీ మరో సమావేశంలో పాల్గొన్నందున నాతో భేటీకి వీలు కాలేదు. రేపు మరోసారి ఈ సమావేశం నిర్వహించాలని ఆయన్ను నేను కోరాను. పంజాబ్​ అంశంపై ఈ రోజు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు" అని హరీశ్​ రావత్​ విలేకరులతో బుధవారం చెప్పారు. పీసీసీ చీఫ్​ పదవిలో సిద్ధూని నియమిస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. అది తన చేతుల్లో లేదని చెప్పారు.

"పంజాబ్ కాంగ్రెస్​ చీఫ్​ నియామకాన్ని కాంగ్రెస్​ అధిష్ఠానం నిర్ణయిస్తుంది. అందుకు సంబంధించిన పత్రాలు నాకు అందిన వెంటనే.. తెలియజేస్తా"

- హరీశ్​ రావత్​, పంజాబ్​ కాంగ్రెస్ ఇన్​ఛార్జ్​

అదే సమయంలో.. ట్విట్టర్​లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. పంజాబ్​పై తనకు ఉన్న దృక్కోణాన్ని ప్రతిపక్షం ఆమ్​ ఆద్మీ పార్టీ(ఆప్​) ఎల్లప్పుడూ గుర్తిస్తూనే ఉంటుందని మంగళవారం వ్యాఖ్యానించారు. "మా ప్రతిపక్షం ఆప్​ పంజాబ్​పై నా దృక్కోణాన్ని, నేను చేసిన పనులను ఎల్లప్పుడూ గుర్తిస్తూనే ఉంటుంది. 2017కు ముందు నాటి బీద్​బీ, డ్రగ్స్​, రైతు సమస్యలైనా, ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభ​ సమస్యనైనా లేవనెత్తింది నేనేనని వారికి తెలుసు. పంజాబ్​ కోసం పోరాడేది ఎవరో కూడా వారికి స్పష్టంగా తెలుసు" అని ట్వీట్​ చేశారు.

ఇవీ చూడండి:

Last Updated :Jul 15, 2021, 1:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.